అక్షయ తృతీయ ప్రాశస్థ్యం:-సి.హెచ్.ప్రతాప్

 శ్లో: వైశాఖే మాసి రాజేంద్ర శుక్ల పక్షే తృతీయకా||
అక్షయాసాతిథిః ప్రోక్తా కృత్తికా రోహిణీయుతా||

 
అక్షయ అంటే క్షయం కానిది.. పుణ్యాన్ని కలిగించే ఒక తిథి. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. పితృదేవతలను ఆరాధిస్తారు. అక్షయ తృతీయ. ఈ రోజున చేసే దానాలు అక్షయ ఫలాన్ని ఇస్తాయని నమ్మకం. ఈ రోజున చేసే గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం ఏవైనా శుభ ఫలితాలను అందిస్తాయి. ఈ రోజున చేసే జప, హోమ, దానాదులు అక్షయమవుతాయి కనుకనే ఇది అక్షయతృతీయ అయింది.ఈ రోజున వివాహం, గృహప్రవేశం, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి, దానధర్మాలు చేయడానికి ఈ రోజును ఉత్తమమైనదిగా పరిగణిస్తారు.ఈ రోజు వివాహం, గృహ ప్రవేశానికి చాలా మంచిదని భావిస్తారు. కొత్త ఇంట్లోకి ప్రవేశించినా లేదా వివాహం చేసుకున్నా జీవితాంతం సంతోషంగా, సుసంపన్నంగా ఉంటారని హిందువుల నమ్మకం. అందుకే ఈనాడు దేశవ్యాప్తంగా చాలా మంది వివాహం, వ్యాపారం, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు చేస్తారు.అక్షయ తృతీయ సందర్భంగా ఒడిశాలోని జగన్నాథ్ పూరిని సందర్శించాలి, ముఖ్యంగా విష్ణువు ఆశీర్వాదం కావాలంటే. చార్ ధామ్ తీర్థయాత్రలలో ఒకటైన జగన్నాథ ఆలయం నుండి ఈ పండుగ జరుగుతుంది.మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈనాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది.అక్షతలు అంటే ఏ మాత్రం విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యంతో అక్షింతలను తయారు చేసి విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి అందులో కొంత భాగం బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి అక్షయ తృతీయ వ్రతం చేసిన ఫలం తప్పక కలుగుతుంది. వరైతే అక్షయ తృతీయ రోజు గంగా తీరంలో వస్తువులు, వస్త్రాలు, ధాన్యం వంటివి దానం చేస్తారో వారు బంగారు, రత్నములతో కూడిన విమానంలో తన పితృదేవతలతో కల్ప కోటి సహస్రముల కాలము బ్రహ్మ లోకమున ప్రకాశిస్తారంట. అనంతరం గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణునిగా జన్మించి, అంతమున బ్రహ్మజ్ఞానియై ముక్తిని పొందుతాడు. ఓం నమో నారాయణాయః’ ఈ మంత్రం శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడింది. దీన్ని అక్షయ తృతీయ పర్వదినాన జపించడం వల్ల మన జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. అంతేకాదు మోక్షం కూడా లభిస్తుంది.
కామెంట్‌లు