నిత్యనూతన జానపద గేయాలలో
నడయాడిన నవరస తెలుగు
కవిత్వ విన్యాసం
నన్నయ మార్గకవితలో లిఖితరూపమై
నూతన రీతుల పాల్కురికి,
నన్నెచోడుల జానుతెనుగులోనర్తించి,
నాటకీయ శైలిలో తిక్కన గంటాన
నాట్యమాడింది ;
నడిమి భారత భాగాన్ని రచించిన
నైపుణ్యవంతుడు ఎఱ్ఱన కవీశ్వరుని
వర్ణనల్లో ఎదిగి ఒదిగింది ; వాణి నెన్నెదుటను
శిరసు వంచి కవిత్వ తత్త్వ మహత్వాన్ని, కవనాన
నేర్పునూ సాధించిన అద్భుత కవి,
నిరుపమాన కవి పోతన్న రచించిన
నందగోపుని భాగవత కథలతో
నాడూ నేడూ అందరి నాల్కలపై
నృత్యం చేస్తోంది ;
నాదోపాసకుడు శ్రీనాథుని నైషథ
కావ్యంలో,
నుగ్గు నుగ్గయిన కంచుఢక్కలో
నూతన సొబగులను పొందింది,
నవ్యరీతుల ప్రబంధాల్లో నయగారాలొలికించింది,
నొక్కి వక్కాణించి నవలీకరించిన
నోరి నరసింహశాస్త్రి రచనల్లో
నిగారింపు నందింది ;
నీతికథల దారుల్లో నిబద్ధమై నైతిక
జీవనాన్ని నిర్దేశించింది ;
నాటి నుంచి నేటి కవుల
కవుల విభిన్న రీతుల్లో
నవనవోన్మేషమై నిఖిలమై నిలుస్తోంది.
నవ్య కవులు నిఖార్సైన
పదబంధాల్లో
నింగికి నేలకు వేసిన నిచ్చెనపై
నిగనిగలాడుతూ నభముపై విజయ నికేతనమై విరాజిల్లింది ;
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి