ఇందులో ఏముంది?;-- యామిజాల జగదీశ్
 కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు సి. సుబ్రమణ్యం. ఆయన తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. 
ఆయన అమెరికా పర్యటనకు వెళ్ళిన సమయంలో ఓ నోబుల్ బహుమతి గ్రహీతను కలిశారు. ఆయన ఓ యూనివర్సిటీ  ప్రొఫెసరు. 
ఆయనతో భేటీ అయిన సి. సుబ్రమణ్యం అదే రోజు క్రాఫ్ చేయించుకోవడానికి ఓ హెయిర్ కటింగ్ సెలూనుకి వెళ్ళారు. అయితే అక్కడ తనకు క్రాఫ్ చేయడానికి కత్తెర పట్టుకున్న వ్యక్తిని చూసి సుబ్రమణ్యం నిర్ఘాంతపోయారు. 
కారణం మరేమిటీ కాదు. 
ఆయన ఏ నోబుల్ బహుమతి గ్రహీతను కలిశారో ఆయనే ఇప్పుడు చేత కత్తెర పట్టుకుని సిఎస్ ముందున్నారు.
"ఏంటీ, మిమ్మల్నేగా నేను కలిసిందీ?" అని అడిగారు సిఎస్. 
"అవునండీ నేనే ఆ మనిషిని. ఇందులో ఏమాత్రం సందేహం లేదు? అన్నారా ప్రొఫెసరు. 
అప్పుడు సి. సుబ్రమణ్యం "మీరీ పని చేయడమేమిటీ?" అడిగారు. 
"...ఇక్కడ ఈ పనికి మనుషులు కావాలని తెలిసింది. ఓ గంట ఫ్రీ టైమ్ ఉండటంతో దాన్ని ఎందుకు వృధా చేయడమని ఈ పని చేయడానికొచ్చాను" అన్నారాయన.
"మీరు చేస్తున్న ఈ పనికి మీ వాళ్ళు మిమ్మల్ని చిన్నచూపు చూడరా? చులకనగా మాట్లాడుకోరా?" అని సి. సుబ్రమణ్యం మళ్ళీ అడిగారు.
అయితే ఆ ప్రొఫెసర్ "ఇక్కడెవరూ ఏమీ అనుకోరండీ. ఇక్కడ ఇది కూడా ఓ వృత్తే. ఇందులో తప్పేమీ లేదు" అనడంతో సి.ఎస్. నోటంట మాట లేదు.
యూ ట్యూబ్ లో  పళనిభారతి అనే కవి ప్రసంగంలో చెప్పిన ఉదంతమిది.

కామెంట్‌లు