పుడమి తల్లి శోకం ::- ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు- సారవకోట -చరవాణి: 9490994976
 మనిషైనా, మొక్కైనా, జంతు, జీవరాశులైనా మీ మనుగడకు ఆధారం నేనే..అదే మీ భూమాతను.
ఆహార పదార్థాల అధిక దిగుబడి కోసం అనవసర రసాయనిక ఎరువులను ఉపయోగించి మా భూసారాన్ని తగ్గించేస్తున్నారు.
పంట పొలాలను ఫ్లాట్స్ చేసి పోట్లు పొడుస్తున్నారు.
బంగారం లాంటి మా భూమిపై
బహుళ అంతస్తుల భవంతులు కట్టుకుని మాపై ఎనలేని భారం మోపేస్తున్నారు.
బోరుబావులు కోసం మా భూగర్భాన్ని చీల్చేస్తున్నారు.
గనులు కోసం జనులు కొండల్ని కూల్చేస్తున్నారు, పిండి చేసేస్తున్నారు..
కోనల్ని కాల్చేస్తున్నారు.
అడవులను అరణ్యాలు ఆక్రమించేసి అగ్గిపెట్టేస్తున్నారు. చెట్టుచేమలకు చితి పేరుస్తున్నారు.
మూగజీవులకు మకాం లేకుండా చేస్తున్నారు.
పరిశ్రమలలోని రసాయనిక, వ్యర్థ జలాల్ని నదులలోకి వదలి స్వచ్ఛమైన జలాలను హాలాహలం చేస్తున్నారు.
వన్నెలుగా ఉండే ఇసుక తిన్నెలను లేకుండా నమిలేస్తున్నారు.
మట్టిని మింగేస్తున్నారు..
ఇంధనాలు కోసం మా ఇల్లు, ఒళ్ళు గుళ్లచేస్తున్నారు.
లోహాలు కోసం లోతుగా సొరంగాలు త్రవ్వేస్తున్నారు.
 
ఆకుపచ్చని ప్రకృతి అందాల్ని  అగుపడకుండా పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు.
పచ్చదనం లేక వెచ్చదనంతో భూతాపాన్ని పెంచేస్తున్నారు.
మానవా, ఇకనైనా ఇవి చేయడం మానవా... 
భావితరాల కోసం మారవా..
నిన్ను నన్ను అందర్నీ మోస్తుంది ఈ నేలమ్మా, అన్నిటికీ వెన్ను దన్ను పుడమి తల్లి..
మన తల్లి నవ మాసాలు మోసి నేలపై నిలిపితే ఈ పుడమి తల్లి  ప్రాణం పోయేవరకు మోస్తూనే ఉంటుంది. కట్టె కాలేవరకు కాపాలా కాస్తుంది.
కంటికి రెప్పలా కాసుకునే అమ్మను, కాలు మోపి, కాయమున్నంత వరకూ చూసుకున్న నేలమ్మను చక్కగా చూసుకుందాం.
భూకోతను ఆపుదాం. 
భూసంపద నిలుపుదాం.. 
భూమాతను కాపాడుకుందాం.

కామెంట్‌లు