న్యాయాలు -785
కుసుమస్తక న్యాయము
*****
కుసుమ అనగా పువ్వు, పుష్పము,విరి,సుమము.మస్తక అనగా తల,శిరస్సు,మాడు, ఉపరి భాగము అనే అర్థాలు ఉన్నాయి.
పూలగుత్తి మహిళల తలమీద అలంకారముగానైనా ప్రకాశిస్తుంది.లేదా రాలిపోతుంది అని అర్థము.అంతే కాదు భగవంతుని కంఠంలోనో ,పాదాలు మీదనో వినయంగా ఒదిగిపోతుంది.
సజ్జనుడిని పువ్వుతో పోల్చడం జరిగింది. పూవు ఏ విధంగా అయితే కొమ్మలపై అగ్రిమస్థానంలో ఉంటుందో సజ్జనుడు కూడా ఊరిలో తలమానికంగా ఉంటాడు.పూవు ఏ విధంగా రాలిపోయేంత వరకు పరిమళం వీడకుండా ఉంటుందో , సజ్జనుండు స్వస్థానమును వదిలి, అడవిలో తపస్సుకు వెళ్ళినా తన గుణ ధర్మాలను వీడడు అనే అర్థముతో మన పెద్దలు ఈ "కుసుమస్తక న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
సుందర, సుకుమార నయనానందకర పూల గురించి వివరంగా తెలుసుకుందాం.
పువ్వులు వివిధ రంగులతోనూ , వివిధ సువాసనలు కలిగి అందంగా కనిపిస్తూ, మనస్సుకు ఆనందం, ఆహ్లాదం కలిగిస్తాయి.
ప్రకృతి ఒడిలో పుష్పించే మొక్కలు ప్రకృతికే అందాన్ని ఇస్తుంటాయి.ఒక్కో రకం పువ్వు ఒక్కో ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి వుంటుంది.కొన్ని పువ్వులు స్నేహానికి, కొన్ని పువ్వులు ప్రేమకు, మరికొన్ని క్షమాపణ అడగడానికి, మరికొన్ని మరణానికి గుర్తుగా చెప్పబడతాయి.గులాబీ పువ్వును ప్రేమకు గుర్తుగా, మల్లెపువ్వును స్వచ్ఛతకు స్నేహానికి గుర్తుగా చెబుతుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా నాలుగు లక్షల రకాల పుష్పించే మొక్కల జాతులు ఉన్నట్లు సమాచారం. కొన్ని పువ్వుల మొక్కలు నిర్ధిష్టమైన వాతావరణంలో మాత్రమే పెరుగుతాయి.కొన్ని పువ్వుల మొక్కలను సాధారణంగా తోటల్లో పెంచుకోవచ్చు.
పూలు మానవ చరిత్ర మరియు సంస్కృతిలో ప్రముఖమైన పాత్ర పోషించాయి పోషిస్తున్నాయి కూడా. ఈ పువ్వులు మౌన మునుల వంటివనీ,నిశ్శబ్ద శక్తిని కలిగి ఉంటాయని పెద్దలు చెబుతుంటారు.
అంతే కాదు పువ్వులకు తరతమ భేదం లేదు చూసే ప్రతి ఒక్కరి కళ్ళకు అందాన్ని, ఆనందాన్ని పంచుతాయి.జాతి మత కుల,లింగ వర్గ భేదం లేకుండా అందరి పట్ల ఒకే విధంగా ఉంటాయి.అందరికీ సమానంగా తమ సౌరభాన్ని, సొగసును పంచుతాయి.
పూలను దైవారాధనలో,పంచ ఉపచార పూజలో ఆకాశ తత్వానికి ప్రతీకగా పూవును ఉపయోగిస్తారు.అలాగేప్రాణానికి చిహ్నంగా పువ్వును భగవంతునికి సమర్పించవచ్చని వేదం చెబుతోంది.
అదే విధంగా భగవంతుని అర్చనలో వేటిని అర్పించాలో యథావాక్కుల అన్నమయ్య గారు రాసిన పద్యాన్ని చూద్దామా....
భవదీయార్చన సేయుచో బ్రథమ పుష్పంబెన్న సత్యంబు,రెం/డవ పుష్పంబు దయాగుణం,బతివిశిష్టం బేక నిష్ఠా సమో/త్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యో/గవిధానం బవి లేని పూజల మదింగైకోవు సర్వేశ్వరా!"
సర్వేశ్వరా! నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం. రెండవ పుష్పం దయ, మూడో పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత.ఇది భక్తి యోగ విధానం. ఈ మూడు పుష్పాలు లేనిదే నీవు అంగీకరింపవు కదా! అంటూ సత్యం,దయ, ఏకాగ్రతలను పువ్వులతో పోల్చి అవి దైవ పూజలో తప్పకుండా ఉండాలని అంటారు.
పూల సమక్షంలో , పూల తోటలో కాలం గడపడం వల్ల మనసు ఎంతో ప్రశాంతతకు లోనవుతుంది.
కవులు ఎందరో పువ్వుల మీద అద్భుతమైన కావ్యాలు, కవితలు, గేయాలు పాటలు రాశారు. అంతే కాదు పువ్వులను పసిపాపల చిరునవ్వులతో పోల్చి చెప్పారు.
పూల ఔదార్యం, త్యాగ గుణం గురించి ఓ కవి రాసిన సంభాషణ ఎంత గొప్పగా వుందో చూడండి. పువ్వును అడిగాడట " నిన్ను కోస్తుంటే నీకు బాధ కలుగలేదా? అప్పుడు పువ్వు అందట కోసే వ్యక్తి పొందే ఆనందాన్ని చూసి నేను నా బాధని మర్చిపోయాను అందట. అంటే ఇతరుల ఆనందం కోసం తమను తాము త్యాగించుకోవడం పూవులకు మాత్రమే తెలుసు.
అవి బతికేది మూన్నాళ్ళయినా నేల రాలే చివరి క్షణం వరకూ పరిమళాలు వెదజల్లుతూనే,పరులకు తమదైన సేవ చేస్తూ వుంటాయి.
అందుకే పువ్వులా తలెత్తుకుని జీవించాలి.పరులకు ఆనందాన్ని కలిగించాలి.జీవితాన్ని త్యాగం చేయాలి. "కుసుమస్తక న్యాయము" ద్వారా మనం నేర్చుకోవలసింది జీవిత సత్యం ఇదే.
ముళ్ళకంచెలోంచి కూడా నవ్వుతూ వికసించే పువ్వే మన ఆదర్శం కావాలి. కష్టాలు నష్టాలు ఎన్ని ఎదురైనా పెదవులపై పువ్వులాంటి చిరునవ్వును వీడకుండా చూసుకోవాలి.అప్పుడే పూల హృదయం, దైవత్వం పూల దండలో దారంలా మనకూ అబ్బుతాయి.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి