వీరంతా నేను గతంలో పనిచేసిన వెల్దండ ఉన్నత పాఠశాల (2004-2005) కు సంబంధించిన పదవతరగతి విద్యార్థులు.ఈరోజు మావారికి మరియు మా గురువులందరికీ ఎంతో సంస్కార యుతంగా గౌరవ సత్కారం చేసారు.
వీరిలో చాలా మంది అసిస్టెంట్ ప్రొఫెసర్, మేనేజర్ స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు.మరికొందరు విద్యార్థుల్లో ఒక ప్రత్యేకత ఉన్నది.అదేంటంటే బాగా చదువగలిగే పిల్లలయినా ఆనాటి కుటుంబ కారణాల రీత్యా ఉన్నత విద్యనభ్యసించ లేకపోయినా తాము బడిలో నేర్చుకున్న సంస్కారంతో, నేర్చుకున్న విద్యను తమ తమ ఆసక్తులతో మరింత పెంచుకొని, ఎవరికి వారుగా గ్రామ స్థాయిలోనే స్వంత వ్యాపారాలను పెట్టుకొని,ఆ వ్యాపారాన్ని అభివృద్ధి దిశగా పెంపొందించుకున్నారు.
ఎనిమిది, తొమ్మిది తరగతుల్లోనే అనేక కష్టాలనుభవించి,కూరగాయలమ్మి,ఆటో నడిపి, వాటితో పొదుపు చేసిన డబ్బులతో టెంట్ హౌజ్ నిర్వహిస్తూ, గ్రామం లోని యువత కోసం ఒక సహకార యువజన సంఘాన్ని నడిపిస్తూ,ఆ సంఘం ద్వారా ఎంతో మంది పేదలకు ఆపన్న హస్తాన్ని అందిస్తూ, యువతకు పొదుపు మంత్రాన్ని నేర్పిస్తున్న వెంకటేష్ అభినందనీయుడు.ఈ యువకుడు ఇప్పటికీ ఎన్నో పుస్తకాలను చదువుతూ, మధ్య మధ్యలో వచ్చే సందేహాలను మా ఉపాధ్యాయులకు ఫోన్ చేసి తెలుసుకుంటూ ప్రతి నెలా తమవారందరికీ చక్కటి సందేశాత్మక ఉపన్యాసాన్ని అందిస్తాడు.తాను,తన మిత్రులు కలిసి పొదుపు చేసిన డబ్బులతో ఒక స్థలాన్ని కూడా కొన్నారు.అందరికీ లాభం చేకూరాలనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నామని చెప్పారు.తాను బ్రతుకుతూ,పదిమందినీ బతికించే వైపు పయనించే ఈ ఉద్యోగానికి మించినవి ఇతర ఉద్యోగాలని నేను భావించడం లేదు.
ఎవరో ఏదో ఉద్యోగం కల్పిస్తారని ఆశ పడకుండా తమ స్వయంకృషితో తామే ఎదిగారు వీరందరూ., గ్రామంలోనే బట్టలదుకాణం నిర్వహిస్తున్న నరేష్,అలంకరణ పని(డెకరేషన్) నిర్వహిస్తున్న పరమేశ్,గ్రామావసరాలకు అనుగుణమైన ఇతర వ్యాపారాలతో తమను తాము తీర్చిదిద్దుకుంటున్న భాను చందర్, భాస్కర్, శ్రీకాంత్ మరియు ఇతర విద్యార్థులు అభినందనీయులు.
లక్షల వేతనాలతో కూడిన ఉద్యోగాలే ఘనమైనవని అనుకోకుండా తాము కడుపు నిండా తింటూ,మరో పదిమంది కడుపు నింపేలా చేస్తున్న వీరి గ్రామస్థాయి ఉద్యోగాలు కూడా గొప్పవే అని నా భావన.
అంతే కాదు వీరంతా వారి వారి కుటుంబాలతో సంతోషంగా, ఆనందంగా ఉన్నారు.
దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుగొమ్మలం టారు.నిజంగా ప్రతి గ్రామంలో ఇలాంటి యువకులంతా స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకొని, అభివృద్ధి దిశగా సాగితే, ఉరుకుల పరుగుల రణరంగం లాంటి పట్టణ జీవితాల్లో కాలుష్యం తగ్గడంతో పాటు, కుటుంబ వ్యవస్థ పటిష్టమవుతుంది కదా అనిపించింది.
ఉన్నతమైన ఆలోచనలు కలిగిన ఈ మా విద్యార్థులు ఈనాడు జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించడానికి మా ఇంటికి వచ్చిన సందర్భంలో దిగిన చిత్రమిది.
ఫోన్ చేసి చెబితే సరిపోతుంది అన్నా కూడా, లేదు, లేదు మేము స్వయంగా వచ్చి ఆహ్వానించడమే సరైన పద్ధతని చెప్పి,ఆహ్వానించి, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఆదర్శ గమనం.;- త్రిపురారి పద్మ.(ఆర్). జనగామ
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి