అతి ప్రమాదకరమైన అంతర్గత శత్రువులు అరిషడ్వర్గాలు; - సి.హెచ్.సాయిప్రతాప్
 మనిషి  మనుగడకు,ఎదుగుదలకు ,అభివృద్ధికి   అడ్డు పడే  ఆరు సంతర్గత శత్రువులు, అన్ని దుఃఖాలకు   మూల కారణాలు అయిన ఈ అరిషడ్వర్గాలు అందరు శత్రువులకెంటే అత్యంత ప్రమాదకరమైనవీ.  మనిషి మనసును , చెట్టుకు పట్టిన  చెదలా  పీల్చి పిప్పి చేసేవి ఈ అరిషడ్వర్గాలు అన్నది శాస్త్రవాక్యం. ఈ అరిషడ్వర్గాలు  రెండు వైపులా  పదునున్న కత్తి లాంటివి.  కామ , క్రోధ , లోభ  , మోహ , మధ  మరియు  మాత్సర్యం అనే ఆరు వర్గాలే  ( శత్రువులు ) ఈ  అరిషడ్వర్గాలు అన్నది శాస్త్రనిర్వచనం.  
 
మనిషి అభివృద్ధికి   అడ్డు పడే , మనిషి  దుఃఖాలకు   మూల కారణమయ్యే ఈ ఆరుగురు అంతర్గత శత్రువులను అదుపులో పెట్టుకోకపోతే మానవులు అధ:మ పాతాళానికి దిగజారిపోతారని శాస్త్రం హెచ్చరిస్తోంది.
ఈ అరిషడ్వర్గాలు  మానవులను  శారీరకంగా  , మానసికంగా , ఆర్ధికంగా  సాంఘీక  పరంగా , సామాజిక పరంగా  అదః పాతాళ లోకానికి  త్రొక్కేస్తాయి . కాబట్టి   వీటిని  ఎప్పుడూ అదుపులో ఉంచు కోవాలి .  ఎప్పుడూ అవి మన అదుపులో ఉండాలి   గాని  , వాటి  అదుపు  లోకి మనం వెళ్ళ  కూడదు  అని ఆద్యాత్మిక వేత్తలు పదే పదే హెచ్చరిస్తున్నారు.

కామక్రోధాదులనే అరిషడ్వర్గాలను విసర్జించనివారు , నియంత్రించలేనివారు అరణ్యాలలో ఉండికూడా ఏమీ చేయలేరు. అంటే, శాంతిని పొందలేరు.అదే వీటిని  జయించినవారు అరణ్యానికి వెళ్లవలసిన పనే లేదు. ఎక్కడైనా శాంతిగా ఉండగలరు. భగవత్ కృప కోసం యమ, నియమాది కఠోరమైన నియమాలను అనుసరించాల్సిన పనే లేదు.అందువల్ల, ఇంద్రియ నిగ్రహంతో కామక్రోధాది అరిషడ్వర్గాలను జయించడం వల్లనే పరమమైన శాంతిని పొందగలరు.
అతి దుర్లభమైన మానవ జీవితానికి ఒక పరమార్థాన్ని సాధించేది ఆధ్యాత్మిక భావసంపన్నతే అన్నది నిర్వివాదాంశం. కేవలం తన ఉన్నతిని మాత్రమే కాంక్షించకుండా సర్వమానవజాతి కూడా ఉన్నత స్థాయికి చేరుకొని అతి దుర్లభమైన భగవత్ అనుగ్రహాన్ని  సాధించాలని కోరుకునే భావనే ఆధ్యాత్మిక భావన. దీనిని నియంత్రిచే  దురభాసాలను మిక్కిలి సహనంతో, బుద్ధితో అధిగమించి ముందుకు సాగిపోవాలన్న ప్రాచీన సనాతన భారతీయ సంస్కృతి , సంప్రదాయాలనుగుణంగా సాగిపోతే అన్ని విజయాలు మనకు సాధ్యమేనన్నది ఉపనిషత్ ఉవాచ.  

కామెంట్‌లు