సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -463
కూటకార్షాపణ న్యాయము
*****
కూటకం అంటే కొప్పు,ఏడికోల లేని నాగలి, మోసము,అసత్యత అనే అర్థాలు ఉన్నాయి.ఆర్ష అనగా ఋషి సంబంధమైన,ఋషికృతమైన, పవిత్రమైన.ఆపణం అంటే అంగడి, బజారు అనే అర్థాలు ఉన్నాయి.
తెలియక చెల్లని నాణెములను అంగట్లో  సరుకుల కొనుగోలులో వాడినట్లు.
 మన దగ్గర దాచుకున్న రూపాయ నాణెములలో చెల్లనివి కూడా ఉండొచ్చు. కానీ మనకు అవి చెల్లనివి అని తెలియక వాటిని మామూలుగా తీసి వాడుతుంటాము.వాటిని అంగడిలో లేదా బజారులో వాడుకలో ఉపయోగించినప్పుడు అవి చెల్లవని మనకు తెలిసినప్పుడో, ఇతరులు గుర్తించి చెప్పినప్పుడో వాటిని తీసి పారవేస్తాము. అంటే అవి అప్పటి వరకూ మంచి నాణెములతో సమానంగా  కలిసి చెలామణీ అవుతూ ఉంటాయి.
అలాగే మనతో కలిసి వున్న వ్యక్తులు  చెల్లని నాణెములుగా వున్నట్లయితే అంటే  ఏమిటి అనే సందేహం ఎవరికైనా వస్తుంది.వాళ్ళ వల్ల ఇతరులకు ఎలాంటి ఉపయోగం వుండదు.వాళ్ళతో కలిసి వుంటే మంచి కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది. అందుకే ఫలానా వాళ్ళు చెల్లని నాణెం లాంటి మనస్తత్వాన్ని కలిగి వున్నారని తెలిసిన వెంటనే వారిని పక్కకు పెడతాం.దూరంగా వుచుతాం.అప్పటి వరకు వాళ్ళ గురించి తెలియక విపరీతమైన గౌరవమర్యాదలు చేస్తూ ఎంతో గొప్ప వారిగా చూస్తాం అనే అర్థంతో మన పెద్దవాళ్ళు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 దీనికి సంబంధించి చదువుతుంటే మనకు ఠక్కున గుర్తొచ్చే పద్యం వేమన రాసిన పద్యం. అదేంటో చూద్దాం.
"ఉప్పు కప్పురంబు నొక్కపోలిక నుండు/ చూడ జూడ రుచుల జాడ వేరు/ పురుషులందు పుణ్య పురుషులు వేరయా/ విశ్వధాభిరామ వినురవేమ!" 
 
ఉప్పు ,కర్పూరము చూడటానికి రెండూ ఒకే విధంగా కనిపిస్తాయి. కానీ వాటి రుచులు వేరు.అలాగే మనుషులంతా ఒకే విధంగా కనిపించినా బాగా పరీక్షగా చూస్తే అంటే వారి ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తే వారిలో  మంచివారు ఎవరో చెడ్డ వారు ఎవరో తెలుస్తుంది.
 అలాగే చెల్లని నాణెం, మంచి నాణెం మామూలుగా చూసినప్పుడు రెండు ఒకేలా కనిపిస్తాయి.కాస్త పరిశీలనగా చూస్తే ఆ నాణెం మీద గీతలు పడటమో,సత్తు పడిపోవడమో కనిపిస్తుంది . ఇలా మంచి నాణెం, చెల్లని నాణెం  మధ్య తేడా కనిపించినప్పుడు మనం వెంటనే చెల్లని నాణాన్ని పక్కకు పెట్టేస్తాం.
 కాకపోతే నాణేలంత తేలికగా మనుషుల మనసులు తెలుసుకోవడం  కుదరదనుకోండి. ఒకోసారి అలాంటి వారి బారిన పడి మోసపోయాక గానీ ఆయా వ్యక్తుల అసలు స్వరూపం బయట పడదు.
 ఇక కూటాకార్షాపణ న్యాయాన్ని మరో కోణంలో చూస్తే మనకు మనం కూడా కొన్ని విషయాల్లో చాలా అజ్ఞానంతో వుంటామనీ, మూఢంగా నమ్ముతామనీ, మూర్ఖంగా ప్రవర్తిస్తూ  వుంటామనీ అర్థమై కానట్టుగా వుంటుంది.
 ఎప్పుడైతే మనలో అలాంటి అజ్ఞానం పటాపంచలు అవుతుందో అప్పుడే జ్ఞానమనే వెలుగు మన లోలోపల ప్రసరిస్తుంది. అప్పటి వరకు పెట్టుకున్న పిచ్చి నమ్మకాలు,అభిప్రాయాలు, ఆలోచనలు అన్నీ మారిపోతాయి. మంచి చెడుల విచక్షణ  వివేచన జ్ఞానం కలుగుతుంది.
అప్పటి నుండి మనమేంటో మనకూ, మనతో వున్న వారికి మన పట్ల స్థిరమైన అభిప్రాయం, నమ్మకం కలుగుతాయి.ఇక మనం జ్ఞానోదయం అనే వెలుగులీనుతూ ఇతరులకు ఆ వెలుగులో తమ్ము తాము చూసుకునే అవకాశం కలిగించిన వారమవుతాము.
దీనినే ఆధ్యాత్మిక వాదులు తమను తాము తెలుసుకోవడమనీ,దీనినే ఆత్మ జ్ఞానమని కూడా అంటారు.
లోతైన అవగాహన, శోధన, పరిశీలనతో మానవ జీవితానికి అన్వయించి న్యాయాలను  సృష్టించిన మన పెద్దలు ఎంత గొప్ప వారో  కదా!
మనం వారి  వారసులుగా ఇవన్నీ తెలుసుకోవడం నిజంగా మన అదృష్టం. మనం చేయాల్సిన పని ఒక్కటే. వారు అందించిన ఈ  న్యాయాల సంపదను వీలైనంత వరకు అందరికీ అందించే ప్రయత్నం చేయాలి.చేద్దాం.ఇదండీ ! ఈ కూటకార్షాపణ న్యాయము లోని అసలైన అంతరార్థం. అది తెలుసుకున్నాం.ఇక వెంటనే  ఆలస్యం చేయకుండా మనలో జ్ఞానమనే దీపాన్ని వెలిగించుకుందాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు