రాము : సరికొండ శ్రీనివాసరాజు
 శ్రీపురం ఉన్నత పాఠశాలలో విద్యార్థులను విహారయాత్రలకు తీసుకుని పోవడానికి నిర్ణయించారు. రావాలని అనుకున్న వారు డబ్బులు ఇచ్చి,  తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారు. 10వ తరగతి మొదటి ర్యాంకు విద్యార్థి రాము చాలా పేద విద్యార్థి.  తనకు రావాలని ఎంత ఉన్నా డబ్బులు లేవు.  అందుకే ఆసక్తి చూపలేదు.  ఆ తరగతిలోనే సోము ధనవంతుల అబ్బాయి.  తల్లిదండ్రులను తరచూ డబ్బులు అడగడం,  చిరుతిళ్లను కొని,  తన మిత్రులతో కలిసి వినోదించడం సోముకు పరిపాటి.  సోము చదువులో వెనకబడి పోతే సోమును తెలివైన విద్యార్థిగా చేయమని రామును వేడుకున్నాడు సోము తల్లిదండ్రులు. రాము పుణ్యమా అని సోము తెలివైన విద్యార్థి అయినాడు. 
      రాము పేద విద్యార్థి అని,  విహారయాత్రకు వెళ్ళడానికి డబ్బులు సహాయం చేయమని మిత్రులు సోమును అడిగారు. కానీ సోము తనతో పాటు అటలతో సమయం వృథా చేసే స్నేహితులకు సహాయం చేసినాడు కానీ రాముకు మాత్రం చేయనన్నాడు.  రాము అంటే సోముకు చులకన భావం. రాము అంటే విపరీతమైన అభిమానం ఉన్న గణిత ఉపాధ్యాయులు వేంకటరమణ గారు రామును పిలిచి,  విహారయాత్ర కోసం మరియు దారి ఖర్చుల కోసం డబ్బులు ఎక్కువే ఇచ్చాడు.  రాము వద్దంటున్నా ఉపాధ్యాయులు పట్టు పట్టారు.  "తరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు.  పట్టు పట్టి పబ్లిక్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులలో బెస్ట్ మార్కులు తెచ్చుకోవాలి.  లేకపోతే అప్పుడు వసూలు చేస్తా నా బాకీ. " అన్నారు వేంకటరమణ మాస్టారు. 
        విహారయాత్ర జరుగుతుంది. ఒక చారిత్రాత్మక ప్రదేశం చూస్తూ నడుస్తున్నారు.  సోము ప్రమాదవవశాత్తు కింద పడ్డాడు.  దెబ్బలు బాగానే తగిలాయి.  వెంటనే రాము తన దగ్గర ఉన్న డబ్బులతో మందులు కొనుక్కొని వచ్చి, సోముకు ప్రథమ చికిత్స చేశాడు.  విహారయాత్ర అనంతరం పాఠశాలకు చేరారు.  ఆ తర్వాత సోము రామును పట్టించుకోవడం లేదు.  ఆటల్లో మునిగిపోయాడు.  పరీక్షలు సమీపిస్తున్నాయి. సోము రాము వద్దకు చేరి,  "ఒరేయ్ రామూ! మనిద్దరం కంబైన్డ్ స్టడీ చేద్దామురా. నాకు అర్థం కానివి చెప్పాలి.  సరేనా. " అన్నాడు. "నేనెవరిని? నీ మిత్ర బృందం రంగ,  మధు, పాండు, రాజేంద్ర వీరంతా ఉన్నారు కదా! చిన్నప్పటి నుంచి వారు నీ ప్రాణ స్నేహితులు. ఆపదలో నిన్ను ఆదుకోవడానికి వారు నీకు గుర్తుకు రాలేదా?" అన్నాడు రాము.  సోము ఎంత బతిమాలినా రాము మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. 

కామెంట్‌లు