పెద్ద మనసు ...- *డా.ఎం.హరికిషన్ కర్నూల్-9441032212.

 ఒక అడవిలో పెద్ద వేపచెట్టు ఉండేది. దాని మీద రకరకాల పక్షులు గూళ్లు కట్టుకొని వుండేవి. వాటిలో ఒక కాకి వుండేది. దానికి చాలా పొగరు. ఎప్పుడూ ఏదో ఒక పక్షితో గొడవ పడుతూ ఉండేది. చిన్నచిన్న పక్షులను ముక్కుతో పొడిచి, గోళ్లతో రక్కి ఏడిపించేది. దాంతో దాన్ని ఏవీ పలకరించేవి కాదు. మాటలు కలిపేవీ కాదు. దూరదూరంగా వుండేవి.
వానాకాలం దగ్గర పడింది. పక్షులన్నీ తమ ఇళ్లను ఎంత గాలి వీచినా, ఎంత వాన పడినా చెక్కు చెదరకుండా బాగా గట్టిగా కట్టుకోసాగాయి. కానీ కాకి పెద్ద సోమరిపోతు. రేపు, ఎల్లుండి అనుకుంటూ రోజులు దాటేయసాగింది. వానాకాలం రానే వచ్చింది.
పెద్ద గాలి వాన వచ్చింది. వేపచెట్టు ఆ గాలికి తట్టుకోలేక పూనకం వచ్చినట్టు అటూ ఇటూ ఊగిపోసాగింది. పక్షులన్నీ భయంతో గబగబా వాటి గూళ్లలోనికి పోయి తలుపులు వేసుకొని గొళ్లెం పెట్టేసుకున్నాయి.
కాకిది పుల్లల ఇల్లు కదా.. ఆ గాలికి చెల్లాచెదరై పోయి కింద పడిపోయింది. దానికి రెండు చిన్న పిల్లలు వున్నాయి. వాటి మీద వాన పడకుండా రెక్కలు కప్పింది. కానీ వాన పెద్దదవుతూ వచ్చింది. పిల్లలు నెమ్మదిగా తడిసిపోతూ వున్నాయి. చలికి వణికిపోసాగాయి. ఇలాగే వుంటే పిల్లలకి ఏమన్నా అవుతుందేమోనని భయపడి చిలుక ఇంటికి పోయి ‘చిలుకా.. చిలుకా.. కొంచెం తలుపు తీయవా. నేనూ నా పిల్లలు గాలివానకు చచ్చిపోయేట్టు వున్నాం’ అని వేడుకొంది.
కానీ ఆ చిలుక లోపల నుంచే ‘మాకే ఈ ఇల్లు సరిపోవడం లేదు. ఇంక నీకు చోటెక్కడ పో... పోయి వేరే వాళ్లని అడుగు’ అంది.
కాకి పక్కనే వున్న పావురం ఇంటికి పోయి ‘పావురమా.. పావురమా.. ఈ ఒక్కరోజు నీ ఇంటిలో కొంచెం చోటియ్యవా.. నా పిల్లలు ఏమైపోతారోనని భయంగా ఉంది’ అంది ఏడుపుగొంతుతో.
దానికి ఆ పావురం ‘పోపో.. అనవసరంగా అందరితో గొడవపడే నీలాంటి వాళ్లతో ఒక్క పూట కాదు కదా.. ఒక్క నిమిషం కలిసి వున్నా తప్పే’ అంది తలుపు తీయకుండా.
కాకికి ఏ ఇంటి తలుపు తట్టినా ఇవే సమాధానాలు ఎదురు కాసాగాయి. ఒక్క పక్షి కూడా తలుపు తీయలేదు. దాంతో ఏం చేయాలో తోచక కళ్లనీళ్లు పెట్టుకుంది.
అంతలో ఒక గూటి తలుపు తెరచుకుంది. అందులోంచి ఒక చిన్న పిట్ట బైటకు వచ్చింది. కాకి అంతకు ముందు అనేక సమయాల్లో అనవసరంగా దానితో గొడవ పడింది. చిన్నది గదా ఏం చేయలేదులే అనుకుంటూ దాని ఇంటిలో దొంగతనాలు కూడా చేసింది. ఆ పిట్టను చూడగానే కాకి అవమానంతో తలవంచుకొంది.
పిట్ట చాలా మంచిది. అది చెల్లాచెదరైన కాకి గూడు చూసింది. వానకు వణికిపోతున్న కాకి పిల్లలను చూసింది. అయ్యో పాపం అనుకొని ‘కాకీ.. కాకీ.. అలా వానలో ఎక్కువసేపు వుంటే పిల్లలకు ఏమన్నా అవుతుంది. తొందరగా రా.. ఈ రోజు నా గూటిలో వెచ్చగా పడుకొందువుగాని’ అంది.
ఆ మాటలకు కాకి సిగ్గుతో మరింత ముడుచుకొని పోయింది. అది చూసి పిట్ట నవ్వి ‘ఆపదలో వున్నప్పుడు ఎదుటివాడు మనవాడా, పగవాడా అని ఆలోచించకుండా ముందు ఆదుకోవాలి అంటారు పెద్దలు. నీ మీద నాకు ఎలాంటి కోపమూ లేదు.. దా.. తొందరగా.. సాటి పక్షికి సాయం చేయలేని బతుకూ ఒక బతుకేనా’ అంది.
కాకి వెంటనే తన పిల్లలను తీసుకొని ఆ ఇంటిలోకి వెళ్లింది. ఇల్లు చిన్నదైనా చాలా గట్టిగా, బలంగా ఉంది. పిట్ట తాను ఎక్కడెక్కడి నుంచో సేకరించి తెచ్చుకున్న గింజలు తెచ్చి, కాకికి, పిల్లలకు కడుపు నిండా పెట్టింది. అది చూసి కాకి కళ్లనీళ్లు పెట్టుకొని ‘సోదరీ.. నిన్ను అనవసరంగా ఇంతకాలం బాధపెట్టాను. కానీ దాన్ని నువ్వు కొంచెం కూడా మనసులో పెట్టుకోకుండా సొంత బంధువులా ఆదుకున్నావు. నీ మేలు ఎప్పటికీ మరచిపోలేను’ అంది.
పిట్ట కిచకిచా నవ్వి ‘అంత మాటలు వద్దు.. తప్పు చేయని వాళ్లు ఎవరుంటారు చెప్పు ఈ లోకంలో. కానీ ఆ తప్పు తెలుసుకొని సరిదిద్దుకున్న వాళ్లే గొప్పవాళ్లు అవుతారు. పదిమందితో కలిసి బతకడంలో వున్న ఆనందం ఒంటరిగా వుంటే ఎప్పటికీ రాదు. అది తెలుసుకో చాలు’ అంది.
ఆ తరువాత నుంచీ కాకి చాలా మారిపోయింది. కనపడిన వాటినల్లా పలకరించసాగింది. మాటలు కలపసాగింది. పనుల్లో సాయం చేయసాగింది.
********
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఏం కాలం? ఇది పోయే కాలం!:- యలమర్తి అనూరాధ
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం