సునంద భాషితం:- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయములు-814
"ఆయుర్ఘృతమ్" న్యాయము
******
 ఆయు అనగా మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు గల కాలం/ జీవిత కాలం.ఘృతమ్ అనగా నెయ్యి.
నెయ్యి ఆయుర్దాయము" అనినట్లు.
"నెయ్యి ఆయువు కాదు కానీ నేయి ఆయువు అంటే నేయి ఆయువునకు నిమిత్తము అని అర్థము చెప్పబడుతున్నది.
"ఆయుర్ఘృతం నదీ పుణ్యం భయం చౌరః సుఖం ప్రియా/ వైరం ద్యూత గురు జ్ఞానం శ్రేయో బ్రాహ్మణ పూజనమ్ " అని నానుడి వుంది.
ఆ విధంగా  ఆయువునకు నేయి కారణం అవుతున్నది. అనగా నేయిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల  ఆయురారోగ్య  హేతువు అవుతున్నది.
 
 మన పెద్దలు ఇంతగా చెబుతున్న నెయ్యి గురించి కొన్ని విషయాలు విశేషాలు తెలుసుకుందామా...
 నెయ్యి తినకుండా పెరగని బాల్యమంటూ ఉండదు. పేదా గొప్ప తేడా లేకుండా  అన్న ప్రాశన నుండే నేతిని శిశువు ఆహారంలో చేర్చి పెడుతుంటారు.
 ఈ  నెయ్యిలో విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది జీర్ణ శక్తిని పెంచుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.చర్మం, జుట్టుతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ,కాలిన గాయాలు త్వరగా నయం కావడానికి తోడ్పడుతూనే  మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.నిద్రకు దివ్య ఔషధంగా తోడ్పడుతుంది..
ఆయుర్వేదంలో నేయికి అత్యంత గౌరవమైన, విశిష్టమైన స్థానం ఉంది.
 ఆయుర్వేద వైద్యులు "నెయ్యితో వెయ్యి లాభాలు' ఉన్నాయని చెబుతున్నారు.నెయ్యితో కీళ్ళు,చర్మం!, ఊపిరి తిత్తుల ఆరోగ్యంతో పాటు కంటి చూపు మెరుగుపడుతుంది.
ఇలా నెయ్యి నిత్య జీవితాన్ని ఆరోగ్యవంతంగా చేయడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి. అందుకే నేతిని  మన పెద్దవాళ్ళు "ఆయుర్ఘృతం"అని  ఏకంగా ఒక న్యాయాన్నే సృష్టించి ఆహారంలో నేతిని తప్పని సరిగా తీసుకోవాల్సిన అవసరం గురించి నొక్కి చెప్పారు.
 అందుకేనేమో మన పూర్వీకులలో కొందరు నేతి ప్రియులు "మానెడు నెయ్యి కోసం మాన్యాలు కూడా అమ్ముకున్నారట" మన బామ్మలు , తాతలు చిన్నతనంలో చెప్పినప్పుడు కలిగిన ఆశ్చర్యం ఇప్పటికీ పోలేదు.
"అతి సర్వత్ర వర్జయేత్" కాబట్టి మితంగా, హితంగా  స్వచ్ఛమైన ఘుమఘుమలాడే నేతిని, పూసలు పూసలుగా  చేతికి తాకుతూ ఎంతో రుచిగా వుండే నేతిని నిత్యం మన ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకుందాం.తద్వారా  ఆయురారోగ్యాలతో  కూడిన ఆనందాన్ని పొందుదాం.

కామెంట్‌లు