తెలివితో కొట్టాలి దెబ్బ - చిన్నారులకోసం చిన్న కథ -* డా.ఎం.హరి కిషన్ - కర్నూలు - 94410 32212---- ఒక అడవిలో రెండు ఎలుకల గుంపులు వుండేవి. ఒక దానికి నాయకుడు పల్లవుడు. ఇంకొక దానికి నాయకుడు మనోహరుడు.పల్లవుడు చాలా చెడ్డవాడు. చుట్టుపక్కల వున్న ఎలుకలన్నీ తన మాటే వినాలని అనుకునేవాడు. తను ఏది చెబితే అది చేయాలి అనేవాడు. ఏవైనా వినకపోతే దాడి చేసేవాడు. దాంతో వానికి భయపడి అన్నీ అలాగే చేసేవి.మనోహరుడు చాలా మంచివాడు. తన గుంపులోని ఎలుకలను సొంత బిడ్డలలాగా చూసుకునేవాడు. వాటికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేవాడు. తోడునీడగా వుండేవాడు. దాంతో ఎలుకలన్నీ మనోహరున్ని ఎంతగానో అభిమానించేవి.మనోహరునికి మంచి పేరు రావడం చూసి పల్లవుని కన్ను కుట్టింది. ఎలాగైనా సరే ఆ గుంపును దెబ్బ తీయాలని రకరకాల ఆయుధాలు తయారు చేయించాడు. ఒకసారి మనోహరునితో ''నాకు లొంగిపోయి ఈ అడవి వదలి పారిపోతావా లేక యుద్ధానికి సిద్ధపడతావా'' అంటూ సవాల్ విసిరాడు.మనోహరుడు ఆలోచనలో పడ్డాడు. పల్లవుని దగ్గర చాలా ఆయుధాలు వున్నాయి. యుద్ధం వల్ల అనవసరంగా ఇరువైపులా చాలామంది చనిపోతారు. పిల్లలకు నాన్నలు, పెళ్ళాలకు మొగుళ్ళు దూరమైపోతారు. అనేక మంది వికలాంగులు అవుతారు. సంపదంతా నాశనం అవుతుంది. యుద్ధం ఎలా చూచినా మంచిది కాదు. తనవల్ల పదిమందికి మేలు జరగాలే గానీ కీడు జరగకూడదు అనుకోని అడవి వదలి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు.అది చూసి ఆ గుంపులోని ఎలుకలన్నీ కన్నీరు పెట్టుకున్నాయి. అప్పుడు ఆ గుంపులోని ఒక చిన్న ఎలుక ''రాజా... ఎవరికీ ఎటువంటి ఆపద కలగకుండా... ఆ పల్లవుడే అడవిని వదలి పారిపోయేలా నేనొక ఉపాయం చెబుతా వింటానంటే'' అంది.*''మంచిమాట చెప్పడానికి వయసుతో పనిలేదు. తెలివితేటలు ఎవరి సొంతమూ కాదు. చెప్పు'' అన్నాడు మనోహరుడు.* ''రాజా... మన ఎలుకలు అన్నింటికీ పిల్లి అంటే భయం. అందుకే మనం అచ్చం పిల్లిలాగా ఒక పెద్ద నడిచే బొమ్మ తయారు చేద్దాం. యుద్ధంలో దాన్ని ముందు పెట్టి బైలుదేరుదాం'' అంటూ ఏం చేయాలో చెప్పింది.అందరికీ ఆ ఉపాయం నచ్చింది.వారం లోపల ఒక పెద్ద పిల్లి బొమ్మ తయారయిపోయింది. దాని మెడలో ఒక పెద్ద గంట కట్టారు. వెంటనే అడవిలో ఒక పుకారు లేవదీశారు. మనోహరుని మంచితనం చూసి సాయంగా యుద్ధం చేయడానికి పక్క వూరు నుంచి ఒక పెద్ద పిల్లి వచ్చింది. అది మామూలు పిల్లుల కంటే పదింతలు పెద్దగా వుంది. దెబ్బకు వంద ఎలుకలని చంపుతుంది'' అని. నిజం గడప దాటలోపల అబద్ధం ఊరు దారుతుందని చెబుతారు కదా పెద్దలు.అలా ఆ పుకారు అడవంతా పాకిపోయింది. పల్లవుని వైపు వున్న ఎలుకలన్నీ భయంతో వణికి పోసాగాయి.తరువాత రోజు... యుద్ధంలో ముందు పిల్లి అడుగులో అడుగు వేసుకుంటా భయంకరంగా మియావు అని అరుచుకుంటా రాసాగింది. దాని మెడలో వున్న గంట గుండెలు అదిరిపోయేలా గణగణమని మోగసాగింది. దాని వెనుకే మనోహరుని సైనికులు. దూరం నుంచి దాన్ని చూసిన పల్లవుని సైనికులు అదిరిపడ్డారు. ''అమ్మో ... నిజమే... ఎంత పెద్దగుంది. ఇది కొడితే దెబ్బకు పదిమంది పచ్చడి పచ్చడి అయిపోతారు'' అనుకుంటా వెనక్కి తిరిగి ఆగకుండా పారిపోయాయి. అంతే ఒక్క నిమిషంలో పల్లవుడు తప్ప అక్కడ ఎవరూ లేరు. పల్లవుడు అదిరిపడ్డాడు. ''ఇంక ఇక్కడ ఒక్క క్షణం వున్నా నాకు చావు తప్పదు. బుద్ది పొరపాటై అనవసరంగా వీళ్ళతో పెట్టుకున్నాను. ఇంగెప్పుడూ మంచివాళ్ళతో గొడవ పెట్టుకోగూడదు'' అనుకుంటా వెనక్కి తిరిగి అడవి వదలి పారిపోయాడు.
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
జయశంకర్ సార్ జయంతి :- పి, రిషిక-9వ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేట -మం గంభీరావుపేట
• T. VEDANTA SURY

మధిర లోని టి.వి. ఎమ్. జి. ఉన్నత పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహ ఆవిష్కరణ
• T. VEDANTA SURY

ప్రోఫేసర్ జయశంకర్ సార్ : -కాల్వ రాజయ్య -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేట,-సిరిసిల్లా.
• T. VEDANTA SURY

పశ్చాత్తాపం:-ఇ.వైష్ణవి-10వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాల గణపురం-జనగామ జిల్లా
• T. VEDANTA SURY

Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి