మా గ్రామం లో చెప్పుకోదగిన వ్యక్తి గుంటక పుల్లారెడ్డి గారు సిద్ధాంతాలకు కట్టుబడినవాడు సామాన్య ప్రజలలో కూడా విద్యఅవసరమని భావించి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తే అక్కడకు అందరూ వస్తారు వారికి అక్షరజ్ఞానం పెరగడానికి అవకాశం ఉంటుంది అన్న అభిప్రాయంతో ఆ రోజులలో వస్తున్న ఏకైక పత్రిక ఆంధ్ర పత్రిక తో ప్రారంభించారు సాయంత్రం కాలక్షేపానికి వస్తున్న మిత్రులను కలిసి గ్రామపురోగతి గురించి గ్రామ ప్రజలందరూ ఎలా సహకరించాలో ప్రణాళికా బద్దంగా కార్యక్రమాలను చేపడితే గ్రామం ఎలా కళకళలాడుతుందో అనేక ఉదాహరణలతో అందరికీ తెలియచేసి ఆయన జీవితకాలం గ్రామానికి మంచి పని చేశారు అలాంటి వ్యక్తులు గ్రామానికి ఒక్కరుంటే చాలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ అధ్యక్షుడుగా ఉన్న 1938లో గుజరాత్లోని హరిపుర కాంగ్రెస్ జాతీయ మహాసభకు పిసిసి సభ్యుని హోదాలో ప్రతినిధిగా వెళ్లిన గుంటక పుల్లారెడ్డి మా గ్రామ వాసి 1915లో పుట్టిన పుల్లారెడ్డి గారు దేశ స్వతంత్ర సమపార్జనకు గాంధీజీ ఇచ్చిన పిలుపునందుకు మా గ్రామంలో ఉన్న శనగల విశ్వనాథ రెడ్డి గారితో కలిసి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. 1935 నాటికి పిసిసి సభ్యులైన పుల్లారెడ్డి పిసిసి అధ్యక్ష కార్యదర్శులుగా పోటీ చేసిన ఎన్ జి రంగ పుచ్చలపల్లి సుందరయ్య గెలుపును కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు అయితే ఎన్నికల్లో మితవాద భావాలు కల డాక్టర్ భోగరాజు సీతారామయ్య గొట్టిపాటి బ్రహ్మయ్య పిసిసి అధ్యక్షుడు కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.నేను చిన్నతనంలో గ్రంథాలయం దగ్గరకు వెళ్లి నా వయసు పిల్లలతో కలిసి ఆటలో మునిగిపోయేవాళ్ళం ఒకరోజు అనుకోకుండా బయట రెండు మూడు సైకిళ్లు ఉంటే ఒక సైకిలు దగ్గరకు వెళ్లి దానిని అటు ఇటు తిప్పుతున్న సందర్భంగా నా వేలు దానిలో పడి కొంతమేర ఊడిపోయింది నా ఏడుపు విని పుల్లారెడ్డి గారు పరుగున వచ్చి వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి భుజాలపై ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకొని వెళ్లి వైద్యం చేయించారు తరువాత ప్రతిరోజు ఇంటికి వచ్చి నాన్న ఎలా ఉంది తగ్గిందా నొప్పి లేదు కదా అంటూ పలకరించి మా అమ్మ వాళ్ళతో పిల్లల్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పి వెళ్ళేవారు. చిన్న పిల్లలంటే తగని ప్రేమ వారికి ముగ్గురు ఆడపిల్లలే
మన గన్నవరం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి