వీరుడంటే వీడే :- డా.ఎం.హరికిషన్-కర్నూలు9441032212

 ఒక ఊరిలో ఒక పొట్టెగాడు వుండేటోడు. వానికి వాళ్ళ తాత ఎప్పుడూ రాజుల కథలు బాగా వివరించి వివరించి చెప్పేటోడు. దాంతో ఆ పొట్టెగానికి పండుకున్నప్పుడు అవే కలలు వచ్చేటివి. దానికి తోడు వానికి పడుకున్నప్పుడు లేచి అటూ యిటూ తిరిగే అలవాటు వుండేది. దాంతో వాళ్ళ అమ్మా నాన్నా భయపడి వాడు పండుకున్నప్పుడు లేచి బైటికి పోకుండా తలుపులకి గడియ పెట్టేటోళ్ళు.
ఒకసారి ఆ వూరి మీదకు పక్క దేశపు రాజు యుద్ధానికి వచ్చినాడు. వాళ్ళంతా వూరిబైట చుట్టుముట్టి ''మట్టసంగా  లొంగిపోతారా... లేక యుద్ధానికి రమ్మంటారా'' అని హెచ్చరిక పంపినారు.
రాజుకి ఏం చేయాలో తోచలేదు. పక్క రాజేమో చానా బలవంతుడు, చెడ్డోడు. యుద్ధం జరిగితే ఓడిపోవడం ఖాయం. దాంతో పాటు వూరినంతా నాశనం చేసిగానీ వదలడు. అలా అని లొంగిపోడానికి మనసు ఒప్పుకోలేదు. ఎలాగబ్బా ఈ ఆపద నుంచి బైటపడడం అని తెగ ఆలోచించసాగినాడు.
ఆ రోజు చీకటి పన్నాక ఆ పొట్టెగానికి పండుకున్నప్పుడు తాను ఆ వూరికి రాజయినట్టు, గుర్రమెక్కి యుద్ధానికి పోతున్నట్టు కల వచ్చింది. అదే సమయంలో పక్కనున్న అడవిలోంచి ఒక పెద్ద పులుల గుంపు ఆ వూరిలోనికి వచ్చింది. అన్ని పులులను ఒకేసారి వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. దాంతో అందరూ వణికిపోయి ఎక్కడి పనులు అక్కడ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోసాగినారు. ఆ తొందరలో ఈ పిల్లవాని అమ్మానాన్నా గూడా పారిపోతా పారిపోతా వీని తలుపుకు గడియ పెట్టడం మరిచి పోయినారు. దాంతో వాడు వానికి తెలియకుండా బైటకు వచ్చినాడు.
సరిగ్గా అదే సమయానికి ఆ పులుల గుంపు వీని ఇంటి ముందుకు వచ్చింది... వీడు నిదురలో వున్నాడు గదా... ఎదురుగా వున్నది గుర్రాలే అనుకున్నాడు. దాంతో అన్నింటికన్నా పెద్దగా వున్న ఒక పులిని చూసి ఎగిరి దాని మీద కూచుని ''ఏయ్‌.... ఛల్‌... పద'' అన్నాడు. దాంతో పులులన్నీ భయపడిపోయినాయి. ''ఇదేందిరా అందరూ మా గుంపుని చూసి భయంతో వణికిపోతా వుంటే... వీడు వంద పులులు ఎదురైనా ఒక్కడుగు గూడా వెనక్కు వేయకుండా... ఏకంగా మా నాయకుని మీదకే ఎక్కేసినాడు. వీడు చానా పెద్ద వీరుడున్నట్టున్నాడు. అనవసరంగా గొడవ పెట్టుకోకుండా వీడు ఎలా చెబితే అలా చేయడం మంచిది'' అనుకున్నాయి.
వాడు పెద్దపులి ఎక్కి ముందు పోతావుంటే వెనుకనే వంద పులులూ మట్టసంగా భయపడతా భయపడతా రాసాగినాయి. వాడు ఛల్‌... ఛల్‌... అని అదిలించుతా వూరి బైటకు వచ్చినాడు. అక్కడ పక్క వూరి సైనికులు గుడారాలు వేసుకోని తరువాత రోజు యుద్ధానికి కత్తులు నూరుకుంటా వున్నారు. వాళ్ళు వీడు వందపులులతో రావడం చూసినారు. అంతే... ''ఓరి నాయనోయ్‌... ఎవడురా వీడు. గుర్రాల మీద రావడం చూసినాం, ఏనుగుల మీద రావడం చూసినాం, ఒంటెల మీద రావడం చూసినాం.... గానీ ఇలా పులుల మీద ఎక్కి వచ్చినోని గురించి ఇంతవరకు ఎప్పుడూ వినలేదు. కనలేదు. వీడెవడో మహావీరుడు వున్నట్టున్నాడు. వాటికి గనుక దొరికినామంటే ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలు చేసి నంజుకోని తింటాయి'' అనుకుంటా భయపడి కత్తులూ, బళ్ళాలూ ఎక్కడివక్కడ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోసాగినారు.
ఈ గొడవకి వానికి మెలకువ వచ్చింది. ఎక్కడున్నానబ్బా అని చుట్టూ చూసినాడు. ఇంకేముంది. పెద్దపులి మీదున్నాడు. భయంతో గుండెలు కొట్టుకున్నాయి. కాళ్ళూ చేతులు వణికినాయి. ''ఎలారా నాయనా వీటి నుంచి తప్పించుకోవడం'' అని అటూ యిటూ చూడసాగినాడు. అంతలో ఎదురుగా ఒక మామిడి పళ్ళ చెట్టు కొమ్మ ఒకటి బాగా కిందికి వంగి కనబడింది. అంతే... అది దగ్గరికి రాగానే లటుక్కున దాన్ని పట్టుకోని పైకి ఎక్కినాడు.
''వాడు ఎప్పుడెప్పుడు దిగుతాడా... ఎప్పుడెప్పుడు ఇక్కన్నించి పారిపోదామా'' అనుకుంటావున్న పులులు వాడు చెట్టుపైకి ఎక్కగానే ''వాడు మామిడి పళ్ళ కోసం పైకి ఎక్కినట్టున్నాడు. మళ్ళీ దిగి వచ్చినాడంటే మనలను వదలడు'' అనుకుంటా ఎక్కడివక్కడ చించుకోని అడవిలోనికి పారిపోయినాయి. వాడు అవి పోయిన కాసేపటికి 'హమ్మయ్య' అనుకుంటా తిరిగి వూరిలోనికి అడుగు పెట్టినాడు.
అక్కడ రాజు దండ చేతిలో పట్టుకోని కనబన్నాడు. వీడు రాగానే మెళ్ళో దండేసి ''నీలాంటి వీరున్ని ఇంతవరకూ మేమెప్పుడూ చూల్లేదు. నీవు ఈడ వున్నంతకాలం ఇంక మేమెవరికీ భయపడవలసిన అవసరమే రాదు'' అని బాగా మెచ్చుకోని మోయలేనంత బంగారం బహుమానంగా ఇచ్చి గౌరవించినాడు. వానికి ఆ పులుల దెబ్బతో అప్పటి నుంచీ నిదురలో నడిచే అలవాటు కూడా పోయింది.
***********

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం
ఏం కాలం? ఇది పోయే కాలం!:- యలమర్తి అనూరాధ
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం