రాకాసి జంతువులు ;- డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 రవి అదిరిపడి లేచి కళ్ళు తెరిచాడు. పడుకున్న మంచం అటూ ఇటూ ఉయ్యాలలాగా ఊగిపోతోంది. బయటనుంచి పెద్దగా అరుపులు కేకలు వినబడుతున్నాయి. ఇంటిలోంచి కంగారుగా బయటకు వచ్చి చుట్టూ చూశాడు. జనాలంతా తలా ఒక వైపుకు పారిపోతున్నారు. ఎవరూ ఎవరినీ పట్టించుకోవడం లేదు. అందరి మొహాల్లోనూ ఏదో భయం. నగరమంతా గందరగోళంగా అల్లకల్లోలంగా వుంది.
ఏమైంది.. ఎందుకలా పారిపోతున్నారు అని ఒకతన్ని గట్టిగా పట్టుకొని అడిగాడు.
అతను ఆయాసపడతా ఏందీ... నీకింకా ఏమీ తెలీదా... పిచ్చోని లెక్క ఉన్నావే. మన నగరం మీదికి వింత జంతువులు దాడి చేశాయి. దొరికిన వారిని దొరికినట్టు చంపుతా ఉన్నాయి. వాటి చేతికి చిక్కితే అంతే. పద పద తొందరగా పారిపోయి ఎక్కడన్నా దాక్కో అంటూ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు.
రవికి అంతా గందరగోళంగా ఉంది. దూరంగా పెద్ద పెద్ద ఆకారాలు కనపడ్డాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పెద్ద కొండంత ఉన్నాయి. కొన్ని చీమ తల కాయలతో... మరికొన్ని పక్షుల తలలతో... ఇంకొన్ని జంతువుల తలలతో... భయంకరంగా ఉన్నాయి.
వాటి అడుగుల కింద పడి పెద్ద పెద్ద భవనాలు నేలమట్టం అవుతున్నాయి. మనుషులు నుజ్జు నుజ్జు అవుతున్నారు. రవి అది చూసి వణికిపోయాడు. ఇంకా అక్కడే నిలబడి వుంటే తనకు గూడా అదే గతి పడుతుంది అనుకోని వెనక్కి తిరిగి వురక సాగాడు. అవి భయంకరంగా కేకలు పెడుతా, పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటా విమానాల్లా వేగంగా దూసుకు రాసాగాయి.
రవి అలా కొంత దూరం పారిపోయాడో లేదో ఒక పెద్ద చీమ తల వున్న రాకాసి వానికి అడ్డం వచ్చింది. రవి దాన్ని చూసి వణికిపోతా పారిపోవడానికి వెనక్కి తిరిగాడు. అంతలో రాకాసి చీమ చటుక్కున రవి జుట్టు పట్టుకొని పైకి లేపింది. ఏరా నా నుంచే తప్పించుకొని పారిపోదాం అనుకుంటా ఉన్నావా ... వుండు నీ పని చెబుతా అంటూ రవి కాలు పట్టుకొని చటుక్కుమని విరిచేసింది. అంతే రవి ఆ దెబ్బకు బాధతో గట్టిగా అరిచాడు. నొప్పితో విలవిలాడసాగాడు.
వద్దు... వద్దు... నన్నేమీ చెయ్యొద్దు. నేను చిన్న పిల్లవాన్ని. చానా మంచివాన్ని. ఎవరికీ ఎప్పుడూ ఎటువంటి ఆపదా తలపెట్టలేదు. నన్నొదులు నీకు దండం పెడతా అంటూ కళ్లనీళ్లతో వేడుకుంటా గింజుకోసాగాడు.
అలాగా... నువ్వు అమాయకునివా... ఎవరికీ ఏ ఆపదా తన పెట్టలేదా. ఆహా ఏం అబద్ధాలు ఆడుతా వున్నావురా... మా జాతికి చెందిన చిన్న చిన్న చీమలు ఎక్కడ కనపడినా ఊరికే వాటిని తొక్కి తొక్కి చంపుతా వుంటావు. నీ గురించి నాకు తెలియదనుకుంటున్నావా. వాటికి ఎవరూ లేరనే కదా... ఇప్పుడు చూడు నీవు వాటినెలా చంపుతావో అలాగే నిన్ను కూడా కాలికింద వేసి నలిపి చంపుతా... ఎవడు అడ్డం పడతాడో చూద్దాం అంటూ కిందపడేసి కాలు పైకెత్తింది.
వద్దొద్దు. ఇంకెప్పుడూ చిన్న చీమలను చంపను. నన్నేమీ చెయ్యొద్దు అంటూ గట్టిగా అరిచాడు రవి.
కానీ ఆ రాకాసి చీమ రవి మాటలను కొంచెం కూడా పట్టించుకోలేదు.
కాలు అలాగే రవి మీద పెట్టి గట్టిగా నొక్కసాగింది. రవికి ఎముకలన్నీ ఎక్కడివక్కడ ఫటఫటమని విరిగి పోసాగాయి. నొప్పితో విలవిలలాడిపోతా  కాపాడండి... కాపాడండి... నన్ను ఎవరైనా కాపాడండి అంటూ గట్టిగా అరవసాగాడు.
అప్పుడే రవి వాళ్ళ అమ్మ అక్కడికి  వచ్చింది.
బాధతో కేకలు పెడతా వున్న రవిని చూసింది.
వెంటనే ఉరుక్కుంటా దగ్గరికి వచ్చి రేయ్ రవీ.. లెయ్ లెయ్... నిదురలో ఏమలా కేకలు పెడతా వున్నావు. ఏమైంది. అనింది గట్టిగా కుదుపుతా.
రవి అదిరిపడి నిదుర లేచాడు.
చుట్టూ చూశాడు. ఎదురుగా అమ్మ. 
భయంకరమైన జంతువులు ఏవీ లేవు.
తను తన మంచం మీదనే ఉన్నాడు. ఒళ్లంతా భయంతో చమట పట్టి తడిసిపోయింది.
అమ్మో... ఎంత భయంకరమైన కల అనుకున్నాడు.
ఏమైందిరా అడిగింది అమ్మ.
రవి తనకు వచ్చిన కలంతా వివరించాడు.
రవి వాళ్ళ అమ్మ కాసేపు ఆలోచించి మన కలలో అప్పుడప్పుడూ  మనం చేసే వెధవ పనులే కనపడుతుంటాయి. నిజం చెప్పు... నువ్వు జంతువులను, పక్షులను ఏమైనా బాధ పెడతా వున్నావా అనడిగింది.
అప్పుడే అక్కడికి రవి చెల్లెలు రమ వచ్చింది.
అమ్మా... నువ్వు చెప్పింది నిజమే. అన్నయ్య బడికి పోయేటప్పుడు, వచ్చేటప్పుడు దారిలో చీమల పుట్టలు కనపడితే చాలు ఎగిరి వాటిమీద దూకుతాడు. ఏదైనా చెట్టు మీద పక్షుల గూళ్ళు కనపడితే చాలు కట్టెతో చిందరవందర చేసి పగల కొడతాడు. రాళ్లతో పిట్టలను పావురాలను చిలకలను గురిచూసి బలంగా కొడతాడు. కుక్కలు పందులు కనపడితే చాలు రాళ్లు విసురుతాడు. అవి బాధతో మూలుగుతావుంటే ఎగురుతా సంబరపడతాడు. మా తరగతి పిల్లలందరూ మీ అన్న చానా చెడ్డ పిల్లోడు అంటూ తిడతారు.  ఆ మాటలకు వాళ్ల ముందు తలెత్తుకొని తిరగ లేకుండా ఉన్నాను అని చెప్పింది.
ఆ మాటలకు అమ్మ చానా బాధపడింది.
రవిని దగ్గరికి తీసుకుని... చూడు రవీ... మన చెయ్యో కాలో విరిగితే మనం ఎంత బాధ పడతామో, వాటి చెయ్యో కాలో విరిగితే అవీ అంతే బాధ పడతాయి. చీమయినా , కుక్కయినా, పందయినా ,  మనిషయినా  అన్నింటికీ నొప్పి ఒకటే కదా. అవి మూగ జీవులు కాబట్టి ఆ బాధను బయటకు చెప్పుకోలేవు. చిన్నచిన్న జంతువులకు చేతనైతే సాయం చేయాలి... అంతేగాని బాధ పెట్టకూడదు. నీవు వాటినలా బాధపెడతా ఉన్నందుకే నీకు ఈ రోజు ఇలాంటి కల వచ్చింది అనింది.
రవికి మరలా కల కళ్ళముందు మెదిలింది.
చీమ కాలు విరగ్గొడతా వుంటే బాధతో కేకలు పెట్టడం, గిలగిలా కొట్టుకోవడం అంతా మతికి వచ్చింది. నుదిటి మీద చిన్నగా చెమటలు పట్టాయి. సిగ్గుతో తల వంచుకున్నాడు. కళ్ళలోంచి నీళ్ళు కారాయి.
నిజమే అమ్మా... నువ్వు చెప్పింది. ఇంకెప్పుడూ ఏ చిన్న జంతువుకూ ఎటువంటి ఆపదా తల పెట్టను. కలతో నా కళ్ళు తెరుచుకున్నాయి అన్నాడు.
అమ్మ ఆనందంతో రవి నుదిటి మీద చిన్నగా ముద్దుపెట్టుకొంది.
***********


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఏం కాలం? ఇది పోయే కాలం!:- యలమర్తి అనూరాధ
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం