ప్రభుత్వ పాఠశాలల పిల్లల్లోనే తెలివితేటలధికం;--రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య

 ప్రభుత్వ పాఠశాలల పిల్లల్లో క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో పాటు వారికి విలువల ఆధారిత విద్యను అందిస్తున్నామని, ఫలితంగా 
 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లోనే అధిక తెలివి తేటలు ఉంటున్నాయని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. శనివారం ఆయన టీచర్లు విజయలక్ష్మి, సమత, భారతిలతో కలిసి పాఠశాలలో బడిబాట సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాణ్యమైన ఉచిత విద్యతోపాటు ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ముద్రించిన పాఠ్యపుస్తకాలు, ఇంటి వద్ద పాఠ్యపుస్తకాల్లోని అభ్యాసాలు పూర్తి చేయుటకు వర్క్ బుక్కులు, నోట్ బుక్కులు, ఇతర స్టడీ మెటీరియల్ ఏడాదికి రెండు జతల స్కూలు యూనిఫామ్స్, ఉచితంగా అందజేస్తున్నామన్నారు.  పిల్లలు వ్యాధుల బారిన పడకుండా పౌష్టికాహారంలో భాగంగా ప్రతి రోజూ ఉదయం పాఠశాల పిల్లలకు రాగులు, బెల్లం పౌడర్ కలిపి తయారు చేసిన రాగిజావ, పూరి, ఉప్మా, ఇడ్లి, వడ, అటుకుల ఫ్రై, గుడాలు, పులిహోర, కిచిడి వంటివి సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ద్వారా పిల్లలకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజనంలో పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, వారానికి మూడు కోడి గుడ్లు, సన్నబియ్యంతో రుచి, శుచి కరమైన భోజనంతో పాటు మినరల్ వాటర్ సౌకర్యాన్ని అందిస్తున్నామని ఈర్ల సమ్మయ్య తెలిపారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో మన ఊరు మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో  పాఠశాలలకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించామని, పాఠశాలలో డిజిటల్ తరగతుల నిర్వాహణతో పాటు వాటిని అందంగా, ఆకర్షణీయంగా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేసినట్లు ఆయన వివరించారు. పిల్లల తల్లిదండ్రులు ప్రయివేట్ పాఠశాలల మోజులో పడి, ఎండనక, వాననక కష్టపడి సంపాదించిన డబ్బును ఫీజుల రూపేణా వృధా చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో 7శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారని, అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు కానుందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివిన పిల్లల తల్లిదండ్రులను లక్షాధికారులుగా పరిగణించి, వారి రేషన్ కార్డు తీసివేయడమే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత పథకాలన్ని రద్దు చేసే అవకాశముందని ఆయన తెలిపారు. ఫీజుల కోసం కొందరు అప్పులు చేసి ఆర్థికంగా క్రుంగిపోతున్నారని, తమ పిల్లల్ని ఉచిత నాణ్యమైన విద్యానందించే ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య కోరారు. కార్యక్రమంలో టీచర్లు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు