మనం ఏపని చేస్తున్నా దాని పైనే ధ్యాస దృష్టి పెట్టాలి.బడిలో విద్యార్థులు టీచర్ ఇంట్లో వంట చేసే అమ్మ ఉద్యోగం చేసే నాన్న వారు వీరని లేదు అంతా అలా ఉంటేనే పనులు సక్రమంగా సాగుతాయి. యోగ మెడిటేషన్ కూడా ఇదే చెప్తోంది.
ఊరిచివర ఓసాధువు ఉన్నాడు.ఎప్పుడూ దైవప్రార్థన నామస్మరణ తప్ప ఇంకో ధ్యాస లేనే లేదు. ఊరివారు పాలు పళ్ళు ఫలహారం పెట్టినా అస్సలు వాటివంక కన్నెత్తి చూసేవాడు కాదు. ఒకరోజు రాజభటుడు ఆ ఆశ్రమం దగ్గర కాసేపు విశ్రాంతి తీసుకుని కత్తిని తీసుకుని వెళ్లటం మర్చిపోయాడు.వారం రోజుల తర్వాత సాధువు దృష్టి దానిపై పడింది. "ఎవరిదీ కత్తి? ఇక్కడి కి ఎలా వచ్చింది?" అనే మీమాంస బయలుదేరింది.ఆమర్నాడు తన దగ్గరికి వచ్చినవారిని దాన్ని గూర్చి అడిగాడు. " మాకేం తెలీదు స్వామి! పాలు పండ్లు అక్కడ పెట్టి పోతాం"అన్నారు రోజూ వచ్చే ఆవృద్ధ భక్తులు! తమాషా ఏమిటంటే ఆరోజు నించి సాధువు ఆకత్తిని దాని యజమానిని గూర్చి ఆలోచించటం మొదలు పెట్టాడు."ఈకత్తి నాకుటీరంలో ఉన్నంత కాలం దీన్ని కాపాడే బాధ్యత నాదే" అనుకుంటూ రోజూ దాన్ని శుభ్రం చేసేవాడు. ఓం నమశ్శివాయ అనే జపంమానేసి ఆకత్తిని ఎవరన్నా కాజేస్తారేమో అని సందేహంతో ఉండేవాడు.పైగా తన దగ్గరే పెట్టుకుని తను ధ్యానం లో మునిగితే ఎవరైనా కాజేస్తారేమో అనే అనుమాన పిశాచం పట్టుకుంది.తను బైటకి వెళ్తున్నా దాన్ని తనవెంటే ఉంచుకుంటున్నాడు.ఒక సారి ఆఇద్దరు భక్తులు అడిగారు"స్వామి!మీరు కత్తి తో తిరుగుతున్నారేంటి?" అని. "ఎవరో సైనికుడు మర్చిపోయి ఉంటాడు. అతను కనపడితే తన కత్తిని గుర్తిస్తాడుకదా" "అతనే మీకుటీరానికి వస్తాడేమో?మీరు తిరగడం ఎందుకు?" దాని కి జవాబు చెప్పేవాడు కాదు. "పాపం!సాధువుది ఎంత మంచి మనసు? పరులసొమ్ముని ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నాడు"అని అంతా పొగిడేవారు. ఒకరోజు సాధువుకి ముళ్లపొదలు కన్పడితే చేతిలోని కత్తి తో వాటిని నరికేశాడు.క్రమంగా పాముపుట్టలు చిదపేశాడు.కోడిని గ్రద్ద తన్నుకుపోతుంటే కత్తిని విసిరి దాని రెండు కాళ్లు నరికాడు.ఎలుకను తరుముతున్న పిల్లిపై కత్తి విసిరాడు. తను సాధుప్రాణులకి మంచి చేస్తున్నా అనుకుని అంతా చెడుతలంపులతో పతనమైనాడు.హింసాప్రవృత్తి అతనిలో పెరిగి దుర్మార్గునిగా మారాడు.అందుకే మనం ఎప్పుడూ మంచి గా ఆలోచిస్తూ మంచి పనులే చేయాలి. లేకుంటే మనం నైతిక పతనం చెందుతాం🌹
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి