తండ్రి అంత్యదశ;- - యామిజాల జగదీశ్
 తండ్రి వృద్ధాప్యం చాలా వరకు మౌనంగానూ ఒంటరిగానూ గడుస్తుంది. ఒక్కొక్కప్పుడైతే కుటుంబసభ్యుల నుంచి నిర్లక్ష్యానికి నిరాదరణకు గురవుతాడు. అందుకే తండ్రి అనే వాడు సదా ఏదో ఒక పని చేస్తుండాలని అనుకుంటాడు. ఏదీ చేయ లేని స్థితిలోకి నెట్టబడకముందే తనువు చాలిస్తే బాగుంటుందనుకుంటాడు. 
కుటుంబం కోసం శ్రమించి పదవీ విరమణ చేసిన తర్వాత అతను కాస్తో కూస్తో గౌరవంగా బతకనీయాలి.
అంతేతప్ప ఓ మూలన పడి ఉండండి...మౌనంగా ఉండండి...ముప్పొద్దులా పెట్టింది తిని కిమ్మనక కూర్చోండి....అన్నట్లుగానే ఉంటుంది చాలా మంది పిల్లల తీరు.ఉంటుంది.
వయస్సు మళ్ళిన తండ్రి తన కుటుంబ సభ్యుల నుంచి చాలా తక్కువగానే ఆశిస్తాడు. ఎందుకంటే అప్పటి వరకూ అడగటం అలవాటు లేని ఆ ఇంటి పెద్దగా ఉండిన ఆ మనిషి ఇవ్వడం మాత్రమే తెలిసిన వ్యక్తిగా గడిపేసుంటాడు. కనుక వయస్సయిన తర్వాత నోరు తెరచి అడగటానికి ఆలోచనలో పడతాడు. కనుక కుటుంబసభ్యులే అతని అవసరాలు గ్రహించి చేయడం మంచిది. ఒకవేళ అతనికి చదివే అలవాటు ఉంటే ఏదో ఒక పత్రిక కొని పెట్టొచ్చు. అది చదువుతూ కొంత సమయం గడుపుతాడు. చిల్లర ఖర్చుల కోసం కొద్దిగానైనా డబ్బులివ్వొచ్చు.ఓ మూలన పడి ఉండమని కాకుండా మీలో మనిషే అన్నట్లుగా కుటుంబసభ్యులు చిన్న చిన్న పనులు చెప్పొచ్చు. మనవడు మనవరాళ్ళతో ఆడించొచ్చు.
చూసుకుని చూసుకుని జీవితాన్ని ఆ మనిషికి ఇప్పుడు పిల్లల హయాం. కనుక పిల్లలే అతనికి ఏదో ఒకటి చేయాలి.
ఒకరు మరణించాక అది చేయలేదు ఇది చేయలేదే అని నలిగే కన్నా ఉన్నప్పుడే అతని చివరి రోజులు ప్రశాతంగా గడిచిపోయేట్లు చూడాలి పిల్లలు.
భార్యను కోల్పోయిన తర్వాత ఆ మనిషి ఏకాకితనం దుర్భరమైనదని పిల్లలు అర్థం చేసుకోవాలి.
ఒక స్త్రీ భర్తను కోల్పోయిన తర్వాత ఆ బాధను దిగమింగి తన పిల్లలతో కలిసిపోగలదు. పరిస్థితులకు తగినట్లు స్త్రీ తనను తాను మలచుకోగలదు.
కానీ అప్పటి వరకు కుటుంబ పెద్దగా సంపాదనపరుడిగా ఉండి ఇంట్లో పైచేయనిపించుకునేలా గడిపిన వ్యక్తి భార్యతో తన ఒత్తిళ్ళు అవీ ఇవీ పంచుకుని ఉంటాడు. కానీ భార్యను కోల్పోయి వృద్ధాప్యంలో ఉన్న మగాడి పరిస్థితి ఒకింత క్లిష్టతరమైనదే. కనుక ఆ మనిషి స్థితిని గ్రహించి పిల్లలే తండ్రికి మర్యాద చూపాలి. నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించకూడదు. 
ప్రతి కొడుకూ ప్రతి కూతురూ ఈ వాస్తవాన్ని చదివి తండ్రి పట్ల సన్నిహితంగా మెలగాలనే నేను తమిళంలో చదివింది మనసుకు నచ్చి 
తెలుగులో ఆ మాటల్ని పంచానంతే.

కామెంట్‌లు