కొంగ చేసిన మోసం..;- బల్ల కృష్ణవేణి-పలాస

 పూర్వం ఒక అడవిలో స్వప్నిక అనే కొంగ ఉండేది. అది ముసలిది అయిపోవడం వల్ల ఇతర కొంగల లాగా వేటాడి ఆహారము సంపాదించడం కష్టం అయిపోయింది. అందుకు అది ఒక ఉపాయం ఆలోచించింది. బదరిక వనంలో కొల్లేరు అనే సరస్సు ఉంది. ఆ సరస్సునిండా చేపలు ఉన్నాయి అని తెలుసుకుంది. ఆ ముసలి కొంగ సరస్సు దగ్గరకు చేరుకుంది. సరస్సు ఒడ్డున ఒంటికాలితో జపం చేయడం మొదలు పెట్టింది. ఆ సరస్సులోని చేపలు కొంగ చుట్టూరు వచ్చి చేరాయి. అయినా కొంగ చేపలను చంపి తినలేదు. అది చూసి చేపలు ఆశ్చర్యపోయి, కొంగా.!! నీకు మేము ఆహారం, పైగా నీకు అందుబాటులో కే వచ్చి నిలబడ్డాము, మమ్మల్ని తినవేంటి,? అని అమాయకంగా అడిగాయి. అప్పుడు ఆ కొంగ ఓ నా చేప మిత్రులారా! నేను గంగానది ఒడ్డున మర్రిచెట్టు మీద కూర్చుని ఉన్నాను, ఆ చెట్టు కింద ఒక యోగి తన శిష్యులతో ధర్మాలను చెప్తూ, సకల ప్రాణుల యందు దయతో ఉంటే గాని, మోక్షం లభించదు అని చెప్పారు. అది విన్న నేను ఇకనుండి మీలాంటి జీవులను చంపి తినకూడదని నిర్ణయించుకున్నాను. అని చెప్పింది. చేపలు సంతోషించాయి. కొద్ది రోజులలోనే చేపలు, కొంగ మంచి మిత్రులు అయ్యాయి. ఒకరోజు ఉదయం చేపలు నీటి పైకి వచ్చేసరికి కొంగ ఏడుస్తూ కనబడింది. మిత్రమా! ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగాయి చేపలు. ఏమి చెప్పను మిత్రులారా! ఇప్పుడే చేపలు పట్టేవాళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్లు ఈ సరస్సులో చాలా చేపలు ఉంటాయి త్వరలో వచ్చి ఈ చేపలను పడదాం అనుకోవడం విన్నాను అని చెప్పింది బాధగా, చేపలన్ని ఇప్పుడు ఎలా అని బాధపడసాగాయి. కొద్ది రోజులలోనే మనం మంచి మిత్రులు అయ్యాం కానీ త్వరలోనే మీరంతా చేపల వాళ్ళ వలలకి చిక్కుతారని తలచుకుంటేనే నా మనసుకి ఏదోలా అయిపోతుంది అని దొంగ కన్నీరు కార్చింది కొంగ. కొంగ మిత్రమా! ఈ ఆపద నుండి నువ్వే మాకు కాపాడాలి అని ఒక చేప అంది. అయ్యో! నేను ముసలి కొంగను, మిమ్మల్ని ఎలా రక్షిస్తాను, అయినా ప్రయత్నిస్తాను. ఇక్కడకు దగ్గరలో ఉన్న కొండలలో ఒక సరస్సు ఉంది ప్రతిరోజు మూడు చేపలు చొప్పున ఆ సరస్సు దగ్గరకు చేర్చుతాను అని చెప్పింది కొంగ మాటలకు చేపలు చాలా సంతోషించాయి. అప్పటినుండి ఆ కొంగ ప్రతిరోజు చేపలను తన ముక్కుతో పట్టుకుని వెళ్తూ ఉండేది కొంతసేపటి తరువాత కాళీ నోటితో తిరిగి వచ్చి తీసుకెళ్లిన చేపలన్ని క్షేమంగా మరో సరస్సులో వదిలి వచ్చానని మిగతా చేపలకు చెప్పేది. ఇలా కొద్ది రోజులు గడిచిపోయింది. సరస్సులోని చేపలు సగం వరకు ఖాళీ అయిపోయాయి. అదే సరస్సులో చతురుడు అనే ఎండ్రకాయ ఉంది. దానికి కొంగ చేపలకి చేసినది మేలు కాదు కీడు అని అనుమానం వచ్చింది. ఆ విషయం చేపలకి చెప్పి, మరునాడు నేను కూడా కొంగతో వెళ్తాను అంది సరే అన్నాయి చేపలు. కొంగ మిత్రమా! ఈరోజు నా వంతు నన్ను తీసుకెళ్ళు అంది. ఆహా! రోజు చేపలు తిని విసుగేసింది, ఈరోజు ఎండ్రకాయతో నాకు విందు భోజనము అనుకుంది కొంగ. అప్పుడు ఎండ్రకాయను నోటికి కరుచుకొని పోవాలనుకుంది, కొంగ మిత్రమా! నన్ను నీ ముక్కుతో పట్టుకుంటే నా కాళ్లు నీ కళ్ళలో గుచ్చుతాయి నీకే ప్రమాదం. అందుకని నీ మెడను నేను పట్టుకుని ఉంటాను అంది కొంగ సరే అంది. కొంత దూరము ప్రయాణం చేశాక ఎండ్రకాయ క్రింద చూస్తూనే ఉంది ఎక్కడ సరస్సు లేదు, ఇది కొంగ కాదు దొంగ దీనికి తగిన శాస్తి చేయాల్సిందే, అనుకుని కొంగ మెడను కొరికేసింది, కొంగ ప్రాణాలు వదిలి కిందకు పడిపోయింది. ఎండ్రకాయ కొంగ మెడ వదిలి సరస్సువైపు నడిచింది చేప మిత్రులని కలసి జరిగినది చెప్పింది చూశారా! మోసము ఎంత కాలం దాగదు
'తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలని తన్నేవాడు ఒకడుంటాడు"
అబద్దాలు చెప్పి చేపలను చంపి తిన్న కొంగ ఎండ్రకాయ చేతిలో చచ్చింది. అందుకు ఎవరిని మోసం చేయరాదు. అలా చేస్తే కొంగలా ఫలితం అనుభవించాల్సి వస్తుంది.
-----------------------------

కామెంట్‌లు