ఊకూకె : - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒకూర్లో ఒక పిల్లోడుండేటోడు. వానికి ఆటలంటే చానా ఇష్టం. పొద్దస్తమానం షికార్లు కొడతా... తోటి పిల్లలతో బొంగరాలాట, గోలీలాట, లేస్తేలాత్, చిల్లంగోడె, కబడీ, వంగుడు దుంకుడు,
కోతికొమ్మచ్చి... అట్లా ఎన్నెన్నో ఆటలు ఆడుకుంటా, ఊరి పక్కనే వున్న చెరువులో ఈత కొట్టుకుంటా తిరిగేటోడు. కొంచం గూడా పని చేసేటోడు కాదు.
కొంతకాలానికి వాడు పెరిగి పెద్దోడయినాడు గానీ బుద్ధి మాత్రం మారలేదు. దాంతో వాళ్ళమ్మ ఒక రోజు వాన్ని పిలిచి "రేయ్.... దున్నపోతులాగా అడ్డంగా పెరిగినావ్. ఇంకా ఎంత కాలమిట్లా పనీపాటా లేకుండా తిరుగుతావ్. ఇట్లాగే వుంటే రేప్పొద్దున నీకు పిల్లనెవరిస్తార్రా... పెండ్లి చేసుకోడానికి" అంటా బాగా తిట్టింది. దాంతో వాడు "నీకెందుకు మా బెంగ. . నేను పోయి పెండ్లి చేసుకోనొస్తా చూడు" అని ఇంట్లో నుండి బైలుదేరినాడు.
వాడు దారిలో పోతా పోతావుంటే ఒకచోట ఒక అంగడి కనబడింది. ఆ అంగట్లో ఒక చిన్నపాప కూచోనింది. వాళ్ళమ్మ లోపల స్నానం చేస్తా వుంది. వీడు అంగడి దగ్గరికి పోయి మురుకులు కొన్ని పొట్లం కట్టిచ్చుకొన్నాడు. ఆ పాప డబ్బులడుగుతే వాడు నవ్వుతా “మీ అమ్మకు నేను బాగా తెలుసులే... ఈసారి వచ్చినప్పుడు ఇస్తా" అన్నాడు. ఆ పాప “ఏం పేరు నీది" అనడిగింది. దానికి వాడు “ఊకూకె" అన్నాడు. అట్లాగా అని పాప గట్టిగా “అమా... ఈయనెవరో మురుకులు తీసుకోని డబ్బులు మళ్ళా ఇస్తానంటా వున్నాడే" అని గట్టిగా అరిచింది. వాళ్ళమ్మ లోపల్నించే “ఎవరే... ఏం పేరే?" అనడిగింది. దానికాపాప “ఊకూకెమా" అనింది. దాంతో వాళ్ళమ్మ ఊకూకెనా అని వూరుకోనింది.
వాడు మురుకుల పొట్లం తీసుకోని చాకిరేవు కాడికి పోయినాడు. అక్కడ చాకలోళ్ళు బట్టలన్నీ శుభ్రంగా వుతికి, ఆరేసి పిల్లల్ని కాపలా పెట్టి వూళ్ళోకి పోయినారు. వీడు ఒక పాప దగ్గరికి పోయి "పాపా... పాపా... నాకు ఆ బట్టలియ్యి, మళ్ళా సాయంత్రానికంతా తిరిగిస్తా. నాకు ఆ బట్టలిచ్చినావనుకో నీకు ఇదిగో ఈ మురుకులిస్తా" అని ఆశ చూపించినాడు. ఆ పాప సరేనని మురుకులు తీసుకోని "తొందరగా రావాల చూడు" అంటూ బట్టలిచ్చి "నీ పేరేమి" అనడిగింది. దానికి వాడు “సుడిగాలి" అని చెప్పి కొత్తబట్టలేసుకొని పోయినాడు. అట్లా పోయినోడు సాయంకాలమయినా రాలేదు. పాప తల్లి వచ్చి "కొత్త బట్టలు యాడికి పోయినాయే" అనడిగింది. దానికి ఆ పాప ఏడుస్తా "సుడిగాలి వచ్చి ఎత్తుకుపోయినాడుమా" అని చెప్పింది. దానికి వాళ్ళమ్మ "సుడిగాలొచ్చి ఎత్తుకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తార్లే... అంతా మన ఖర్మ... నువ్వు ఏడవద్దు" అని మిగతా బట్టలన్నీ మూటగట్టి గాడిద మీద వేసుకోని వెళ్ళిపోయింది.
