విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు సాంబుడు గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
' బేతాళా సాంబుడు శ్రీకృష్ణునికి జాంబవతి వలన కలిగిన మొదటి పుత్రుడు.
సాంబుని గురించి మహాభాగవతంలో రెండు ముఖ్య కథలు ఉన్నాయి. ఒకటి దుర్యోధనుడు సాంబుని బంధించడం, బలరాముడు వచ్చి దుర్యోధనునితో మాట్లాడడం, దుర్యోధనుడు దానికి అంగీకరించకపోవడం. అప్పుడు బలరాముడు హస్తినాపురం పొలిమేరలకు వెళ్ళి తన హలం కర్రు నగరం మధ్య వరకు నిలిపి నగరాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తే, భూకంపం వచ్చింది. కురువృద్ధులతో దుర్యోధనుడు వచ్చి బలరాముని వేడుకొనగా, బలరాముడు శాంతించి నాగలిని ప్రక్కకు తీసేస్తాడు. ఆ తరువాత దుర్యోధనుడుతనకూతురు లక్ష్మణను సాంబునికిచ్చి వివాహం జరిపిస్తాడు.
ఇంకోసారి దుర్వాసుడు బృందావనానికి వస్తాడు. యాదవులు పరిహాసానికి సాంబునికి ఆడ వేషం వేసి, దుర్వాసుని వద్దకు వెళ్ళారు. సాంబుడుకి అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడతాడా అని దుర్వాసుని అడిగారు. కోపించిన ఆ మహర్షి సాంబుడి ఉదరంలో ముసలం పుట్టుతుంది, సమస్త యాదవ వంశాన్ని నాశనం చేస్తుందని చెప్పి అక్కడనుండి నిష్క్రమిస్తారు. ఇది యాదవవంశం అంతరించడానికి కారణం అయ్యింది 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
సాంబుడు.పురాణ బేతాళ కథ..;- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
• T. VEDANTA SURY

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి