--ఊషన్నపల్లి పాఠశాలలో పిల్లలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కుల పంపిణీ
ప్రభుత్వ పాఠశాలల్లోనే క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో పాటు పిల్లలపై కేరింగ్(శ్రద్ధ)ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆయన ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల పిల్లలకు పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు ఆయా గ్రామాలకు సంబంధించిన పిల్లలు మాత్రమే వస్తారని, అందువల్ల ఆ పాఠశాలల్లో పరిమిత సంఖ్యలో పిల్లలు ఉంటారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు మండలంలోని వివిధ గ్రామాల్లో నుంచి తరలించడం వల్ల పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, అక్కడ ఒక్కో తరగతికి 40 నుంచి 50 వరకు పిల్లలు ఉండడం వల్ల ఒక్క టీచర్ అంతమందిని చూడడం కష్టమవుతుందని, అదే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో తరగతికి 15 నుంచి 20 మంది మాత్రమే పిల్లలు ఉంటారని అందువల్ల ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ శ్రద్ధ (కేరింగ్) తీసుకుంటున్నారని, అందుకే ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యధిక ఫలితాలు వస్తున్నాయని ఈర్ల సమ్మయ్య తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాశాఖ డైరెక్టర్ నుంచి జాయింట్ డైరెక్టర్, డీఈవో, ఏఎంఓ, డిఆర్పిల బృందం, ఎంఈఓ, ఎంపీడీవో, కాంప్లెక్స్ హెచ్ఎంలు అనుక్షణం అక్కడి బోధన తీరును పర్యవేక్షిస్తారని, ఉపాధ్యాయులు, విద్యార్థులను క్రమశిక్షణగా ఉంచడమే కాకుండా అద్భుతమైన బోధన జరిగేలా చూస్తున్నారన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు అత్యధిక ఫలితాలు సాధిస్తున్నారని ఆయన అన్నారు. కొన్ని పాఠశాలలు, కొందరు వ్యక్తుల స్వప్రయోజనం కోసం ఏర్పాటు చేసుకున్నవని, ప్రభుత్వ పాఠశాలలు మాత్రం ప్రజలకు సేవ చేసే నిమిత్తం, పిల్లల సర్వతోముఖాభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడ్డాయని ఆయన అన్నారు. కొందరు ఏజెంట్లను పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలలపై దుష్ప్రచారం చేస్తున్నారని, తల్లిదండ్రులు వారి మాయమాటలు నమ్మి మోసపోకూడదని, వేలాది రూపాయల డబ్బులు వృధా చేసుకోకూడదని ఆయన కోరారు. తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని ఆయన కోరారు. గత విద్యా సంవత్సరంలో ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలందరూ 90 శాతం పిల్లలు డిస్టింక్షన్లో, మిగతా 10 శాతం పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారని గుర్తు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, బండారి సరిత, పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి