శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం - 10:-సి.హెచ్.ప్రతాప్
 శ్రీ గురు గీత లోని శ్లోకాలు:
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే  నమః
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే  నమః
సందర్భం లో బాబా నానాతో " నీ ఇంటి గడపలోకి ఎవరైనా వచ్చి సహాయమడిగితే  నీ శక్తి సామర్ధ్యాల మేరకు వారికి దానమిచ్చి పంపు. ఏమీ లేకపోతే కనీసం రెండు మంచి మాటలైనా చెప్పు” అని సలహా ఇచ్చారు.అలాగేనని నానా  తలూపి వెళ్ళిపోయాడు .నాలుగయిదు రోజుల తర్వాత అతని ఇంటికి ఒక ముసలావిడ వచ్చి కాస్త అన్నం వుంటే పెట్టమని అడిగింది.ఇంట్లో పెట్టేందుకు ఏమీ లేదని నానా పనిమనిషి ఆ ముసలిదానిని పంపించబోయింది కాని ఆ ముదుసలి ఏమైన పెడితే కని వెళ్ళనని భీష్మించుకు కూర్చుంది. ఇంతలో ఇంట్లోంచి నానా వచ్చి ఎవడబ్బ సొమ్మని నా ఇంట్లోకి వచ్చి బిచ్చమడుగుతున్నావని పెద్దగా తిట్టి ఆమెను మెడ బట్టి గెంటేసాడు.
నానా కొంతకాలానికి శిరిడీ వెళ్ళి సాయిని దర్శించుకున్నప్పుడు “ నీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను మెడ బట్టి బయటకు గెంటేసావెందుకు?” అని అడిగారు.
బాబా మటలకు  నానా ఆశ్చర్యపోయాడు. తను తన సమర్ధ సద్గురువైన బాబను బయటకు పంపించడమేమిటీ అని ఎంత తల పగలుకొట్టుకొని ఆలోచించినా అర్ధం కాలేదు.
“నేను బిచ్చగత్తె రూపం లో నీ ఇంటికి వచ్చినప్పుడు నెను నీకు ఉపదేశించిన సలహను మరిచిపోయి నీళ్లైనా ఇవ్వకుండా నిర్ధాక్షిణ్యంగా తరిమేసావు. సాయి రూపం లో వున్న నాకు పంచ భక్ష్య పరమాన్నాలను పెడతావు, కాని ముసలి రూపంలో వస్తే దూషిస్తావు. ఇంకెప్పుడు నా తత్వాన్ని అర్ధం చేసుకుంటావు ? “ అని సాయి అడిగాసరికి నానా సిగ్గుతో తల వంచుకున్నాడు.
   
“మనుష్యులైనా, జంతువులైనా, క్రిమి కిటకాదులైనా ౠణానుబంధం వలనే మన వద్దకు వస్తారు. మన శక్తిని బట్టి వారిని ఆదరించాలి కానీ చీదరించు కోకూడదు. ఒకవేళ ఇచ్చేందుకు ఏమీ లేకపోతే అదే మాట

సౌమ్యంగా చెప్పాలి గాని చీదరించు కోకూడదు. ఒకరు మరొకరిని దూషిస్తే నాకెంతో బాధ కలుగుతుంది. సర్వ జీవ సమనత్వం, సర్వ మానవ సౌభ్రాతృత్వం త్రికరణ శుద్ధిగా ఆచరించువారు నాకెంతో ఇష్టులు “ అని శ్రీ సాయి ఒక అద్భుతమైన బోధ చేసారు.

కామెంట్‌లు