గుర్తుకొస్తున్నాయి -- మాపిన్ని :- సత్యవాణి , కాకినాడ

  మా పిన్ని పూళ్ళ సుందరమ్మ .మా కాంతారావు చిన్నాన్న భార్య.
       మా పిన్ని మాఇంట్లో కోడలుగా వచ్చేసరికి నాకు ఐదారేళ్ళు వుంటాయి.మాచిన్నాన్నా పిన్నిల పెళ్ళి తిరపతిలో జరిగింది.మా రౌతులపూడిలో  ముత్యాలపల్లకిలో చిన్నాన్నా పిన్నిల ఊరేగింపు జరిగినప్పుడు నేనుకూడా పల్లకీ ఎక్కి ఊరేగాను అనేది నాకుగల అందమైన,ఆనందదాయకమైన ఒక జ్ఞాపకం.
       మా పిన్ని  ఆల్చిప్పలాంటీ కళ్ళతో,ఎడమ పెదవి క్రింద కందిగింజంత నల్లని పుట్టుమచ్చతో,అచ్చంగా సినీతార వైజయంతీమాలలా వుండేది ఆకాలంలో.
      అమ్మ మడి వంటలో  సతమతమౌతూ వుంటే,పైపనితోపాటు ,మాపిల్లల పనులన్నీ పిన్నే చేసేది.
       మా ఆడపిల్లలకు రకరకాల జడలను, వేసిన జడ వేయకుండా వేసేది.అలాంటిజడలలో 'మనీఫర్సు' జడ,'ఈత పాయల జడ' మహబాగా వేసేది.అరచేయంత ముద్ద బంతిపూలతో'' ఒద్దు బాబోయ్ ''అంటున్నా వెంటబడి జడలుకుట్టేది.
       అలాగే తిలకంతో రకరకాల ఆకారాలతో బొట్లు పెట్టేది. ఇక్కడ మరో విషయం చెప్పాలి.
        తుమ్మ జిగురుకు తిలకంరంగును మారవణగారి కొట్లోంచి తెప్పించి,తిలకం తయారుచేసేది.తిలకం రంగు బాగా కుదిరిందో లేదో ,చిక్కతనం కుదిరిందో లేదో తెలియడానికి ప్రయోగ శాలలుగా మా మొఖాలను ఉపయోగించేది.పిల్లలెవరం దొరక్కపోయినా,పాపం మా పెద్దరాజా చెల్లెలు మాత్రం  పిన్నికి తన అందమైన,విశాల ఫాలభాగంగల తన మొఖాన్ని పిన్ని ప్రయోగాలకు అప్పచెప్సేసేది.కుత కుతమని ఉడుకుతున్న తిలకంలో 
చీపురుపుల్ల ముంచి,ఉఫ్ ఉఫ్ అని ఊది రాజా మొఖంమీద పొడవుగా నామం తీర్చండం,అబ్బే,రంగు ఎర్రగా లేదు అంటూ మరింత తిలకంపొడి కలపటం,అబ్బబ్బే ఇంకా చాలా పలచగావుంది ఇంకా చిక్కబడాలి అంటూ దానమొఖం తోమించి,కడిగించీ ఆ మొఖాన్ని ప్రయోగ శాలగా  వాడుకొనేది.
      అలా చాలాసేపు ప్రయోగంచేసి చేసి, తిలకం కుదరిందని నమ్మకం వచ్చేకా,దానిని ఈక్లూసాయలు సీసాలలో.గ్రైప్ వాటరు సీసాలలోపోసి ,అసీసాలకు తాడుకట్టి, అద్దాల దగ్గర మేకులు కొట్టి తగిలించేది.."కాస్త తిలకం ఎట్టండీ "అంటూ అడిగితే,అడిగినవాళ్ళతోపాటు అడగని వాళ్ళకూ తిలకం బుడ్డిలు ఇచ్చేది.
     మాఇంట్లో అద్దాల దగ్గరవున్న బొట్టూ ,కాటుక మచ్చలను చూస్తేచాలు ఆడపిల్లం ఎందరం వున్నామో వీజీగా చెప్పెయ్యవచ్చు.
