చదువది యెంత గల్గిన: --ఎం బిందుమాధవి

 చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా!
తాత్పర్యము: భాస్కరా! నలచక్రవర్తి వంట చేసినట్లుగా చేయుటకు మంచి కూరను తెచ్చి వండిననూ దాని యందు కొంచెము ఉప్పు వేయకున్న రుచి పుట్టదు. అట్లే మానవుడు ఎంత సంపూర్ణ విద్వాంసుడైనననూ, తాను చదివిన దాని యందలి రసము గ్రహించకున్నచో ఆ విద్య పలువురకు నుపయోగపడదు. గుణవంతులెవ్వరునూ మెచ్చరు.
* * * * *
సుజాత కి అసహనం తారస్థాయి లో ఉన్నది. టేబుల్ మీద అడ్డంగా ఉన్న స్టేప్లర్ తీసి పక్కన ట్రే లో పెట్టే వైనంలో అది గట్టిగా విసిరేసింది. అది పక్క టేబుల్ మీద సీరియస్ గా ఫైల్ చదువుతున్న రామారావు మీద పడింది. ఉలిక్కిపడి తలెత్తి చూసి, స్టేప్లర్ సుజాతకిస్తూ "ఏమయింది మేడం అంత సీరియస్ గా ఉన్నారు" అన్నాడు.
"సారీ అండి" అని మాటలో తప్ప మరే హావ భావాల్లోను సారీ వ్యక్తపరచకుండా రామారావు వంక చూసి, ధబ్బున కుర్చీలో కూర్చుంది.
సిన్సియర్ మరియు సమర్ధురాలైన ఉద్యోగి అని పేరున్న సుజాతకి ముక్కు మీదే కోపం ఉంటుందని సహోద్యోగులందరికీ అనుభవమే! కానీ ఇవ్వాల్టి ధుమ ధుమ లకి మాత్రం కారణం తెలియక అయోమయంగా చూస్తున్నారు.
కాస్త సెటిల్ అయ్యాక, పక్క సీట్ శారద సుజాతతో "ఏమయింది? పొద్దున్నే మూడ్ పాడయితే సాయంత్రం వరకు పని మీద దాని ప్రభావం పడుతుంది. నీకు ఈ విషయం చాలా సార్లు చెప్పాను" అన్నది.
"శిరీష పుటప్ చేసిన ఫైల్ నేను పెట్టాననుకుని, అందులో ఇచ్చిన వివరాలన్నీ తప్పులని, ఆ ఫైల్ తాలూకు క్లయంట్స్ ముందే మేనేజర్ నన్ను పిలిచి వాయించేశాడు. చూసుకోవాలి కదా! మధ్యలో ఆయన్ని ఆపి అది నా ఫైల్ కాదని చెప్పబోతుంటే, గొంతు మరి కాస్త పెంచి అరిచాడు. వాళ్ళు నావంక అసమర్ధురాలిని అన్నట్టు నిరసనగా చూశారు. నేను అక్కడ ఉండగానే వాళ్ళు వెళ్ళిపోయారు."
" అంతా అయ్యాక నాకు మాట్లాడే అవకాశం ఇచ్చాడు. నేను ఆ ఫైల్ నాది కాదు సర్ అని చెబితే..ముందే చెప్పచ్చుగా! వెళ్ళి శిరీషని పంపించు అన్నాడు. ఇప్పుడు పని కట్టుకుని వాళ్ళకి పిలిచి ఆయన చెబుతారా? నేను చెప్పగలనా..ఆ తప్పు నాది కాదని" అన్నది ఆగి ఊపిరి తీసుకుంటూ!
"మేనేజర్ చేసిన లాంటి తప్పే నువ్వూ ఇప్పుడు చేశావు. నువ్వు స్టేప్లర్ విసురుగా పడేశావు. అది వెళ్ళి రామారావు మీద పడింది. మంచివాడు కాబట్టి సరిపోయింది. అయినా కోపం వచ్చినప్పుడే తమాయించుకోవాలి. ఒక్క నిముషం శాంతం వహిస్తే, ఆ ఉధృతం తగ్గుతుంది" అన్నది శారద.
సుజాత స్టేప్లర్ విసిరేసినప్పుడు రామా రావు ముందు కూర్చుని ఉన్న పంకజ్ "మంచి వర్కర్ అయినంత మాత్రాన ఈవిడ గారి దురుసుతనాన్ని ఎవరైనా ఎందుకు భరించాలి? మొన్నటికి మొన్న సబ్ స్టాఫ్ ఆవిడ పేపర్స్ తెచ్చి పొరపాటున నా టేబుల్ మీద పెట్టాడని, ఆ సబ్ స్టాఫ్ ని తిడుతూ విసురుగా పేపర్స్ నా టేబుల్ మీద నించి తీసుకుంటూ పేపర్ వెయిట్ నా కాలి మీద పడేసింది. అప్పుడు నా బొటన వేలికి తగిలిన దెబ్బతో రెండు రోజులు బాధ పడ్డాను" అన్నాడు నెమ్మదిగా.
"నువ్వు చెప్పింది కరెక్టే! నలుగురిలో తిరిగేటప్పుడు కొంచెం తమాయించుకోవటం నేర్చుకోవాలి! ఎన్ని మంచి లక్షణాలున్నా, ఒక్క బలహీనత ఉంటే చాలు, అది అన్నిటినీ మరుగున పడేస్తుంది."
"మన దగ్గర పని చేసే సంగీతరావు భార్యది రేర్ బ్లడ్ గ్రూప్. ఆవిడ హార్ట్ ఆపరేషన్ కి రక్త దాతలకోసం వెతుక్కుంటుంటే సుజాత గారు తను ఇవ్వటం కాక, అలాంటి వారిని ఇంకో ఇద్దరిని వెతికి పట్టుకుని సహాయం చేసింది. అంతగా ఇతరుల గురించి ఆలోచించే వ్యక్తి, మంచి వర్కర్, పనిలో ఇతరులకి సహాయం చేసే వ్యక్తి... కొంచెం తన భావోద్వేగాలని నిగ్రహించుకోగలిగితే మనం ఇలా మాట్లాడుకునే పరిస్థితి రాదు" అన్నాడు రామారావు.
"మా నాన్నగారి ఫ్రెండ్ ఒకాయన ఉన్నారు. ఆయన బాగా చదువుకున్నవారు. చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. కానీ మాటల్లో హుందాతనం ఉండదుట. మొన్న ఇంకో ఫ్రెండ్ కూతురు పెళ్ళికి వెళ్ళి, "ఎన్ని లంచాలు మింగాడో, ఇంత గ్రాండ్ గా పెళ్ళి చేస్తున్నాడు" అని అందరూ వినే లాగా అన్నాడుట. కొంత మంది తమ చదువుకి, హోదాకి సంబంధం లేనట్టు చీప్ కామెంట్స్ చేస్తారు."
"అందుకే మన సుజాత గారయినా, మా నాన్నగారి ఫ్రెండ్ అయినా
"చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా (37)
చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
....................................................................
......................ఉప్పు లేక రుచి పుట్టునటయ్య భాస్కరా"
అని భాస్కర శతక కారుడన్నట్లు...ఉప్పు లేని వంట లాంటి వారన్నమాట. వారి ప్రవర్తనతో గుణ విహీనంగా నలుగురి నోళ్ళల్లో పడి, విమర్శలు ఎదుర్కుంటారు" అన్నది కమల, తను కూడా సంభాషణలో పాలు పంచుకుంటూ!

కామెంట్‌లు