అల్లం టీ : - - యామిజాల జగదీశ్

 ఆయుర్వేద ప్ర‌కారం అల్లంలో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. అల్లాన్ని నిత్యమూ మ‌నం కూర‌ల్లో వేస్తుంటాం. దీంతో కూర‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే రుచికే కాదు, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందివ్వ‌డంలోనూ అల్లం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే అల్లంతో టీ త‌యారు చేసుకుని నిత్యం తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.
అల్లం టీ గురించి తెలుసుకునే ముందు తేనీరు గురించి ముందుగా కొన్ని విషయాలు చూద్దాం.  ఇదొక పానీయం. తేయాకుని నీటిలో మరిగించి వచ్చిన ద్రావకాన్నే టీ అంటారు.   మానవ దేహానికి ఉత్తేజాన్ని కల్గించే ఆహార పదార్ధాలలో టీ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇందులో పాలు. చక్కెర కలుపుకొని తాగుతారు. నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైనది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ తాగడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపడం జీవితంలో ఓ అంతర్భాగమైపోయింది. సగటు భారతీయుల్లో దాదాపు సగం మందికిపైగా టీ సేవిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం మానసిక విశ్రాంతి కోసం కాఫీ సేవించడం అలవాటుగా ఉండేది. ఇళ్ళలో కూడా కాఫీ మాత్రమే వాడుకలో ఉండేది. ఫిల్టర్ కాఫీ బాగా వాడుకలో ఉన్న రోజుల్లో ఇన్‌స్టంట్ కాఫీలు రావడం, వాటితోపాటు పలు రకాల టీ పౌడర్లు మార్కెట్‌లోకి విడుదల కావడం, టీకి జనసామాన్యంలో అధిక వినియోగం ఏర్పడడం, పైగా అది సామాన్య మానవుడికి అందుబాటు ధరలలో లభించడం టీకి మరింత ప్రాధాన్యత పెరగడానికి దోహదపడింది. దాదాపు ప్రతి దేశంలోనూ టీ వినియోగంలో ఉన్నా మన భారత దేశం ఉత్పాదించే టీ వైవిధ్యానికీ, విశిష్టతకూ ప్రసిద్ధి పొందింది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్  టీ మిక్కిలి నాణ్యమైంది. ఇది సువాసనభరితమైనది. ముఖ్యంగా ఇక్కడి మంచుతో కూడిన హిమాలయ పర్వత వాతావరణ పరిస్థితుల వల్ల, ఈ ప్రదేశంలో భూసార రచనా విధానం వల్ల ఇక్కడ ఉత్పత్తయ్యే టీకి ప్రత్యేక రుచి, సువాసన సిద్ధిస్తుంది.  నిజానికి నాలుగో శతాబ్దంలో ఒక చైనా వైద్యుడు ఆకులను తుంచి, ఎండబెట్టి, ఒక ప్రత్యేక ఉష్ణోగ్రతలో వేడి చేసి, వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షను వైద్య పరీక్షకు తాగాడు. ఈ టీ డికాక్షను త్రాగినందువల్ల అతను ఉత్తేజం పొందాడు. టీ సేవన ద్వారా మొట్టమొదటగా ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ పొందిన వ్యక్తి ఆయనే కావడం విశేషం. 15వ   శతాబ్దంలో నాగరిక ప్రపంచంలో టీ త్రాగడం ప్రారంభమయ్యింది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వినిమయ పద్ధతిలో బట్టలు, వెండికి అనధికారికంగా నల్లమందుకు బదులుగా టీని చైనా నుండి దిగుమతి చేసుకునేది. చాలాకాలం తర్వాత 1823లో బ్రిటన్‌కు చెందిన బ్రూస్ సోదరులు అస్సాంలో దేశీయంగా తేయాకును కనిపెట్టినప్పుడు భారతదేశంలో టీ ఉత్పాదన ప్రారంభమైంది. విస్తారంగా టీ వృద్ధి చెందే ప్రాంతాలను వీరు కనుగొన్నారు. చైనాతో 1833 లో ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్య వ్యాపార సంబంధాలు చెడిపోయినప్పుడు, ఇంగ్లాండు భారతదేశంలో టీ ఉత్పాదనకు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించింది. 1860 నాటికి భారతదేశంలో టీ ప్లాంటేషన్ తోటలు బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడే టీ ఉత్పాదన సుమారు పది లక్షల కేజీలు ఉండేది.
చైనా నుండి బ్లాక్, గ్రీన్ టీ రకాల విత్తనాలను లార్డ్ మెకార్డెనీ తెప్పించి, భారతదేశంలో 1793లో  కలకత్తా బొటానికల్ గార్డెన్స్‌ లో ప్రవేశపెట్టాడు. ఇవి పశ్చిమ బెంగాల్, కచార్, నీలగిరి ప్రదేశాలలో నాటి పెంచసాగారు. నేడు భారతదేశంలో సగానికి సగం టీ మొక్కలు ఆ తోటల పెంపకానికి చెందినవే. భారతదేశం, బ్రిటన్లలో పాలు, పంచదార కలిపి తాగుతారు.  టిబెటన్లు  గ్రీన్ టీని ఉప్పు, యాక్ వెన్నతో కొయ్య కప్పులలో తాగుతారు. ఆఫ్రికాలో డికాక్షన్ను చిలికి నురగగా తయారు చేసి తాగుతారు. పశ్చిమ ఆసియాలో టీని యాలకులతో కలిపిన డికాక్షన్‌తో తాగితే, భారతదేశంలో గుజరాతీలు మసాలా టీ త్రాగుతారు. బ్లాక్ లేదా  గ్రీన్ టీని ఏలకులు, కొట్టిన బాదంపప్పు కలిపి కహ్వా అని కాశ్మీరీలు తాగుతారు. ఇది చాల పుష్టికరమైన, రుచికరమైన పానీయం. టీలో తెల్ల తేనీరు, నల్ల తేనీరు, గ్రీన్ లేదా ఆకుపచ్చ తేనీరు, డార్జిలింగ్ టీ, అల్లం టీ ఇలా కొన్ని రకాలున్నాయి.  వీటిలో ఒకటైన అల్లం టీని తాగి ప్ర‌యాణాలు చేస్తే వాంతులు రాకుండా ఉంటాయి. కొంద‌రికి కార్లు, బ‌స్సుల్లో ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వాంతులు అవుతుంటాయి. అలాంటి వారు ప్ర‌యాణానికి ముందు అల్లం టీ తాగితే ఫ‌లితం ఉంటుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాకుండా స‌మ‌స్య‌లు ఎదుర్కొనేవారు అల్లం టీని తాగితే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కీళ్ల నొప్పులు ఉన్న‌వారు అల్లం టీ తాగితే ఆ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అల్లం టీని రోజూ తాగితే ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది. రుతుక్ర‌మం స‌రిగ్గా ఉండ‌ని మ‌హిళ‌లు అల్లం టీ తాగితే ఉత్త‌మం. అలాగే శ‌రీర రోగ నిరోధ శ‌క్తి కూడా అల్లం టీతో పెరుగుతుంది. బాగా త‌ల‌నొప్పిగా ఉంటే అల్లం టీ తాగితే వెంట‌నే నొప్పి త‌గ్గిపోతుంది. అల్లం టీని నిత్యం తాగుతుంటే అధిక బ‌రువు, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

కామెంట్‌లు