న్యాయములు-846
"కాంచనాత్ కర్మ మోచనమ్" న్యాయము
*****
కాంచనం అనగా బంగారు, వికారమైన, బంగారము,కాంతి, సంపద చంపకము.కర్మ అనగా చర్య,పని,విధి. మోచనమ్ అనగా విముక్తి, రక్షణ,పాత తప్పుల నుండి విడిపించడం అనే అర్థాలు ఉన్నాయి.
"డబ్బిచ్చి కర్మమును పోగొట్టుకోవచ్చు ననుకొన్నట్లు"అని అర్థము.
డబ్బిచ్చి కర్మమును పోగొట్టుకోవచ్చు ననుకొన్నట్లు అనే న్యాయములో ముందు కర్మము అంటే ఏమిటో ఎన్ని రకాల కర్మలు ఉంటాయో తెలుసుకుందాం.
కర్మ అంటే కేవలం వ్యక్తి చేసే పని లేదా విధి మాత్రమే కాదు.ఆయా వ్యక్తులు చేసుకున్నది అని కూడా అంటారు.వ్యక్తిగా తాను చేసే పనిలో తన యొక్క ఆలోచనలు, భావనలు, ఉద్దేశాలు కూడా ఉంటాయి. అలాంటి భావనలు, ఆలోచనలు,ఉద్దేశాలతో చేసే పని,చర్య లేదా విధికి తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది. ఆ ప్రతి చర్య మంచిగా లేదా చెడుగా ఉండవచ్చు.అనగా చేసే దానిని బట్టి ఫలితం ఉంటుంది.
"చేసిన కర్మ చెడని పదార్థం" అంటూనే "చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ" అని కూడా అంటుంటారు.అనగా చేసుకున్న కర్మలను బట్టి ఆ స్థాయిలో ఫలితాలు ఉంటాయని అర్థము .
హిందూ మరియు జైన మతాల ప్రకారం కర్మలను మూడు రకాలుగా విభజించారు. అవి ఒకటి సంచిత కర్మ.రెండవది ప్రారబ్ధ కర్మ. మూడవది ఆగామ్య కర్మ.
సంచిత కర్మ:-అనగా గత జన్మల నుండి పేరుకుపోయిన మరియు ఇంకా పూర్తి కాని కర్మను సంచిత కర్మ అంటారు. ఆధ్యాత్మిక వేత్తలు నిర్వచించిన కర్మ సిద్ధాంతం ప్రకారం మన గత జీవితాల నుండి చేసిన మంచి చెడు పనుల యొక్క మొత్తము గత జన్మలలో చేసిన ఆలోచనలు, పనులు, మాట్లాడిన మాటలు,తీరని అనుభవాలు.ఇవన్నీ మన సూక్ష్మ,అంతర్గత పొరల్లో నిల్వ ఉంటాయి.ఇవి ప్రస్తుత మరియు భవిష్యత్తు జీవితం, జన్మలపై ప్రభావం చూపుతాయి అంటారు.ఇవన్నీ కలిపి సంచిత కర్మ అంటారు.
ప్రారబ్ధ కర్మ:- చేసిన కర్మల ఫలితంగా మనము అనుభవించవలసిన కర్మను ప్రారబ్ధ కర్మ అంటారు. ఇది గత జన్మల కర్మల ద్వారా వచ్చే ఫలితం. ప్రస్తుతం అనుభవించాల్సిన కర్మ ఇదే. సంచిత కర్మలను తీసుకుని జీవి ఈ శరీరాన్ని పొందుతుంది.ఆ విధంగా శరీరం ద్వారా వచ్చిన కర్మలను ప్రస్తుత జీవితంలో పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ఆగామ్య కర్మ:- ఇది మహా చెడ్డ కర్మ అంటుంటారు.ఎందుకంటే ఈ శరీరంతో భూమ్మీదకు వచ్చిన తర్వాత కొత్త కొత్త ఆలోచనలు, పనులు, మాటలతో ఈ కర్మలను పెంచుకుంటూ ఉంటారు.ఇలా ప్రస్తుతం చేసే కర్మలను ఆగామి కర్మ అంటారు.ఇది భవిష్యత్తులో అనుభవానికి వస్తుంది.
మన పెద్దలు ఎంతటి వారైనా కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు అంటుంటారు.అందుకే"అవశ్యం అనుభోక్తవ్యం,కృతం కర్మ శుభా శుభం"అంటారు.అలాగేమన పెద్దలు చెప్పే మాట ఏమిటంటే ప్రతి వ్యక్తిలో కూటస్థంలో చిత్రంగా కూర్చుని, గుప్తంగా వ్యక్తులు చేసే కర్మలను నమోదు చేసేవాడు ఒకడు ఉంటాడనీ, అతడినే మనం చిత్రగుప్తుడు అని పిలుస్తామని చెబుతుంటారు.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు "గహనా కర్మణో గతిః అంటాడు.అంటే కర్మ గతిని అంచనా వేయడం కష్టం అని అర్థము. ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రాప్తం, ఋణం అనే మాటలు వాడుకలోకి వచ్చాయి. "ప్రాప్తం ఉంటే వస్తుంది/ దొరుకుతుంది" అనడం. "ఎన్నాళ్ళ నుండో ఋణం "అనడం మనం పెద్ద వాళ్ళ నుండి తరచూ వింటుంటాం.
ఈ ప్రాప్తం గురించి వేమన రాసిన పద్యాన్ని చూద్దాము. "చిప్పలోన పడిన చినుకు ముత్యంబాయె/నీళ్ళ బడ్డ చినుకు నీళ్ళ కలిసె/ప్రాప్తము కల చోట ఫలమేల తప్పురా/ విశ్వదాభిరామ వినురవేమ!"...అనగా మనకు ఎలా ప్రాప్తం ఉంటే అలా జరుగుతుంది,అది తప్పదు అని అర్థము.
మనం ఇప్పుడు ఇన్ని రకాల కర్మల గురించి వాటి ఫలితాల గురించి చెప్పుకుంటున్న ఈ సమయంలో"కాంచనాత్ కర్మ మోచనమ్" న్యాయము "సాధ్యమేనా? అనే సందేహము ప్రతి ఒక్కరికీ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదనే చెప్పాలి. పైన చెప్పుకున్న మూడు రకాల కర్మల ప్రకారం ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే.వాటి ఫలితాలు పొందాల్సిందే.
ఈ సందర్భంగా మన పెద్దవాళ్ళు భగవద్గీత లోని ఓ శ్లోకాన్ని గురించి బాగా గుర్తు చేస్తుంటారు.అందులోని విషయం ఏమిటంటే "కర్మకు కాలానికి జ్ఞాపకశక్తి ఎక్కువ.ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి,చెడులకు ఫలితం ఇవ్వకుండా వదిలి పెట్టవు..!!" అని కాబట్టి డబ్బు లేదా సంపాదనతో కర్మ నుంచి విముక్తి పొందడం సాధ్యం కాదు.కానీ ప్రారబ్ధ కర్మలో భాగంగా ఇక నుండైనా మంచి కర్మలు చేస్తే భవిష్యత్తు జీవితం మంచిగా ఉండే అవకాశం ఉంటుంది.
ఇదండీ "కాంచనాత్ కర్మ మోచనం" న్యాయము.దీని ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించ వలసిందే. డబ్బుతో పాపకర్మలను తుడిచేసుకుంటామంటే కుదరదు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి