సుప్రభాత కవిత ; -బృంద
హేమంతాలు కరిగిపోయి
శిశిరాలు  రాలిపోయి
కొత్త చివురులు  కొత్త క్షణాలు
అదే  కాలచక్రభ్రమణం

రాలిన ఆకుకు  రాగాలుండవు
చివురించే చిగురుకు పగలు ఉండవు
చీడలన్నీ మధ్యలోనే!

పూతకొచ్చిన ప్రతి మొగ్గా
పండిపోదా?
పండిపోయిన ప్రతి ఆకూ
రాలిపోదా??

రాల్చిన ఆకుల లెక్కపెట్టదు
కొత్త చివురుకు అడ్డుచెప్పదు
పండో..పువ్వో....పరిమళమో
నీడనో గాలో  ఏదైనా ఇవ్వడమే!

మౌడైనపుడు కుంగిపోదు
ఆకులు తోడైనపుడు పొంగిపోదు
నిబ్బరంగా ఎదురుచూస్తుంది
సరైన సమయం కోసం.

పవనాలతో  చుట్టేస్తూ
సేద దీరమని నీడనిస్తూ
గలగలమని ఆకుల సవ్వడితో
అలసిన మనసును ఆదరిస్తూ

మౌనంగా నేనున్నానని
ఓదారుస్తూ......
రాతిదెబ్బలకు బెదరొద్దని
అన్నిటికీ అతీతంగా వుండాలని


మౌనంగా పాఠం చెప్పి
దీపంగా గుండెని వెలిగించి
రూపంలేని కలతలకు
కుంగిపోవద్దని వెన్నుతట్టే

వృక్షం మన గురువు...
మన నేస్తం..కాదా
అలా వుండగలిగితే బ్రతుకున
వెలుగులు నిండవా?

వేదనైనా  వేడుకైనా
కష్టమైనా సుఖమైనా
మంచైనా చెడు అయినా
కదిలిపోక తప్పదు

🌸🌸  సుప్రభాతం🌸🌸

 

కామెంట్‌లు