     మాపిన్ని చేత బొట్లు పెట్టించుకొన్నవాళ్ళకు మటుకు నిత్యం కళ్యాణంబొట్టుతోపాటు,పేకాటలోవుండే గుర్తులన్నీ, అంటే, కళావరు,డైమండూ,ఆటీను వగైరాలు .అలా బొట్టు పెడుతూ నోటిలో నాలుక మడతేసి "ళ్ ళ్ ళ్ "అని తమాషాగా శబ్దం చేయడమే కాకుండా ,"కదలకు మెదలకు కంసాలీ!కదిలితే నీముక్కు చెక్కిస్తా!దూలంమీదనుంచి దూకిస్తా, పట్టెడన్నమూ తినిపస్తా "అంటూ పాటకూడా పాడేది.
     ఇంక మా పిన్నికి గోరింటాకు రుబ్బడమంటే మహా సరదా.అలాగే మా చేతులకు పెట్టడమంటే కూడా సరదాయే.గోరింటాకు ఎర్రగా పండాలంటే ,కవిరి,కాకిబొడ్డూ,ఏడుతాటాకిళ్ళవి తాటాకు చూరు ముక్కలూ చిన్న బిళ్ళ పెంకుముక్కా ఇలా తనకి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తెమ్మని మమ్మల్ని పరుగులు పెట్టించేది.రుబ్బేటప్పుడే తన రెండు చేతులు ఎర్రగా పండేలా చూసుకొనేది.
       "నడుం నీలుక్కు పోయేలా నువ్వు పెట్టడమేకానీ,పెట్టినంతసేపు వుంచరోవిడా!"అంటూ అంటూ అమ్మ హెచ్చరించినా,వినేదికాదు.రెండు చేతులకూ,కాళ్ళకీ కూడా పెట్టేది.మాకందరికీ మూతులకు మంచినీళ్ళ గ్లాసులు అందించడం,మా అవసరాలకు బొందులాగుల ముళ్ళు విప్పడం ,కట్టడం మొదలైన సేవలన్నీ ఇష్టంగా చేసేది.  
       
      పాటంటే గుర్తుకొచ్చింది. మాపిన్ని పాటలు చాలా బాగా పాడుతుంది.మల్లీశ్వరీ,విప్రనారాయణ,భువనసుందరి కథ అలా తన చిన్నతనంలో చూసిన పాత సినీమాలలోని పాటలు అద్బుతంగా పాడుతుంది ఇప్పటికీ.మల్లీశ్వరిలోని "మనసున మల్లెలు మాలూగెనే "పాట తన పేటెంట్ అని చెప్పాలి.అంతబాగా పాడుతుంది.
     మళ్ళీ పాటంటే గుర్తుకొచ్చింది మా చిన్నాన్న తనపెళ్ళి చూపులుకి ఆమెను చూసుకోడానికి వచ్చినప్పుడు ఏంపాట పాడిందిటో తెలుసునా?
     అంతకుముందురోజు రాత్రి చూసిన  'పాతాళభైరవి 'సినీమలోని
"ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడూ"అన్న పాట పాడిందట. ఆపాట విన్న ఆమె పెద్దాడబడుచు ,అంటే మా పెద్దత్తయ్య అంటే, ఆ తరువాతకాలంలో నా అత్తగారు, ఆమె అందంతో పాటు,అమాయకత్వానికీ ముగ్దురాలై  పెళ్ళి కుదిర్చించిదట.ఇప్పుడు కూడా ఈ  ఎనభైలు  దాటిన వయసులోకూడా "  మా పిన్నిని "పిన్నీ! మా చిన్నాన్న పెళ్ళిచూపులకు వచ్చినప్పుడు ఏపాట పాడేవు?"అని సరదాగా అడిగితే,ఇప్పుడుకూడా పెళ్ళికూతురులా సిగ్గుపడుతూ"ప్రేమకోసమై వలలో పడెనూ"అంటుంది.
