నమ్మకానికి ప్రతీక శబరి:-- యామిజాల జగదీశ్
 భారతీయ వాఙ్మయములో రామాయణం ఓ గొప్ప ఇతిహాసం. ఆదికావ్యం. సంస్కృతం లో రామాయణాన్ని రచించిన వాల్మీకిని ఆదికవిగా చెప్పుకుంటాం. రామాయణ గాథ త్రేతాయుగం కాలం నాటిది. దేశ, విదేశ భాషలలో అనువాదానికి నోచుకున్న రామాయణ గ్రంథం హిందూ ధర్మాలు, చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై అనితరమైన ప్రభావము కలిగి ఉందనడం అతిశయోక్తికాదు. 
ఎన్ని రకాల రామాయణాలున్నప్పటికీ
వాల్మీకి రామాయణమే ప్రముఖంగా చెప్పుకోదగ్గది. రామాయణంలోని పాత్రలు, సంఘటనలు, భావాలు ఎన్నిసార్లు చదివినా విన్నా విసుగనే మాటకు తావుండదు. సీతా రాముల పుణ్య చరితం, ఆంజనేయుడి భక్తితత్పరత అమోఘం. ఈ కావ్యంలోని ఏ పాత్రకాపాత్ర ప్రధానమే. రామ నామాన్ని మూడుసార్లు స్మరిస్తే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేసిన ఫలం లభిస్తుందని పెద్దల మాట. 
రామాయణంలో ముఖ్యంగా శబరి పాత్ర నమ్మకానికి ప్రతీక. అపర భక్తురాలు శబరి.
మాతంగ మహర్షి ఆశ్రమంలో పరిచారికగా ఉంటూ మహర్షులకు సేవలు చేస్తూ వచ్చిం ది శబరి. 
ఒకానొకరోజు మాతంగ మహర్షి శబరితో  "రామచంద్రమూర్తిఇక్కడికి వస్తాడు. అతనొచ్చినప్పుడు నువ్వు పండ్లిచ్చి ఆకలి తీర్చాలి" అంటాడు. 
మాతంగి మహర్షి ఈ మా చెప్పినప్పటికి రాముడింకా మానవుడిగా అవతరించనేలేదు. అయినప్పటికీ రాముడి రాకకోసం శబరి నిరీక్షించింది. మనసుకిష్టమైన వారి రాక కోసం నిరీక్షించడంలోని ఆనందం నిరీక్షించేవారికే తెలుస్తుంది. మాతంగి మహర్షి చెప్పిన మరుక్షణం నించీ శబరి రాముడికోసం నిరీక్షించడం మొదలుపెట్టింది. 
ఓరోజు ఆమె నిరీక్షణ ఫలించిందికూడా. సీతాన్వేషణ నిమిత్తం రామలక్ష్మణులు తన దగ్గరకు వచ్చినప్పుడు శబరి ఆనందానికి అంతులేదు. వారిని చూసి ఉప్పొంగి పోయింది. వారికోసం రుచికరమైన పండ్లను  తీసుకొచ్చి వారికి సమర్పించి తన భక్తిని చాటుకున్న శబరి నమ్మకానికి శిరసా నమామి. 


కామెంట్‌లు