ప్రాణం కన్నా మిన్న! అచ్యుతుని రాజ్యశ్రీ

 మేవాడ్ మహారాణాకి అత్యంత ఆప్తుడు సన్నిహితుడైన బారూజీ తన రాజు దగ్గర తప్ప వేరే ఎవరు ఏమిఇచ్చినా పుచ్చుకునేవాడుకాదు. రాణాయే అతని ప్రాణం సర్వస్వం. ఇద్దరు బాల్యస్నేహితులుకూడా. బారూజీ ప్రసిద్ధ కవిగూడా. అతనికీర్తి ఆత్మాభిమానం దూరతీరాలకు వ్యాపించాయి. పామరుని మొదలు  పండితుల దాకా  ఆయనను ఆదరించే వారు. కాకపోతే అతనిలో అందరికీ  నచ్చని ఒకే ఒక గుణం  రాణా ఇచ్చేది మాత్రమే  తీసుకుని  మిగతా వారివి నిర్మొహమాటంగా తిరస్కరించేవాడు. మిగతా రాజులు  రాణాలకు మనసులో ముల్లులా గుచ్చుకున్నా సమయం కోసం కాచుకున్నారు."నాకు ఉన్నది ఒకేఒక్క ప్రభువు"అని ఖరాఖండిగా చెప్పేవాడు.
మహారాణా మామగారు  బూందీపాలకుడైన మహారావ్ కి గిట్టేదికాదు.కూతురి పెళ్ళి కి వచ్చిన వారందరికీ బోలెడంత నగానట్రా బహుమతులు ఇచ్చాడు.కానీ  బారూజీ వాటిని తీసుకోకుండా నిరాకరించడం మహారావ్ మనసులో ఉండిపోయింది.
 ఒకసారి రాణా తనమామగారి దగ్గరకు సందేశం ఇచ్చిరమ్మని  బారూజీ ని పంపాడు.బూందీవెళ్లిన బారూజీ మహారావ్ ని కలిసి లేఖ ఇచ్చాడు. "ఏమోయ్ !మేమంటే నీకు గౌరవం ఆదరం ఉన్నాయా?మా అల్లుడు  ఒక్కడే నీకు దేవుడు సర్వస్వం కదూ?" అతని వ్యంగ్యం  అర్ధం చేసుకున్న బారూజీ అన్నాడు"మీరు నాకు  పూజనీయులే ప్రభూ!"అన్నాడు."మరి నేనిచ్చిన బహుమతులు ఎందుకు  నిరాకరించావు?"
"అది నా నియమం ప్ర భూ!"
"బారూజీ  అందరు కవులు  నాబహుమతులు ఆనందంగా  స్వీకరించితే నీవు తిరస్కరించావు.నన్ను  బాగా  అవమానించావు.ఇప్పుడు  నేను ఇచ్చే సంభావన దానం తీసుకోకుండా  నీ రాణా దగ్గరకు ఎలా వెళ్తావో చూస్తా."సవాలు విసిరాడు. పైగా బారూజీని అతనితో వచ్చిన సేవకుడిని బందీలుగా కారాగారంలో ఉంచాడు.వారం గడిచినా విడిచి పెట్టకపోటంతో బారూజీ ఒకదృఢనిశ్చయానికి వచ్చాడు. రాణా మామగారు కాబట్టి  కర్రవిరగకుండా పాము చావకుండా  ఉపాయం గా అపాయం దాటాలని నిశ్చయించుకున్నాడు.
అందుకే బైట కాపలావాడి ద్వారా  మహారావ్ కి విన్నపం పంపాడు. అతను వెంటనే  బారూజీని రప్పించాడు."ఏమోయ్  నాదారికి వచ్చినందుకు సంతోషం!బహుమతులు ఇస్తా.సిద్ధం గా ఉండు "  "ప్రభూ!నాదీ ఓ షరతు.నేను ఇచ్చే  నా కానుకను మీరు స్వీకరించి తీరాలి. ""ఓ. అలాగే  !"    "ప్రభూ  ఇప్పుడే  నాగదిలోకి వెళ్లి  మీకు ఇవ్వవలసిన కానుక అందజేస్తాను"  లోపలికి వెళ్ళిన బారూజీ  తన సేవకునితో ఇలా అన్నాడు"నేను  నా శిరస్సుని ఖండించుకుంటున్నా.దీన్ని  ఈపళ్లెంలో పెట్టి  పైన వస్త్రం కప్పి మహారావ్ కి బహూకరించు."నౌకరు బతిమలాడినా వినకుండా సర్రున తన తల నరికేసుకున్నాడు.పాపం!ఆనౌకరు స్వామిభక్తి పరాయణుడు కావటంతో తు.చ.తప్పక బారూజీ చెప్పిన ట్లే చేశాడు. "హు తన పంతం నెగ్గించుకున్నాడు.తన రాణా దగ్గర తప్ప  ఎవరిదగ్గర ఏమీతీసుకోను అన్న  అతని ప్రాణం  నిలువునా తీశాను.నేను ఓడిపోయాను."బాధపడిమహారావ్ చేతులుకాలాక ఆకులు పట్టుకున్న మూర్ఖుడుగా చరిత్ర లో మిగిలాడు.మనం  డబ్బు  పదవి దురాశ తో దేశద్రోహులకి సాయం చేయరాదు. జననీజన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.ఉగ్రవాదుల భరతం పట్టాలి.మన వీరసైనికులకి  సరిహద్దుల్లో అన్ని బాధలు సహిస్తూన్న వారికి  మన పోలీసులకి  ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటే చాలు.
కామెంట్‌లు