క్రిమినల్‌ చట్టాల బిల్లు 2025: - సి.హెచ్.ప్రతాప్

 క్రిమినల్‌ చట్టాల (తమిళనాడు సవరణ) బిల్లు 2025, మహిళలపై వేధింపుల నిషేధ (సవరణ) బిల్లు 2025ను తమిళనాడు అసెంబ్లీ ఇటీవల  ఆమోదించడం చారిత్రాత్మకం.
మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాల శిక్షను పెంచడం, డిజిటల్‌, ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫారమ్‌లలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని ప్రాసిక్యూట్‌ చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం గా వుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు అత్యాచారానికి పాల్పడిన దోషికి 10 ఏళ్ల జైలు శిక్ష అమలులో ఉంది. ఇప్పుడు సవరించిన బిల్లు ద్వారా అత్యాచార దోషికి కనీసం 14 ఏళ్లు జైలు శిక్ష విధించాలని క్రిమినల్‌ చట్టం ప్రతిపాదించింది. అదే అత్యాచారం చేసిన వ్యక్తి పోలీసు శాఖకు చెందిన వారైతే ఆ వ్యక్తికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలి. అత్యాచార బాధితురాలు 12 ఏళ్లలోపు బాలిక అయితే.. అత్యాచార దోషికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించాలని క్రిమినల్‌ చట్టం బిల్లు ప్రతిపాదించింది.ఇటువంటి చట్టం చేసిన రెందవ  రాష్ట్రంగా తమిళనాడు నిలవడం హర్షణీయం. గతంలో కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై భారీ నిరసనల మధ్య, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ అపరాజిత బిల్లును తీసుకువచ్చి అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు విధించేలా చట్టం చేసింది.మహిళల భద్రత ఎంతో ముఖ్యమైనది. మహిళలపై నేరాలు క్షమించరానివని ప్రతి రాష్ట్రానికి చెబుతున్నా. నేరస్థులు ఎవ్వరైనా సరే.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మహిళలపై నేరాలకు పాల్పడేవారిపై కఠినంగా శిక్షించేందుకు చట్టాలను మరింత పటిష్ఠ పరుస్తున్నాం అని ఒక పక్క ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా దేశంలో మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు.
దేశ వ్యాప్తంగా మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, హింస బాగా పెరిగాయి. వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. పని ప్రదేశాల్లో శ్రామిక మహిళలు వివక్ష, వేధింపులకు గురవు తున్నారు. మహిళలకు సమాన హక్కులు, శ్రమకు గుర్తింపు, సమాన వేతనాలు, సమాన హక్కుల కోసం, మహిళలపై అత్యాచారాలు, హింసను అరికట్టడం, నేరస్థులకు కఠిన శిక్షలు అమలు చేయడంలో మన వ్యవస్థలు మరింత క్రియాశీలకంగా పని చేయాలి.నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన జస్టిస్ వర్మ కమిటీ ఎంతో లోతైన పరిశీలన జరిపి చేసిన సూచనలను అమలు పరచే విధానం తక్షణం అమలులోకి రావాలి.
ఈ బిల్లులను స్పూర్తిగా తీసుకొని మిగిలిన రాష్ట్రాలు సైతం తమిళనాడు బాటలో నడవదం ఎంతో అవసరం.అయితేచట్టం చేయడంతో పాటు నిందితులు ఏవరైనా, సమాజంలో ఏ స్థాయిలో వున్నా వారిని కఠినంగా శిక్షించేందుకు, చట్టాలను కఠినంగా అమలపుపరచదంలో కూడా ప్రభుత్వాలు చిత్తశుద్ధి కనబరచాలి. ఆయా చట్టాలపై సరైన అవగాహన లేకపోవడంతో బాధితులు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్న వార్తల నేపధ్యంలో   దేసంలో మహిళల , చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి ప్రస్తుతం వున్న చట్టలపై పెద్ద ఎత్తున అవగాహనా సదస్సులను సైతం  ఏర్పాటు చేయాలి.

కామెంట్‌లు