తనదాకా వస్తే కాని.. "-!;- - బోగా పురుషోత్తం, తుంబూరు.
  ఈగ, దోమ ప్రాణ స్నేహితులు, రెండూ ఓ నది ఒడ్డున  చాలాకాలంగా కలిసి నివసిస్తున్నాయి. రెండూ ఓ చెట్టు తొర్రలో గూడుకట్టుకుని ఉంటున్నాయి. 
   ఈగ పగలంతా పరిసరాలన్ని తిరుగుతూ ఆహార పదార్థాలపై వాలి తనకు కావాల్సిన ఆహార పదార్థం తిని కొంత తన పిల్లలకు తెచ్చిపెట్టేది. దాని పిల్లలు హాయిగా నిద్రించేవి. 
   దోమ రాత్రి వేళల్లో బయటకు తుర్రుమని వెళ్లేది. పగలంతా చెట్టు తొర్రలో నివసించేది. దాని పిల్లలు ఆహారం లేక పస్తులతో ఉండటం చూసి ఆవేదనతో తను తెచ్చిన శాఖాహారం పెట్టేది. దాన్ని చూసిన దోమ ‘‘ ఇదేం ఆహారం.. రుచిపచి వుండదు.. అసలు దీన్ని తింటే బలం రాదు.. మంచి పుష్టికరమైన ఆహారం తింటేనే నాల్గు కాలాల పాటు హాయిగా జీవించగలం..నేను తినే ఆహారం మంచి రుచిగా వుంటుంది.. రేపు నాతో రా..తృప్తిగా  తిని ఆనందిద్దువుగాని..’’ అంది. 
  దోమ మాటలు విని ఈగ ఆశ్చర్యపోయింది. తను తెచ్చిన పంచభక్ష పరమాణ్ణం కన్నా రుచికరమైన ఆహారం ఇంకేం ఉంటుందబ్బా?’ అని  ఆలోచించింది.
   ఎలాగైనా దోమ చెప్పిన ఆహారం రుచి చూడాలని ఆశపడిరది. అయితే ఆ రాత్రి ఈగ తను తెచ్చిన లడ్డూ, కేక్‌లను దోమకు పెట్టి తినమని ఆహ్వానించింది.
  దోమ నవ్వి ‘‘ ఇదీ ఒక ఆహారమేనా? నాకు అసలు ఇలాంట ఆహారం రుచించదు..మంచి పసందైన రుచికర, పుష్టికర ఆహారం తింటాను..నాతో పాటూ రా..విందు భోజనం ఆరగించొచ్చు..’’ వ్యంగ్యంగా అంది.
  ఈగకు దాని ఆహారంపై ఆసక్తి పుట్టింది. ఎలాగైనా పసందైన ఆహారం రుచి చూడాలని ఉవ్విళ్లూరింది. మరుసటి రోజు రాత్రి దోమ తన చిన్నపిల్లలతో ఆహారం కోసం బయలుదేరింది. ఈగను కూడా ఆహ్వానించింది.
    దోమ ఓ పల్లెకు వెళ్లింది. ఓ ఇల్లు వెతికింది. బాగా పెళ్లి పందెర వేసి వుంది. జనం హాయిగా నిద్రిస్తున్నారు. దోమ వెళ్లి పెళ్లి కొడుకుమీద వాలింది. బాగా రక్తం తాగింది. దాని పిల్లలు కూడా మనుషులపై వాలి తమకు కావాల్సిన రక్తం పీల్చి తృప్తిగా తాగుతూ ‘‘ ఈగ బావా రా.. త్వరగా నువ్వు కూడా రుచి చూద్దువు..’’ అని పట్టుబట్టింది దోమ.
    ఈగకు ఇది రుచించలేదు. అక్కడే వున్న బిర్యాని, అన్నం, వేపుడు, కూరలపై వాలి తనకు కావాల్సిన ఆహారాన్ని తృప్తిగా తిని బ్రేవ్‌మని తేపుతూ ఇక చాలు..నాకు నిద్ర ముంచుకు వస్తోంది.. వెళ్దాం రా..’’ అంది ఈగ.
   దోమకు తృప్తి తనివితీరలేదు.
   ‘‘ నువ్వెళ్లు.. నాకు కడుపు నిండలేదు..’’ అంది దోమ.
  ఈగకు నిద్ర ముంచుకురావడంతో ఇంటిదారి పట్టింది.
  దోమ ఆ రాత్రంతా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుపై వాలి రక్తమంతా పీల్చింది.  వచ్చిన జనం రక్తం అంతా పీల్చి ఆ రాత్రంతా నిద్రలేకుండా చేసింది.
  ఈగ ఇంటికి వెళ్లి కడుపు నిండా తిండి తిని తన పిల్లలకు పెట్టి నిద్రించింది. 
   దోమ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు బ్రేవ్‌ మని తేపుతూ వెళ్లి పడుకుంది.
    మరుసటి రోజు ఈగ ఆ పెళ్లి ప్రాంతానికి వెళ్లింది. మంచి శాకాహార భోజనం రుచిని ఆస్వాదించింది. సాయంత్రం వరకు అక్కడే గడిపింది. పెళ్లి వారందరికి వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రిలో చేరారు. ఆ మరుసటి రోజు చాలా మందికి డెంగ్యూ పట్టుకుంది. అందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆందోళనతో ఆస్పత్రిని వీడలేదు. వారిలో ఓ బాలుడుకి ప్లేట్‌లెట్స్‌ తగ్గి ఆరోగ్యం బాగా క్షీణించి కన్నుమూశాడు. దీంతో ఆ  పల్లెంతా కంటతడి పెట్టి తల్లడిల్లింది.
  వారి బాధ చూసి ఈగ గుండె బరువెక్కింది. దోమ దగ్గరకు వెళ్లింది.
   ‘‘ దోమ బావా..నువ్వు నిన్న చూపిన నీ ప్రతాపానికి జనం అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో ఓ చిన్నారి
డెంగ్యూతో కన్ను మూశాడు.
  ఆనందం వెల్లివిరియాల్సిన పెళ్లి ఇంట విషాదం నెలకొంది.
   బాలుడి తల్లిదండ్రులు దు:ఖంతో తల్లడిల్లుతున్నారు.. నువ్వు ఇకనైనా నీ ఆహారం మార్చుకుని మనుషుల్ని మానసిక క్షోభపెట్టడం మానుకుని మానవత్వం అలవరుచుకో..’’ అని ఈగ హితవు పలికింది.
   దోమ ‘‘ హ్హి..హ్హి.. ఓస్‌ అంతేనా.. ఎవరికో ఏదో అయ్యిందని నా రుచికర ఆహారం మానుకోమంటానా?’’ ఎదురు ప్రశ్న వేసింది.
    ‘‘ ఇప్పుడే ఏమైంది.. ఇక చూడు నా తడాఖా..!’’ అంది దోమ.
   ‘‘ దోమ బావా..దోమ బావా..మనుషులను క్షోభకు గురిచేయడం మంచిది కాదు..నీ పద్ధతి మార్చుకో.. లేదంటే అది నీకే ప్రమాదం..’’ అని హితవు పలికింది ఈగ.
 దోమ తమ తీరును మార్చుకోలేదు. తమ పిల్లలను వెంటబెట్టుకుని ఆస్పత్రికెళ్లింది. అస్వస్థతకు గురైనవారిపై వాలి మళ్లీ రక్తం పీల్చింది. ‘‘ అబ్బా ఎంత రుచికరంగా వుందో..’’ అంటూ ఆనందంతో గంతేసింది. అక్కడ పూర్తిగా ఆహారం  తీసుకున్న తర్వాత పెళ్లి ఇంటికి వెళ్లింది. అక్కడ తన పిల్లలు స్వైరవిహారం చేయసాగాయి. దోమ మరో దిక్కుకు వెళ్లింది. చిన్నారిని కోల్పోయిన బాధతో వున్న వారికి పిల్లదోమల్ని చూసి వారి కళ్లు చింతనిప్పుల్లా మండాయి.  సిద్ధంగా వుంచుకున్న మస్కిటో కిల్లర్‌ బ్యాట్‌ను ఝలిపించింది.  పిల్ల దోమలు ‘టఫీ..టఫీ..’ మంటూ నేల కూలాయి.
  అప్పుడే అక్కడికి వస్తున్న తల్లిదోమ తమ పిల్లలు కళ్ల ఎదుటే కన్నుమూయడం చూసి దు:ఖించింది. గుండెల్ని పిండేసిన బాధతో ప్రాణం ఎవరికైనా తీపేనని..తన ఆహారం కోసం పెళ్లివారి బంధువుల చిన్నారి ప్రాణం తీసిన తనకు తన బిడ్డ ప్రాణం పోయి తగిన శాస్తి జరిగింది..’’ అని దోమ కుమిలిపోసాగింది. ప్రాణం విలువ తెలుసొచ్చిన దోమ అప్పటి నుంచి చిన్నారుల జోలికి వెళ్లలేదు.


కామెంట్‌లు