వాడు కొత్తబట్టలేసుకోని ఒక చెరువు కాడ పోతావుంటే దారిలో ఒకడు అప్పుడే కొనుక్కొచ్చిన కొత్తగుర్రంతో ఎదురొచ్చినాడు. వాడు వీన్ని చూసి “బాబూ... బాబూ... కాస్త ఈ గుర్రాన్ని చూస్తుంటావా... చెరువులో స్నానం చేసొస్తా" అన్నాడు. వీడు సరేనన్నాడు. వాడు స్నానానికి పోతా పోతా "నీ పేరేమి" అని అడిగినాడు. దానికి వాడు "యజమాని" అని చెప్పినాడు. వాడు స్నానానికి అట్లా పోయినాడో లేదో వీడిట్లా గుర్రమేసుకోని మట్టసంగా మాయమైపోయినాడు.
వాడు స్నానం చేసాచ్చి చూస్తే ఇంగేముంది... గుర్రం లేదు. వాడు లబోదిబోమని ఏడుస్తా వుంటే దారిలో పోతున్నోళ్ళందరూ గుంపయినారు. “ఏమయింది... ఎందుకట్లా ఏడుస్తా వున్నావ్... ఏంది నీ బాధ" అనడిగినారు. దానికి వాడు వెక్కి వెక్కి ఏడుస్తా “నా కొత్త గుర్రాన్ని ఎత్తుకుపోయినాడు" అని చెప్పినాడు. దానికి వాళ్ళు "ఎవరెత్తుకోని పోయినారు" అనడిగితే "యజమాని” అన్నాడు. అంతే... వెంటనే జనాలంతా కోపంగా యజమాని గుర్రాన్ని తీస్కోనిపోతే మధ్యలో నీకెందుకు బాధ... పోతావా లేదా ఈన్నించి" అని వాన్నే బాగా తిట్టినారు.
వీడు మంచి బట్టలతో కొత్త గుర్రమ్మీద పోతావుంటే దారిలో ఒక ఏరు అడ్డమొచ్చింది. ఏటి ఒడ్డున ఒక ముసలామె అందమైన మనుమరాలితో నిలబడి వుంది. వీన్ని చూస్తానే “నాయనా... నాయనా... మమ్మల్ని కాస్త ఏరు దాటించి పుణ్యం కట్టుకో" అనడిగింది. వాడు సరేనని తలూపుతా “మీ ఇద్దరూ ఒకేసారి ఎక్కుతే నా గుర్రం మొయ్యలేదు. ఒకరి తర్వాత ఒకరిని దాటిస్తా” అని ముందు ఆ అందమయిన అమ్మాయిని ఎక్కించుకున్నాడు. ముసల్ది “నాయనా ఇంతకీ నీ పేరేమి" అనడిగింది. దానికి వాడు “దాని మొగుడు" అని చెప్పినాడు. ఆ పిల్ల దారిలో "నాకు ఇష్టం లేకపోయినా ఆ ముసల్ది డబ్బుకోసం ఆశపడి ఒక ముసలోనికి ఇచ్చి పెళ్లి చేస్తావుంది. నన్ను కాపాడవా" అని అడిగింది. వాడు "నీకు ఇష్టమైతే నేను చేస్కుంటా... ఏం సరేనా" అంటూ ఏరు దాటింతర్వాత తిరిగి రాకుండా ఆ పిల్లతో అట్లాగే పారిపోయినాడు.
ముసల్ది ఏడుస్తా రాజు దగ్గరికి పోయి “రాజా... రాజా... నా మనుమరాలిని ఎత్తుకొని పోయినాడు. నువ్వే కాపాడాల" అనింది. రాజు “ఎవరెత్తుకోని పోయినాడు" అనడిగినాడు. దానికామె “దాని మొగుడు" అని చెప్పింది. ఆ మాటింటానే రాజుకు కోపమొచ్చి “దాని మొగుడు దాన్నెత్తుకోని పోక... నిన్నెత్తుకోని పోతాడా... ఫో... ఫో... ఈన్నించి" అంటూ ఆమెను కసురుకోని తిట్టి పంపిచ్చేసినాడు.
వాడు గుర్రమ్మీద ఆ పిల్లని తీసుకోని ఇంటికిపోయి “అమా... అమా... కాస్త బైటికొచ్చి చూడమా... ఎంత చూడచక్కనైన పిల్లను తెచ్చినానో... వెంటనే మాకు పెండ్లి చేద్దువురా" అన్నాడు. ఆమె సంబరంగా ఊరందరినీ పిల్చి బ్రహ్మండంగా కొడుకు పెండ్లి జరిపించింది.
***********
కామెంట్‌లు
Popular posts
సింప్లిసిటీ!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం