సజీవరూపాలు....అచ్యుతుని రాజ్యశ్రీ.


 ఇది జపాన్ లో నిజంగా జరిగిన కధ.బౌద్ధ ఆరామం ఆలయంలో  ఎంతో మంది భిక్షువులు ప్రార్ధనలు దైవ ఆరాధన లో మగ్నమై సేవచేసుకునేవారు.కొత్తగా చేరిన భిక్షువులు మఠాన్ని ఇరవైనాలుగు గంటలు శుభ్రం చేస్తూ ఉండేవారు.ఒక హాల్ నిండా దేవతావిగ్రహాలు  పరమపదించిన పెద్దల విగ్రహాలు ఉండేవి. కొత్తగా చేరిన వారు  ఓ పది రోజులు చేసి  ఆ శుభ్రం చేయటం తమవల్ల కాదని తప్పించుకునేవారు.అంతా ఆరంభశూరత్వం చూపేవారు.ఒకవేళ చేసినా మొక్కుబడిగా చేసి  పక్కవారిపైకి నెట్టేసేవారు.కొత్తగా చేరిన ఒసాకాసాకీ అనే యువకుడు  చాలా భక్తిశ్రద్ధలతో ఆ పూజాగదిని రోజూ తుడవటం మొదలు పెట్టాడు. తన నెత్తిన  భారంపడిందని అనే భావం  అతనిలో లవలేశంఅయినా లేదు. మిగతా వారంతా  మహాచాదస్తం వాడని చాటుగా గుసగుసలాడుతూ నవ్వుకునేవారు. ఒకసారి సాకీ విగ్రహాల దగ్గర ఏదో మాట్లాడటం చూసి కొందరు భిక్షువులు  కిటికీలో నుండి తొంగి చూశారు.సాకీ ఒక్కో విగ్రహం దగ్గర నిలబడి "మహాత్మా!కొంచెం జరగండి.నేను మీరు కూచున్న చోటు శుభ్రంచేస్తా"అనగానే విగ్రహం పక్కకు జరగటం అతను తుడిచిశుభ్రం చేయగానే యథాతథంగా తనస్థానంలో కూచోటం తొంగి చూస్తున్న భిక్షువులను సంభ్రమంలో ముంచెత్తింది.పైగా "ఆ...తుడిచివేశాను.యధాస్థానం లోకి రండి "అని సాకీ ప్రేమ గౌరవం ఆప్యాయతతో అనగానే  విగ్రహాలు స్పందించటం వింతల్లో వింత!"అక్కడ ఉన్నవి ఉట్టి విగ్రహాలు కావు.సజీవ మూర్తులు.మనం చేసే ప్రతిపని గమనిస్తూనే ఉంటారు. "అంతే!అంతా సిగ్గు తో తలవాల్చారు.


కామెంట్‌లు