జీవన తాత్పర్యం.... ;- ప్రమోద్ ఆవంచ- 7013272452

 ఏ ప్రాంతం వారైనా వారి వారి సంస్కృతి సంప్రదాయాలు, స్థానికంగా వారు మాట్లాడుకునే భాష, పద ఉచ్చారణలో, ఆత్మ,ఎం ఆత్మీయత,ప్రేమ, బంధాలు, బంధుత్వాలు ఉంటాయి.తెలుగు రాష్ట్రాలలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్థానికత ఉంది.పుట్టిన ఊరు, పెరిగిన పరిసరాలుకుల వృత్తులలో వాళ్ళు రోజూ వాడే పరికరాలు, ముఖ్యంగా వ్యవసాయ పనులకు సంబంధించిన పనిముట్లు, వీటన్నింటి గురించి ఆయా ప్రాంతాల్లో పలుకుబడిలో, ఉన్న బాషలో మాట్లాడుకుంటారు.ఆ బాష ఎంత సహజంగా ఉంటుందో,అంతే మట్టి గుబాళింపు వస్తుంది.అదే ఉత్తర తెలంగాణ లో పలుకుబడి లో ఉన్న భాష.  ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ దగ్గర పోతారం( ఎస్) చిన్న పల్లెటూరు.1962, అక్టోబర్ 17 న,ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు కవి, సాహితీవేత్త, అన్నవరం దేవేందర్.తండ్రి దశరధం ఉపాధ్యాయులు, తల్లి కేదారమ్మ గృహిణి.చదువు పోతారం ( ఎస్),అంతకపేట,హూస్నాబాద్, హన్మకొండ లలో జరిగింది.చిన్నప్పుడు తాతయ్య తో, పొలానికి వెళ్లి, అక్కడ వ్యవసాయ పనులు చేసేవాడు.అప్పటి నుంచి కుల వృత్తుల జీవితాలను దగ్గరి నుంచి  చూడడం వల్ల,ఈయన ఎంతో ప్రభావితం చెందారు.కుల వృత్తులు చేసుకునే వారందరికీ వ్యవసాయం తో, సంబంధం ఉండేది.పంట పండితేనే  వడ్లు, బియ్యం, డబ్బులు.ఒక్క వ్యవసాయం భరోసా తోనే, అనేక మంది జీవితాలు కొనసాగేవి.అలా గ్రామాల్లో మాట్లాడుకునే భాషను,మాట మాటలో ఉన్న మాధుర్యాన్ని వట్టబట్టుకున్నారు అన్నవరం దేవేందర్.జీవగడ్డ సాయంకాల దిన పత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తూ సమాజం పట్ల తన వంతు బాధ్యతను నిర్వహించారు.ఆ తరువాత పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగిగా,అటు తర్వాత కవిగా, రచయితగా,సాహితీ వేత్తగా ఎదుగుతూ, వచ్చారు.ఇప్పటికీ సాహిత్య ప్రపంచంలో కవితా వింతనాలు జల్లుతూ, వ్యవసాయం చేస్తున్నారు.ఆయన ఈ మధ్య రాసి ప్రచురించిన "జీవన తాత్పర్యం" కవితా సంకలనాన్ని చదివాక,నా ఫీలింగ్స్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను.
                  ఇల్లు అంటేనే అమ్మ ముఖచిత్రం.అమ్మ అంటేనే ఇంటి ప్రపంచం... ఎంత గొప్ప వ్యక్తీకరణ.చందమామను చూపిస్తూ, అన్నం ముద్దను నోట్లో పెట్టడం అమ్మ ఎత్తుగడ,కవిత్వ ప్రారంభ పదాలన్నీ,ఆ గోరు ముద్దల శిల్పమే.అద్బుతం కదా, ప్రతి కవిత్వ రచనకు కావాల్సింది... వస్తువు, శిల్పం,ఎత్తుగడ, వీటన్నింటినీ మన అందరికీ తొలి గురువు అయిన అమ్మ, చందమామను చూపిస్తూ, గోరు ముద్దలు తినిపించే కవిత్వం గా అభివర్ణించారు.
