సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-800
దర్పణ ముఖావ లోకాన న్యాయము
*****
దర్పణము అంటే అద్దం. ముఖము అంటే మొహం. అవలోకనం అంటే ఒక విషయాన్ని గూర్చి సమగ్రంగా పరిశీలించి దాని లోని మంచి చెడులను ఎత్తి చూపే క్రియ.అంటే గుణదోషాలు లేదా తప్పొప్పులను కనిపెట్టుట అనే అర్థం కూడా ఉంది.
బయట ముఖం ఎలా ఉంటుందో అట్లే అద్దంలో కనిపిస్తుంది. ఉన్నదున్నట్లుగా ఏ విషయమైనా ముఖం మీద ప్రతిఫలించడాన్ని, ఈ దర్పణ ముఖావ లోకన న్యాయముతో పోలుస్తారు.
అద్దం మన ప్రవర్తనకు గీటురాయి. అది మన శారీరక సంబంధమైన విషయాలనే కాకుండా మానసిక సంబంధమైన వాటిని కూడా నిశితంగా పరిశీలించి చూపిస్తుంది.
ఎవరి ముందైనా అబద్ధాలు అడి బయట పడొచ్చేమో కానీ అద్దం ముందు మాత్రం కాదు. అది ఒక నిఘా నేత్రం లాంటిది.
"కొండ అద్దమందు కొంచమై ఉండదా?"అని వేమన చెప్పినప్పటికీ  అద్దానిది ముక్కు సూటి వ్యవహారమే. ఉన్నదున్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చూపిస్తుంది.
అద్దానికి రంగులు మార్చే కుళ్ళు కుత్సితం లేదు.అద్దం ముందు ఎవరు నిలబడినా అందరినీ ఒకేలా చూస్తుంది.చూపుతుంది.
అలాంటి అద్దమంటి మనసును మసకబారి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిమీదా ఉంది.
మసకబారిన అద్దంలో మనమేంటో స్పష్టంగా కనబడం.అద్దాన్ని తుడిస్తేనే అందులో మనం చక్కగా ఎలా కనబడతామో,మనసు అద్దాన్ని కూడా ఎలాంటి దోషాల మరకలు అంటకుని,మసకబారి పోకుండా తప్పకుండా  తుడుచుకోవాలి.అప్పుడే మనమేంటో స్పష్టంగా బోధపడతాం.
అద్దమంటి స్వచ్ఛమైన మనసు ఉన్న వారికి  లోకమంతా స్వచ్ఛంగా తనలాగే కనిపిస్తుందట. అందుకే ధర్మరాజుకు లోకమంతా  మంచి వాళ్ళే కనిపించారట. కారణం అతని మనో దర్పణం అలాంటిది.ఇక దుర్యోధనునికి లోకమంతా దుర్మార్గంగానే కనిపించిందట.కారణం అతని గుణ దర్పణం అలాంటిది మరి.
నరకాసురుని  వధించడానికి  సత్యభామ శ్రీకృష్ణుడితో పాటు యుద్ధ రంగానికి వెళుతుంది.తనే రాక్షసులతో యుద్ధం చేస్తుంది కదా!.
యుద్ధం చేసే సమయంలో  రాక్షస వీరుల కళ్ళకు సత్యభామ ముఖం మధ్యాహ్నం పూట  వెలుగులు చిమ్మే మార్తాండుని వలె  తీక్షణమైన రూపంలో కనిపించిందట.అదే సమయంలో శ్రీకృష్ణుడికి తన ప్రియసఖి సత్యభామ రూపం రాకేందు బింబం అంటే  చందమామ వలె కనిపించిందట.
ఈ వర్ణన పోతన రచించిన భాగవతంలోని దశమ స్కంధములోనిది.
"రాకేందు బింబమై రవి బింబమై యొప్పు నీరజాతేక్షణ నెమ్మొగంబు/కందర్ప కేతువై ఘన ధూమ కేతువై యలరు బూబోడి చేలాంచలంబు/ భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెఱయు నాకృష్టమై మెలత చాప/మమృత ప్రవాహమై యనల సందోహమై తనరారు నింతి సందర్శనంబు/ హర్షదాయియై మహారోషదాయియై,పరగు ముద్దరాలి బాణ వృష్టి/ హరికి నరికి జూడ నందంద శృంగార వీరరసము లోలి విస్తరిల్ల "
దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఎవరెవరి మనో భావాలను బట్టి ఎదుటి వారలా కనిపిస్తారనీ, తద్వారా వారి వ్యక్తిత్వాలు మనో భావాల దర్పణాలై చూపిస్తాయనీ.
 ఇలా  హృదయ లోతులను సమగ్రంగా అధ్యయనం చేసి ఉన్నదున్నట్లుగా చెప్పడాన్నే" దర్పణ ముఖావ లోకన న్యాయమునకు" ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

కామెంట్‌లు