సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 ద్రోణ పర్వము ప్రథమాశ్వాసము- 289 వ రోజు
అర్జునుడు సుప్రీతకమును భగదత్తును ఖండించుట
కృష్ణుడు రథమును భగదత్తుడికి ఎదురుగా నిలపగా భగదత్తుడు తండ్రిని చంపిన కృష్ణుని మీద కోపంతో కృష్ణునిపై అతి క్రూర బాణములు ప్రయోగించాడు. అర్జునుడు వాటిని ఖండించి, భగదత్తుని విల్లు విరిచి, భదత్తుడిపై శరీరంలో వాడి అయిన బాణములు నాటాడు. భగదత్తుడు అమిత కోపంతో అర్జునుడిపై పదునాలుగు తోమరములు అర్జుడిపై ప్రయోగించాడు. అర్జునుడు వాట్ని మధ్యలో త్రుంచి సుప్రీతకం కవచమును భేదించాడు. సుప్రీతకం మేఘములు తొలగిన కొండవలె ప్రకాశించింది. భగదత్తుడు ప్రయోగించిన శక్తి బాణమును అర్జునుడు నిర్వీర్యం చేసాడు. భగదత్తుడు అర్జునుడి కిరీటంపై తోమరం వేయగా అర్జునుడు కోపించి భగదత్తుని పై ఏడు బాణములు ప్రయోగం చేయగా భగదత్తుడు తన చేతిలో ఉన్న అంకుశాన్ని వైష్ణవాస్త్రంగా మంత్రించి అర్జునుడిపై ప్రయోగించాడు. అర్జునుడి వైపు అమిత రౌద్రంగా వస్తున్న వైష్ణవాస్త్రానికి కృష్ణుడు నొగల మీదనుండి లేచి నిలబడి తన వక్షస్థలాన్ని చూపాడు. రౌద్రంగా వచ్చిన వైష్ణవాస్త్త్రం శ్రీకృష్ణుని వక్షస్థలం తాకి పూవు వలె క్రింద పడింది. అర్జునుడు కోపం పట్ట లేక " కృష్ణా ! నా మీద దయ వలన నాకు సారధ్యం చేయడానికి ఒప్పుకున్నావు. కాని యుద్ధం చేయనని మాట ఇచ్చావు. ఈ విధంగా యుద్ధంలో పాలు పంచుకోవడం భావ్యంగా ఉందా ! చూసిన వారు అర్జునుడు చేతగాని వాడిని అనుకోరా ! ఇక మాటలెంకులే రధమును పోనిమ్ము " అన్నాడు నిష్టూరంగా. కృష్ణుడు అర్జునుడిని చూసి " అర్జునా ! రధ సారధిగా నిన్ను కాపాడు కోవడం నా ధర్మం . నీకో విషయం చెప్పాలి. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి లేచిన సమయమున భూదేవి అతడిని కోరుకుంది. మహావిష్ణువు ఆమె కోరికను మన్నించి తరువాత ఆమెకు వైష్ణవాస్త్రాన్ని ప్రసాదించాడు. వారి సంగమ ఫలితంగా వారికి నరకాశురుడు జన్మించాడు. భూదేవి ఆ అస్త్రమును నరకాశురుడికి ఇచ్చింది . నరకాశురును నుండి అది భ్గదత్తుడికి సంక్రమించింది. ఆ వైష్ణవాస్త్రము అత్యంత మహిమాన్వితము. విష్ణాంశతో జన్మించిన నా వలన మాత్రమే అది నిర్వీర్యం ఔతుంది. అందూకే నా గుండెను అడ్డు పెట్టి దానిని నిర్వీర్యం చేసాను. అంతే కాని నీవు వీరుడివి కాదు అని కాదు. నీ పరాక్రమం శంకించి కాదు. తాను ప్రయోగించిన వైష్ణవాస్త్రం నిర్వీర్యం అయినందుకు భగదత్తుడు నిరాశతో ఉన్నాడు. కనుక ఇది మంచి తరుణం నేను నరకారుశుని చంపినట్లు నీవు భగదత్తుని సంహరించు " అన్నాడు. అర్జునుడు గండీవమును సంధించి ఒక క్రూర నారాచమును సంధించి సుప్రీతకం కుంభస్థలముకు గురిపెట్టి కొట్టాడు. ఆ దెబ్బకు సుప్రీతకం కుంభస్థలం పగిలి క్రిందికి ఒరిగింది. దాని మీద నుండి భగదత్తుడు కింద పడ్డాడు. వెంటనే అర్జునుడు ఒక అర్ధచంద్రాకార బాణమును ప్రయోగించి భగదత్తుని శిరస్సు ఖండించాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు