చిలుకముక్కు చిన్నోడు : - డా.ఎం.హరికిషన్- కర్నూలు-9441032212

   ఒక అడవిలో ఒక పిల్లోడు వుండేవాడు. వాడు చానా మంచోడు. బాగా చదువుతాడు. మంచి ఎత్తు. చక్కని రంగు. రింగులు తిరిగిన జుట్టు వుండేది. కానీ పాపం వాని ముక్కు కొంచెం పెద్దగా వుండి, ముందు భాగం వంపు తిరిగి అచ్చం చిలకముక్కులా వుండేది. దాంతో అందరూ వాన్ని ''రేయ్‌... చిలకముక్కోడా'' అని బాగా ఎగతాళి చేసేవాళ్ళు. వానికి అద్దంలో తన ముక్కు చూసుకున్నప్పుడల్లా చానా బాధ కలిగేది. ఒక్కడే కూచోని కళ్ళనీళ్ళు పెట్టుకునేవాడు. ఎప్పుడూ అదే ఆలోచన. ఒకటే బాధ. దాంతో నెమ్మదిగా చదువు అటకెక్కింది. బడిలో బాగా వెనుకబడిపోయాడు.
ఆ పిల్లోని ఇంటి వెనుక పెరడులో ఒక మామిడిచెట్టు వుంది. దాని మీద ఒక అందమైన రామచిలుక గూడు కట్టుకుంది. ఒకరోజు ఆ పిల్లోడు పెరటిలో మంచమేసుకొని పడుకున్నాడు. ఎదురుగా కనబడిన చిలుకను చూసి ''ఏయ్‌... చిలుకా.. నీ ముక్కు నా ముక్కు ఒకేలా వున్నాయి. కానీ నీ ముక్కు చూసి అందరూ అబ్బ... ఎంత ముచ్చటగా వుంది అని పొగుడుతారు. నా ముక్కు చూసి 'ఛీ...ఛీ... ముక్కెలా వుందో చూడు అచ్చం చిలకముక్కులా అంటూ తిడతారు. ఈ ముక్కు వంకర పోయి చక్కగా ఎప్పుడు మారతాదో ఏమో'' అన్నాడు.
ఆ మాటలకు చిలుక చిరునవ్వు నవ్వి ''ఈ లోకంలో అందరికీ అన్నీ వుండవు. ముక్కు బాగుంటే మూతి బాగుండదు. కన్ను బాగుంటే కాలు బాగుండదు. కొందరు ఎత్తుగుంటే ఇంకొందరు పొట్టిగుంటారు. కొందరు లావుగుంటారు. మరికొందరు బక్కగా వుంటారు. కొందరికి అవయవాలన్నీ బాగున్నా అందమైన మనసు వుండదు. సరే ఇవన్నీ ఎందుకుగానీ నా మీద ఎక్కి కూచో. నీకు కొన్ని చూపించాలి'' అంది.
వాడు పకపక నవ్వి ''నువ్వుండేదేమో జామకాయంత. నేనుండేదేమో పనసకాయంత. ఎలా కూచుంటా నీమీద'' అన్నాడు.
''అదా నీ అనుమానం. పరవాలేదు. నేను అలాంటిలాంటి అల్లాటప్పా చిలుకను గాదు. దేవలోకంలో దేవతల దగ్గర పెరిగినదాన్ని. కొంతకాలం ఈ అందమైన భూమి ఎలా వుంటుందో చూద్దామని వచ్చా. నేను కావాలంటే ఏనుగంత పెద్దగా మారగలను. చీమంత చిన్నగా కాగలను. ఒక్క నిమిషం ఆగు'' అంటూ నెమ్మదిగా పెరగడం మొదలు పెట్టింది. ముందు పావురమంత అయ్యింది. తరువాత కోడిపుంజంత అయ్యింది. మరునిమిషం నెమలంత అయ్యింది. ఇంకో నిమిషంలో నిప్పుకోడంత అయ్యింది. ఆ మరునిమిషమే గండభేరుండమంత అయ్యింది. అది చూసి వాడు సంబరంగా దాని మీదకు ఎక్కాడు.
రామచిలుక రివ్వున గాల్లోకి ఎగిరింది. అలా ఎగురుతా... ఎగురుతా... ఒక పెద్ద ఆఫీసు మీద వాలింది. ''ఆ కిటికీలోంచి కిందికి తొంగిచూడు'' అంది. వాడు తొంగి చూశాడు. అక్కడ ఒక బెంచీ మీద చూడముచ్చటైన ఒక యువకుడు కూచొని వున్నాడు. ఆరడుగుల ఎత్తు, తెల్లని ఛాయ, ముద్దొచ్చే మొగం, రింగుల రింగుల జుట్టు.... చూడడానికి సినిమా హీరోలెక్క వున్నాడు. పెళ్ళయిన ఆడవాళ్ళు చూసినారంటే చాలు... అబ్బ... కంటే ఇలాంటి కొడుకునే కనాలి అనుకుంటారు. అదే పెళ్ళికాని అమ్మాయిలు చూసినారంటే చాలు... అబ్బ! చేసుకుంటే ఇలాంటి చూడచక్కనోన్నే మొగునిగా చేసుకోవాలి అనుకుంటారు. అంత చక్కనోడు వాడు.
''ఎలా వున్నాడా యువకుడు'' అంది చిలుక.
''అబ్బ... ఆకాశంలో మెరిసే చుక్కలా వున్నాడు. అడవిలో పురి విప్పి తిరిగే నెమలిలా వున్నాడు. గాలిలో ఎగిరే సీతాకోకచిలుకలా వున్నాడు. నేను గూడా అలా వుంటే ఎంత బాగుండో'' అన్నాడు.
అంతలో ఆఫీసు లోపలి నుంచి ఒకతను బైటకు వచ్చాడు. పొట్టిగా, నల్లగా, బట్ట నెత్తితో, అందవికారంగా వున్నాడు. అతను బైటకి రాగానే ఈ ఆరడుగుల అందగాడు ఒక్కసారిగా పైకిలేచి ''సార్‌... సార్‌...'' అంటూ భయంభయంగా వంగి వంగి సలాములు చేసుకుంటూ, వణుకుతున్న చేతులతో అతని చేతిలోని సంచీని అందుకొని అతని వెనుకనే పరుగులాంటి నడకతో వినయంగా బైలుదేరాడు. అతను హుందాగా అడుగులో అడుగు వేసుకుంటూ పోతుంటే ఎక్కడివాళ్ళక్కడ లేచి నిలబడి వినయంగా తల వంచి నిలబడుతున్నారు. అతను కారు దగ్గరికి పోగానే ఒకడు వురుక్కుంటా పోయి కారు తలుపు తెరిచి నిలబడ్డాడు. అతను అందులో ఠీవిగా కూచోని వెళ్ళిపోయాడు.
చిలుక ఆ పిల్లోని వంక తిరిగి ''చూశావా... అతడంత అందవికారంగా వున్నా... అందరూ ఎలా గౌరవం ఇచ్చారో. దీనికంతా కారణం చదువే. నిజమైన గౌరవం అందం నుంచి రాదు. తెలివితేటలు, అధికారం, నిజాయితీ నుంచే అందుతుంది. ఈ వెక్కిరించడాలు, వేళాకోలాలు అన్నీ చిన్నతనంలోనే. నువ్వు బాగా చదివి పెద్ద అధికారిగా మారావనుకో... గౌరవం దానంతటదే పరుగెత్తుకొని వచ్చి నీ కాళ్ళ దగ్గర చేరుతుంది. ఈ నడుమ నువ్వు అనవసర ఆలోచనలతో చదువులో బాగా వెనుకబడుతున్నావట గదా. పనీపాటాలేని వాళ్ళ మాటలను పట్టించుకోకుండా మనసంతా చదువు మీదే వుంచు. ఏం సరేనా'' అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది.
''అలాగే ... ఆగు. నువ్వు చెప్పినట్టే వింటాను. నన్ను ఇంటి దగ్గర దించు. ఇలా వదిలి వెలితే ఎలా'' అంటూ ఆ పిల్లోడు గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు అప్పుడే అక్కడకు వచ్చిన వాళ్ళ అమ్మ ''ఏరా... హాయిగా చెట్టు కింద పడుకోని పగటిపూటనే భలే కలలు కంటున్నావే. లెయ్‌లెయ్‌. ఇంక పడుకుంది చాలు'' అంటూ కుదుపుతూ లేపింది.
''ఇంతసేపూ వచ్చింది కలనా. కానీ అది కల కాదు. నిజం. చిలక చెప్పిన నిజం. ఇకపై చదువులో అస్సలు వెనుకబడగూడదు'' అనుకుంటూ మంచం మీద నుంచి కిందికి దిగాడు.
***********

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఏం కాలం? ఇది పోయే కాలం!:- యలమర్తి అనూరాధ
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం