సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా

 న్యాయాలు -532
తప్తాయస పత్రబిందు న్యాయము
   *****
తప్త అనగా కాచబడినది, కరిగించబడనది,బాధించబడినది, ఆచరించబడినది.ఆయస అనగా ఇనుపది.పత్ర అనగా ఆకు, వ్రాయుటకు ఉపయోగించు కాగితము, పత్రము,లేఖ, రెక్క,కత్తి అంచు,కత్తి.బిందు అనగా చుక్క ,మచ్చ సున్న అనే అర్థాలు ఉన్నాయి.
కాలిన ఇనుప రేకుపై జలబిందువు పడినట్లయితే నామ రూపాలు లేకుండా నశించిపోతుందని అర్థము.
బాగా కాలిన ఇనుప రేకుకు అగ్నికి ఉండే లక్షణాలు అన్నీ వుంటాయి.అలాంటి రేకుపై  నీటి చుక్క వేస్తే వెంటనే ఆవిరైపోతుంది. మన ఇంట్లో అట్లు, దోసెలు లాంటివి గట్టి మందపాటి ఇనుప రేకుతో తయారు చేసిన పెనంపై వేసుకుంటాం.అది బాగా వేడెక్కిందా లేదా చూడటానికి దానిపై నీళ్లు చిలకరించి చూస్తాం.బాగా వేడయితే చల్లిన నీటి చుక్క క్షణంలో ఆవిరైపోతుంది.
అయితే దీనినే భర్తృహరి మనుషులకు వర్తింపజేసి చెప్పిన సుభాషిత శ్లోకము దానిని ఏనుగు లక్ష్మణ కవి పద్య రూపంలో తెలుగులోకి అనువదించడం మనందరికీ తెలిసిందే.మరోసారి ఆ పద్యాన్ని చూద్దామా...
"నీరము తప్త లోహమున నిల్చి యనామకమై నశించు, నా/ నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై దనర్చు,నా/నీరమె శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్/బౌరుష వృత్తులిట్లధము మధ్యము నుత్తము గొల్చు వారికిన్"... అంటే అధములు వేడి చేసిన ఇనుము లాంటి వారు వారిని ఆశ్రయిస్తే నామరూపాలు లేకుండా నశించిపోతాము అనేది ఈ న్యాయము ద్వారా మనం గ్రహించవచ్చు.
 అసలు అధములు అంటే ఎవరో? వారిని ఎందుకు ఆశ్రయించ కూడదో తెలుసుకుందాం.
అధములు అంటే నీచులు.నీచ స్వభావం కలిగిన వారు. మరి అలాంటి వారిని ఉద్దేశించి రాసిన పద్యాన్ని చూద్దాం.
కలనైన సత్యంబు బలుకనొల్లనివాడు- మాయమాటల సొమ్ము దీయువాడు/ కులగర్వమున పేద కొంపలార్చెడి వాడు - లంచములకు వెల బెంచువాడు/చెడు ప్రవర్తన లందు జెలగి తిరుగువాడు - వావి వరుసకు నీళ్ళు వదులువాడు/ ముచ్చటాడుచు కొంప ముంచ జూసెడి వాడు - కన్నవారల గెంటుచున్నవాడు" //"పుడమిలో నరరూపుడై పుట్టియున్న/ రాక్షసుడుగాక వేరౌన రామచంద్ర/కృపనిధీ!ధర నాగర కుంట పౌరి/వేణుగోపాలకృష్ణ!మద్వేల్పు శౌరి!" అనే ఈ పద్యాన్ని గడిగె భీమ కవి రాశారు.
 ఇందులో అధముడికి ఎన్ని నీచమైన లక్షణాలు ఉన్నాయో గమనించ వచ్చు. నీచుడు కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడడు.మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరిస్తాడు.కులగర్వముతో పేదవారి ఇండ్లను నాశనం చేస్తాడు.అధికారంలో వుండి ఏ పని చేయాలన్నా విపరీతమైన లంచాలను పెంచి అడుగుతాడు. వావి వరుసలను పాటించడు.నవ్వుతూ ముచ్చట వాడుతూనే ఎదుటివారిని నాశనం చేస్తాడు.తల్లిదండ్రులనుఇంటి నుండి వెళ్ళగొడతాడు.వీటిల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా వాడు ఈ భూమ్మీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడు, నీచుడు, అధముడే అని అర్థము.
అలాంటి వానితో స్నేహం చేసినా ఆశ్రయించినా వాని వల్ల ఏ వ్యక్తికైనా ఉన్న మంచి పేరు పోతుంది.
అందుకే పెద్దలు తరచూ అంటుంటారు ''గొడ్లల్ల బడ్లల్ల కలిసి తిరగ కూడదురా" అని గొడ్లు ఎప్పుడు పోట్లాట పెట్టుకుని కుమ్ముతాయో తెలియదు.అలాగే బడ్లు అనగా అధములు లేదా మూర్ఖులు. వాళ్ళు ఎప్పుడు ఎలాంటి ఆపద తెస్తారో తెలియదు కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి.
 భర్తృహరి సుభాషితంలో విధంగా, గడిగె భీమ కవి గారు చెప్పిన విధంగా స్వచ్ఛమైన నీటి బిందువు లాంటి వ్యక్తులు అలాంటి వారిని చేరితే సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుని నామరూపాలు లేకుండా పోతారనేది మనకు ఈ "తప్తాయస పత్రబిందు న్యాయము"ద్వారా తెలిసిపోయింది. కాబట్టి "దుష్టులకు దూరంగా ఉండమనే"  పెద్దలు చెప్పిన మంచి మాటలను సదా గమనంలో పెట్టుకొందాం.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఏం కాలం? ఇది పోయే కాలం!:- యలమర్తి అనూరాధ
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం