అష్టావక్రుడు..: ---సుజాత.పి.వి.ఎల్.

 సకల విద్యావంతుడైన ఏకపాదునకు, సుజాత ఇల్లాలు. ఆ దంపతులకు జన్మించిన వాడే అష్టావక్రుడు. ఏకపాదుడు గురుకులాన్ని నడుపుతూ, విద్యార్థులకు వేదవిద్య బోధించేవాడు. అయితే, విద్య బోధించే విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు. ఈ విషయంలో నిద్రాహారాలు కూడా లెక్కచేసేవాడు కాదు. ఏకపాదునకు  వివాహమై చాలాకాలం వరకూ సంతానం కలుగలేదు. ఎన్నో నోముల ఫలితంగా సుజాత గర్భవతి అయింది. ఏకపాదుని ఆనందానికి అవధులు లేవు. సుజాతకు నెలలు నిండుతున్నాయి.
ఒకరోజు ఏకపాదుడు నిద్రాహారాలు కూడా లెక్కచేయకుండా తన శిష్యులచేత వేదాధ్యయనం చేయిస్తున్నాడు. విద్యార్థులు అలసిపోతున్నారు... అయినా గురువుకు భయపడి వేదాన్ని అభ్యసిస్తూనే ఉన్నారు. ఇది సుజాత గర్భంలో పెరుగుతున్న శిశువుకు బాధాకరంగా తోచింది. వెంటనే తన తండ్రితో ‘ తండ్రీ.., ఏమిటీ విద్యాబోదన ? శిష్యులు నిద్రాహారాలు లేక సొలసిపోతున్నారు. వారి ఆరోగ్యం పాడవుతోంది.ఈ విదమైన విద్యావిధానాన్ని మార్చుకో ’ అని గర్భంలోంచే సలహా ఇచ్చాడు. ‘తనకు పుట్టబోయే కుమారుడు.., తనకు సలహాయిచ్చేంత గొప్పవాడా’ అని ఏకపాదుడు అహంకరించి, ఆ గర్భస్థ శిశువును ఉద్దేశించి.. ‘నీ జన్మకు కారణభూతుడనైన తండ్రినే విమర్శించేంత ఘనుడవా నీవు ? వేదాధ్యయనమునకు వక్రముగా గురువునే విమర్శించిన పాపానికి ప్రతిఫలంగా నీవు ‘అష్టావక్రుడు’గా జన్మించు’ అని కోపంగా శపించాడు. ఆ గర్భస్థ శిశువు తన తండ్రి శాపాన్ని ఆనందంగా స్వీకరించాడు.
సుజాతకు తొమ్మిది నెలలు నిండాయి. ప్రసవ సమయం దగ్గర పడిందని., ఇక రెండు మూడు రోజులలో శిశు జననం జరుగుతుందని గ్రహించాడు ఏకపాదుడు. ప్రసవ సమయానికి అవసరమైన తిలలు, ఘృతము, ఇతర ధాన్యములు సంపాదించే నిమిత్తం ఏకపాదుడు జనకుని రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ అనుకోని విధంగా వరుణుని కుమారుడైన వందితో వాదానికి దిగి ఓడిపోయాడు. పోటీ నియమానుసారం వంది.., ఏకపాదుని జల మధ్యంలో బంధించాడు. సరిగ్గా ఆ సమయంలోనే సుజాత., తన అన్న అయిన ఉద్దాలకుని ఇంట ఒక మగ శిశువును ప్రసవించింది. అయితే తండ్రి శాపానుసారం ఎనిమిది వంకరలు గల దేహంతో జన్మించాడు. అందుచేతనే అతనికి  ‘అష్టావక్రుడు’ అని పేరు వచ్చింది.'అష్టావక్రుడు..'!
---సుజాత.పి.వి.ఎల్.
కామెంట్‌లు