                  ప్రకృతిలో, నేల, ఆకాశం,ఎండ,వాన, మంచు,అడవి, చెట్టు, పూవులు, వీటిని ఎప్పుడు చూసినా కొత్తగానే కనిపిస్తాయి.కానీ మనం వాటి మీద దృష్టి కేంద్రీకరించం.తెల్లవారితే సూర్యుడు వస్తాడు, రాత్రి అయితే చంద్రుడు వస్తాడన్న అభిప్రాయంలో ఉంటాం.కానీ ఒక కవి కోణం నుంచి ఉదయాన్ని చూస్తే,
చాలా అద్భుతంగా వుంటుంది.ఆకాశం నుంచి సూర్యుడు మనకు షేక్ హ్యాండ్ ఇస్తాడు.ఒక మంచి రోజుకి స్వాగతం పలుకుతాడు.నిద్ర లేచి దర్వాజా బయటికి వచ్చాక, నేలను తాకిన కాళ్ళు,వాటితో పాటు, దేహం,మట్టి తరంగమై పులకరిస్తుంది.వాకిట్లో వేసిన ముగ్గులు చూస్తుంటే, గొప్ప కళాఖండం మన ఇంటి కడప ముందు చిత్రించినట్లుంటుంది.మొక్కలకు నీళ్ళు పోస్తుంటే, పచ్చని ఆకులు నాతో ముచ్చట పెట్టినట్లు ఉంటుంది.పందిరి మీద బచ్చలి తీగను అందుకుంటుంటే, "చెక్కిలి గిల్" అయితది.బంతి పూలు చిరునవ్వుతో, జల్లులు కురిపిస్తాయి.ఇదీ "పొద్దున్నే లేస్తే"కవిత.కవి ప్రతి సందర్భాన్ని చూసే కోణం అసాధారణమైనది.అన్నవరం గారు,పల్లెల్లోని, ప్రకృతి అందాలను,తన రోజుని
తనదైన శైలిలో ఆవిష్కరించారు.
                     తన పదవ తరగతి క్లాస్మేట్ కూతురు అచ్చం అమ్మ నోట్లో నుండి ఊడి పడ్డట్లు ఉన్నట్లు "అచ్చం"కవితలో చాలా బాగా చెప్పారు.గుర్తుకు రాని ఆకారం,మనో ఫలకం లోపల ఎక్కడో పరిచయమున్న
ముఖం.పన్ను మీద పన్ను మెరుపు...నవ్వుతుంటే తెల్లని పలు వరస.చెంప మీద సొట్ట,నొసల మీద చెమట... మాటలు జల జల పారే సెలయేరు... ఇదీ ఆయన అద్బుత వర్ణణకు ప్రతీక.
                 తన "సృజన" కవితలో, నడుస్తూ, నడుస్తున్నప్పుడు మెరిసే ఆలోచనే సృజన అంటారు.కవి కలం కవిత్వమై ప్రవహించాలంటే, మనసు నిండా సృజన పారాలి అని అంటారు.
                 అమ్మమ్మ ఇంటికి పోయి రావాలె,అమ్మ అంబాడిన నేలను తాకి రావాలె..మ్యాన మామలతో
మాట్లాడితేనే బంధుత్వం తీగల బలం తెలుస్తోంది అంటారు కవి అన్నవరం తన "పోయి రావాలె" కవితలో! మనమందరం చాలా వరకు అమ్మమ్మ ఇంట్లోనే పుట్టాం.పెరిగి పెద్దయ్యాక ప్రతి పండుగ సెలవులకు వెళ్ళడం అందరం చేసాం.కానీ పొట్ట
తిప్పల కోసం నగరాలకు వలస బోయి, పండుగలకు,పంబాలకు కూడా సొంత ఊరికి పోయే పరిస్థితి ఇప్పుడు లేదు.ఈ కవిత చదువుతుంటే ప్రతి మనిషి ఏదో కోల్పోయినట్లనిపించడం సహజం.
                  "కవి చెట్టు"కవితలో కవిత్వం విరబూసిన మహా వృక్షం అంటారు.చూపునిచ్చిన కళ్ళకు కన్నీళ్ళతో,కడగడమే అమ్మ నయనాలలో డ్రాప్స్ వేయడం అంటూ తన బాధను వ్యక్తం చేసారు "కాటరాక్ట్"కవితలో.కెరళ అందాలను వివరిస్తూ"పరవశం" కవిత అద్బుతం గా ఉంది.
                    తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ ప్రాతిపదికన ఆయన కవిత్వం రాస్తారు.రాసే ప్రతి కవితలో, తెలంగాణ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు
 స్థానికతకు చెందిన బాష..ఆ భాషలో,యాస మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది.
                  కవిత్వంలో,జీవ బాష ఉపయోగించే అన్నవరం దేవేందర్ గారి ఇతర రచనలు తొవ్వ,నడక,మంకమ్మ తోట లేబర్ అడ్డ,బుడ్డా పర్కలు-
నానీలు, బొడ్డు మల్లె చెట్టు,ఫార్మ్ లాండ్ ఫ్రాగ్రేన్స్- ఇంగ్లీషు లోనికి అనువదించారు, పొద్దు పొడుపు,పొక్కిలి వాకిళ్ళ పులకరింత, బువ్వ కుండ- దీర్ఘ కవిత, ఇంటి దీపం,వరి గొలుసులు,గవాయి,ది అన్ ఈల్డింగ్ స్కై,ఇవి కాకుండా వ్యాసాలు మరో కోణం ( సామాజిక వ్యాసాలు),ఊరి దస్తూరి ( తెలంగాణ సాంస్కృతిక చిత్రణ, కాలమ్స్).
                   చివరిగా ఈ పుస్తకంలోని "నీలోకి నీవే"కవిత గురించి కొంచెం మాట్లాడాలి, ప్రతి మనిషిలో
ఎంతో అంత అహం,ఇగో, నేనే గొప్ప,నాకే అంతా తెలుసు అన్న ఫీలింగ్ ఉంటుంది.అలాంటి వారి గురించి...నీలోకి నీవు ఒక్కసారైనా తొంగి చూడు, గుండె గోడల్లో ఏమైనా కొవ్వు పేరుకొని ఉండొచ్చు.నీ అంతరాత్మ కుహరంలో, ఒకసారి చెయ్యి పెట్టి దేవులాడుతుండు,నీ అహంకార మాటలతో, ఎవరినైనా నొప్పించి వుంటే, ఆ బుడిపెలు వేళ్ళకు తగలవచ్చు..... దంతాలకు అంటిన అబద్దాల గార, శరీరానికి పట్టిన పాపాల జిగట,నీ మస్తిష్కంలోని,మాలిన్యపు మబ్బులు కరిగిపోతే కానీ,ఆత్మావలోకపు పుష్పం వికసించదు...ఎంత శక్తివంతమైన వ్యక్తీకరణ.మొత్తం ఈ పుస్తకం గురించి కవి,సాహితీవేత్త వేణు సంకోజు మాటల్లో చెప్పాలంటే,
అన్నవరం దేవేందర్ గారు తనను తాను పుటం పెట్టుకొని శక్తివంతమైన రచన చేసారని అంటారు.
                  చివరిగా కవి, సాహితీవేత్త నారాయణ శర్మ
గారు అన్నవరం దేవేందర్ గురించి రాసిన నాలుగు మాటలను ఊటంగిస్తూ, ముగిస్తాను... ప్రజా సమూహం లోని జీవ బాషలోనే, అక్కడి సంస్కృతి సంపన్నమౌతుందని,ఆలోచిస్తాడు అన్నవరం.వస్తువు దాన్ని దర్శించే గుణం,వ్యక్తీకరించే పరికరాలు,అందులోని జీవజీవాలు ఇవి అన్నవరం కవిత్వానికి తోరణాలు.ఒక కోణంలో ఒక స్తబ్దత నుంచి
చైతన్యం వరకు, నిశ్శబ్దం నుంచి నినాదం వరకు అన్నవరం కవిత్వం వెళుతుంది.భాషాముఖంగా, వస్తువు ముఖంగా, కూడా అన్నవరం కవిత్వం తెలంగాణ నుడికారపు ఔద్వేగిక జీవధార.....
                      ఎప్పటి లాగే మళ్ళీ మళ్ళీ చెపుతున్నా
 ఈ అద్భుతమైన పుస్తకాన్ని కొని చదవండి.
                                  ‌
కామెంట్‌లు