ఎవరేవరో వచ్చేరు? ఏమిటేమిటో చేసేరు? :- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
గాలి వచ్చింది 
కంటికి కనపడలేదు 
చేతికి చిక్కలేదు 
తనువును తాకింది 

వెలుగు వచ్చింది 
పట్టుకోబోతే దొరకలేదు 
పలుకరిస్తే జవాబివ్వలేదు 
కళ్ళల్లోకి దూరింది 

వాన వచ్చింది 
పొమ్మంటే పోలేదు  
తగ్గమంటే వినలేదు
నేలను తడిపింది 

జాబిల్లి వచ్చింది 
వెన్నెల చల్లింది 
విహారానికి పిలిచింది 
వేడుక చేసింది 

అందం ముందుకొచ్చింది 
అదేపనిగా చూడమంది 
ఆస్వాదించమని అన్నది 
అంతరంగాన్ని తట్టింది 

చిరునవ్వు వచ్చింది 
ఆధారాలపై కూర్చుంది 
మోమును వెలిగించింది 
చిందులు త్రొక్కించింది 

వయసు వచ్చింది 
వర్ఛస్సు పెంచింది 
సొగసు ఇచ్చింది 
మనసును మురిపించింది 

కవిత్వం వచ్చింది 
కలము పట్టించింది 
కాగితం నింపించింది 
కమ్మదనం కలిగించింది 


కామెంట్‌లు