      మళ్ళీ పిన్ని పాటంటే గుర్తుకొచ్చింది పిన్ని పెళ్ళైన సంవత్సరం శ్రావణమాసం నోము పేరంటానికి చిన్నకన్నయ్య ఇంట్లో అద్దెకున్న రెవెన్యూ ఇనస్పెక్టర్ గారింటికి పేరంటానికి వెళ్ళింది.అక్కడ వాళ్ళు వచ్చిన పేరంటాలనందరినీ  పాడమని అడిగితే, పిన్ని మంచిపాట పాడింది.పేరంటాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు మాపిన్నిని
     ఎలాతెలిసిందో ఏమో మా మామ్మైకి అదే మా బామ్మకి  పేరంటం పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసరికి కాళికావతారమెత్తింది."గానా బజానా చేసేవుటకదా సిగ్గులేకుండా "అని నిలతీసింది.అంతే పిన్ని ఆ ఆల్చిప్పలంత కళ్ళలోంచీ బొటబొటా కన్నీళ్ళు పెల్లుబికి ధారాపాతమయ్యాయి.
     అదిమొదలు మళ్ళీ మా మామ్మైయ్య పోయినా సరే ,ఈమధ్యకాలంవరకూ నోరిప్పి పాటపాడితే ఒట్టు.
ఇప్పుడిప్పుడు మేమంతా మా ఇళ్ళలో జరిగే శుభకార్యాలలో పిల్లలు జరిపే గానా భజానాలో మా పిన్ని పాటలు వుండి తీరవలసిందే అంటూ పట్టుపట్టి పాడిస్తున్నాము.ఇంత లేటు వయసులోకూడామా పిన్ని పాటలో లాలిత్యము చెడలేదు. మా మనససులు మల్లెలమాలలూగుతూనే వుంటాయి పాట విన్న చాలా సేపటి వరకూ.
        అలాగే మా పిన్నికి పద్యనాటకాలంటే మహా పిచ్చి.మా ఊరి 'ఉమా రామలింగేశ్వరుడి'  కళ్యాణానికి గుడిలో రికార్డింగ్ డాన్స్ లేకాకుండా, వివిద రకాలైన కార్యక్రమాలు నిర్వహించేవారు.సినీమాలూ,నాటకాలూ అంటే మహా ఇష్షం మా పిన్ని సుందరికి.కానీ మా ఇంట్లో ఆకార్యక్రమాలకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు.
మా పిల్లలద్వారా నాన్నకీ,చిన్నాన్నకీ రికమండేషన్ పంపేది కానీ,నాన్న ముక్కుమీద వేలేసుకొనేవారు.చిన్నాన్న బుర్ర అడ్డంగా ఊపేవాడు.
       అందుకని పిన్ని  రాత్రి పనులన్నీ గబగబా ముగించుకొని ,పడమటి వైపు వసారాలో కుర్చీ వేసుకు కూర్చుని ,గుడి దగ్గరనుండి గాలిలో తేలుతూ వచ్చే పద్యాలను ఆలకిస్తూ మైమరచిపోయేది.
      గుడ్డిలో మెల్లగా రికార్డింగ్ డాన్స్ ల వాళ్ళు ఇంటిటికీ వస్తూ మా ఇంటి ముందుకూ వచ్చి పాటలకు డాన్సులు చేయడం,ఆ పాటలూ, డాన్సులూ ఇంతింతకళ్ళతో మాపిన్ని చూస్తుంటే,మేమూ మాకున్నంత కళ్ళతో  చూసి పిన్నిలాగే మేమూ సంబరపడేవాళ్ళం.
     " మేనత్త మొగుడు-మేనమవ కాడూ,పినతండ్రి పెళ్ళాం -పినతల్లి కాదూ అనే సామెత మా పిన్ని విషయంలో మటుకు అబధ్ధం అని చెప్ప గలను నేను.మా సుఖ దుఃఖాలు తనవిగానే భవించే మా పిన్నంటే మా అందరికీ చాలా ఇష్టం.ఆమె పదికాలాలు బాగుండాలనేదే మా అందరి ఆశ.
                    వాణి
కామెంట్‌లు
శ్యామ్ కుమార్ chagal. Nizamabad చెప్పారు…
It's beautiful. Excellent. Nice. Great memories. Thank you for sharing
Popular posts
సింప్లిసిటీ!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం