సున్నితం చంద్రికలు;- పుష్పా చంద్రమౌళి, ప్రముఖకవి,విమర్శకులు
 నా మనసులోని ప్రతిస్పందనలు 
ఇటీవలి కాలంలో అంతర్జాల మాధ్యమప్రసార నేపథ్యంలో కవన రంగంలో... ముఖ్యంగా తెలుగులో అనేకానేక నూతనప్రక్రియలుద్భవించాయి. ఇష్టపదులు, ఏక్ తార,నానీలు, నానోలు, హైకూలు, సున్నితాలు మొదలైనవి వాటిలో కొన్ని. సోదరి శ్రీమతి దీకొండ చంద్రకళ లబ్ధప్రతిష్ఠురాలైన కవయిత్రి. సున్నితం చంద్రికలు అన్న పేరుతో 200 సున్నితాలు నలభై శీర్షికలతో అందించారు. మకుటం చూడ చక్కని తెలుగు సున్నితంబు విశేషమేమంటే శీర్షికలోని విషయ వస్తువు 
సాహితీపరమైనదైనా కాకపోయినా ఈ మకుటమే ఉంటుంది. విచిత్ర ప్రయోగం.
ఇక ఈ సంపుటిలో ఉన్న 200 సున్నితాలలో నాలుగవ సున్నితం కొరోనా ప్రభావాన్ని అంతర్లీనమైన ఆవేదనకు మూలకారణంగా చెప్తూ రసాయనపు రంగులో కంటే ఇంట్లోనే ఒక్క పైకప్పు కింద పరస్పరాహ్లాద వర్ణభరితమైన మధుర క్షణాలతో వినోదించవచ్చుగదా అంటూ ఆశావహ దృక్పథమూ, మానవసంబంధాల మధ్య యాంత్రికతను దూరం చేసుకోమన్న సూచన బాగుంది. 
ఐదవ సున్నితంలో పాదాలు చాలా అందంగా ఉన్నాయి. ఎనిమిదవ, తొమ్మిదవ సున్నితాలలో మూడవ పాదాలలో క్రమంగా  *మహోద్యమం, స్వయం సమృద్ధి అని సరి చేసుకోవాలి. స్వాతంత్య్ర స్ఫూర్తిని అదే శీర్షికతో ఇంతకంటే సూక్ష్మంగా చెప్పడం కష్టమే. కవయిత్రి సాధించారు.
3వ శీర్షికలో యుగాది అని చాలా చోట్ల కనిపిస్తుంది. కానీ ఉగాది అని ఉంచాల్సింది. వాడుకలోని పదం. 14వ సున్నితంలో కలిగించునుగాదియన్నదే సరైన ప్రయోగం. ఈ సున్నితంలో మూడవ పాదం ఉగాదికి సరైన గొప్ప నిర్వచనం. 
గీతాంజలి లో 19 వ సున్నితంలో స్వేదములోనే సాక్షాత్కరించు భగవంతుడంటూ ఓ కొత్త ప్రయోగాన్ని చేసి ఎవరూ చెప్పని ఉనికిని భగవంతునికి ఇచ్చారు. ఇందులోని  చివరి సున్నితం ఎక్కడ మనసు నిర్భయము... అంటూ రవీంద్రుడు రచించిన గేయాన్ని తలపించింది.
 23వ సున్నితంలో ధారబోయు అన్న పదం సరైన ప్రయోగం.
 కష్టజీవులకు బ్రతుకు బరువు అంటూ మనసు బాధగా మూలిగేలా చేసారు. పనిలో, గనిలో, కార్ఖానాలో అంటూ (స్వశక్తి* శీర్షికతో ఉన్న సున్నితాలు) ఉన్న పాదం మహాకవి శ్రీశ్రీ గారి శంఖారావం కవితను జ్ఞప్తికి తెస్తుంది.
6వ శీర్షికలో 29, 30 వ సున్నితాలు బాధ్యతారాహిత్యం ఎలాంటి ఫలితాలను చూపిస్తుందో వెన్నులో చలిపుట్టించేలా హెచ్చరికతో ఉన్నాయి. ఎదుటి వారి తప్పిదాన్ని తప్పించుకో అంటూ వివేకంతో వ్యవహరించాల్సిన తీరును చెప్పారు. 
కందుకూరి వారిని *దుస్సాహసి అని గొప్పగా ప్రశంసించారు.
32వ సున్నితంలో ఉపయోగించిన ఘనుడు అంటే భావం బలంగా చెప్పినట్లయ్యేది. 
35వ సున్నితంలో మహిళాలోకానికి భూపాలమాలపించారు కవయిత్రి.
 
చిరునవ్వు శీర్షికతోడి సున్నితాలలో 37వ దానిలో చిరకాలం ఉండేవే చింతలంటూ కడు సున్నితంగా జీవితసారాన్ని తెలియజేశారు. హృదయం తేలికవ్వకుంటే అడుగు అని నవ్వు బలాన్ని ఓ ఛాలెంజ్ లా ముందుంచారు. చిరునవ్వుతో పూర్తగునలంకారం అన్న సున్నితం ఆలోచింపదగ్గది. 
42, 43 వ సున్నితాలలో కొరోనా బాధితులలో  ఆత్మస్థైర్యాన్ని పెంపొందించు ప్రయత్నం అద్భుతంగా చేసారు. 43వ సున్నితంలో *వాయువు - ఆయువు ప్రాస కుదిరింది.
 50వ సున్నితంలో బాధ్యతలు గుర్తుచేశారు. 
శ్రీ శ్రీ పై సున్నితాలు ఆయన భాషనే ప్రతిధ్వనించాయి. 
23వ శీర్షికతో మాజీ ప్రధాన మంత్రి పి. వి. గారి పై 61వ సున్నితంలో మేధావి. అంటే చాలు. మేధా జ్ఞాని సరైన ప్రయోగం/సమాసం కాదు. ఠీవి సరైన పదం. సమవర్తిపద ప్రయోగం అద్భుతం. 
69వ నానీలో కాగితం పూల పలకరింపులంటి యాంత్రికశైలి బదులు జీవకళ ఉట్టి పడేలా పలకరింపు ఉండాలన్న 70వ సున్నితం అందంగా ఉంది. 72వ సున్నితం తొలకరినాటి అనుభూతినందించింది. పుడమి పుత్రుడంటూ రైతన్నను పలకరించిన సున్నితం చక్కటి భావవ్యక్తీకరణం. 75వ సున్నితంలో గిలిగింతలతోడి  ఆహ్లాదాన్ని అందించారు. 
76వ సున్నితంలో ఆలయస్తంభాలు ముద్రారాక్షసంతో ఉంది. 77వ సున్నితంలో మొండిరాళ్ళు 78వ సున్నితంలో తనుధనువులు మంచి పదాలు. 
రామప్ప తలిదండ్రులు పరస్పర భిన్నమైన శైవవైష్ణవులు కనుక నాటి కాలంలో ఈ రెంటిమధ్య సయోధ్యను మతసామరస్యతనుట్టిపడేలా శైవ వైష్ణవ శిల్పాలతో ఆలయనిర్మాణం చేసిన రామప్ప ఘనతను ఈ సున్నితంలో చూపించారు రచయిత్రి. 
తెలంగాణ సంస్కృతికి ప్రతీకయైన, *లాల్ దర్వాజా బోనాలు చక్కని సున్నితాలయ్యాయి
 కలాం గారి రచనలలోని పదాలను గుర్తు చేస్తూ రాసిన సున్నితాలలో 85వ దానిలో జనరాష్ట్రపతి/ప్రజల రాష్ట్రపతి అనవలసింది. భిన్న భాషాపదాల ప్రయోగం వాడుకలో ఉన్నా కృతకంగా ఉంది. 86వ సున్నితంలో నేటి నేతల తాటను సున్నితంగా వొలిచారు. 
91 వ సున్నితంలో చెండాడె సరైన పదం. 
మంచు కొండలు మల్లెల దిండులు ఉపమానం అదిరింది. సైనికులకు నిజమైన నివాళిగా సున్నిత పదాలు అమరాయి.
65వ దానిలో పరులకై బదులు తనవారికై/ దేశప్రజలకై అనడం సబబు. లేదంటే అర్థభేదం స్ఫురిస్తుంది. వరకట్నం శీర్షికలో సంప్రదాయం సరైన పదం.
 99 వ సున్నితంలో యువకుల పేరున వరుని తలిదండ్రులు ముఖ్యంగా విద్యావంతులైన యువకుల వీపుపై ఛెళ్ళుమనిపించారు. 100వ సున్నితంలో హితవు పలికారు. 
103వ సున్నితంలో చెడు అనునది చేతలతోనే అని మంచిచెడులు ఫలితాలను నిర్దేశించి 104, 105 సున్నితాలలో చేసిన హితోపదేశం ఆలోచనలను రేకెత్తిస్తుంది. చిత్రమేమిటంటే దైవమూ దయ్యమూ కూడా కనిపించరు. కనిపించని దైవం తనకు తోడుగా ఉంటుందని భావించక కనిపించని దయ్యాన్ని యెదుటనూహించుకొని భయపడతాడు మనిషి.
తెలుగు భాషాదినోత్సవంపై సున్నితాలు తెలుగు వారి కర్తవ్యాన్నిబోధించాయి.
 గురువుని నిరంతర విద్యార్థి అంటూ గురుజ్ఞాన రహస్యాన్ని తెలిపారు. 112లో తారతమ్యాలెరుగక అని ఉండాలి. విరజానది అంటే సరిపోలేదు. వైతరణి అనవలసింది. శ్రేష్ఠ అనాలి 116వ సున్నితంలో. 25వ శీర్షికలోని సున్నితాలలో ఇరుగు పొరుగుదేశాల లక్షణాలను తూర్పారబెట్టారు. 
26వ శీర్షిక వర్తమాన స్థితి లోని హేయపరిస్థితులకు అక్షర దర్పణం. దీనిలోని చివరి సున్నితంలో అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలివీయని చెప్పి బాధ్యతగల రచయిత్రి ననిపించుకున్నారు.
రక్తదానంపై సున్నితాలు ప్రబోధాత్మకంగా ఉన్నాయి. బతుకమ్మపై ఒడలు పులకలెత్తేలా ఉన్నాయి సున్నితాలు. 
150వ సున్నితంలో నోబెల్ అనాలి. 
ఐ. రా. స. ఆవిర్భావ చరితను సూక్ష్మంగా చక్కగా సున్నితరూపాలలోనికి మార్చారు. దృఢసంకల్పం గలిగిన ఉక్కు మనిషియని ఉండాలి. భావంలో బలముంటుంది. 
156వ సున్నితంలో దీపావళి నిర్వచనాన్ని అంతర్లీనం చేసారు. 158వ సున్నితంలో అమావాస్య అజ్ఞానంతోనే పోల్చి ఆ రెండింటి తిమిర సంహారిణి ఈ పర్వమనడం సహేతుకమైన భావన. 
160వ సున్నితంలో బాధ్యతాయుతమైన హితబోధ ఉంది.
164వ సున్నితంలో మొదటి రెండు పాదాలు దాశరథి భాష్యాలే. ఆయనకు స్థూలమైన నివాళి ఇది. 169వ సున్నితంలో మసలేవారు అని ఉంటే సందిగ్ధత లేని స్పష్టత ఉంటుంది. 
రేపటి పౌరులు చక్కని సున్నితాలు. 172వ సున్నితంలో మహిళ మణికర్ణిక అంటే సరిపోతుంది. ఝాన్సీపై చిక్కగా ఉన్నాయి సున్నితాలు.
181 నుండి ఐదు సున్నితాలు స్ఫూర్తిమంతంగా ఉన్నాయి. బిపిన్ రావత్ హఠాన్మరణం ఈ సున్నితాలలో హృద్యంగా, స్ఫూర్తిదాయకంగా అమర్చారు కవయిత్రి.
సున్నితాలలో సిరివెన్నెలపై రాసిన సున్నితాలు ఈ సంకలనానికే తలమానికం అంటే అతిశయోక్తి కాదు.
సహకారం పై గల సున్నితాలలో 197లోని మొదటి రెండు పాదాలూ శ్రీ శ్రీ గారి పాట ప్రభావంతో యథాతథంగా వెలిసాయి. 198వ సున్నితంలో సహకార భావన వలన యేనుగంత కార్యము చీమయంత అగునని చెప్పిన భావం పాఠకుని గుండెల్లో నాటుకుపోతుంది.రచన లక్ష్యమూ నెరవేరుతుంది.
200వ సున్నితంలో మొదటిపాదం ఆ శీర్షికకే వన్నె తెచ్చింది. కవయిత్రి ఆయా విషయాలను వస్తువులుగా స్వీకరించి శిల్పం చెడకుండా ఆసక్తి కరంగా తొలిసంపుటంగా సున్నితాలనందించారు. సామాజిక వైజ్ఞానిక స్పృహతో కూడిన సున్నితాలనందించారు. ఏదో రాసేసానన్నట్లు కాకుండా అవసరమైన చోట సున్నితంగా వాతలు పెట్టి సమస్యా పరిష్కారం కూడా చూపించారు. ఓ సగటు కవికి ఉండవలసిన లక్షణాలు పుష్కలంగా ఆమె సున్నితాలలో ప్రస్ఫుటితమయ్యాయి. అభినందనలతో...
              

కామెంట్‌లు
సమీక్షకుని పేరు
పుప్పాల కృష్ణ చంద్ర మౌళి
జయపురం
ఒడిశా
పొరపాటున పుష్పా అని అచ్చయ్యింది.
సమీక్షకుని పేరు
పుప్పాల కృష్ణ చంద్ర మౌళి
జయపురం
ఒడిశా
పేరు పొరపాటున తప్పుబడింది. సరిచేయగలరు