సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు -849
అథమా సేవకా వృత్తిః న్యాయము
******
అథమా అనగా మిక్కిలి తక్కువైనది, అప్పు చేసిన వాడు.సేవకా అనగా భృత్యుడు.వృత్తి అనగా నడవడి,జీవనోపాయము,వివరణ గ్రంథము అనే అర్థాలు ఉన్నాయి.
సేవకా వృత్తి అతి నీచమైనది అని ఈ న్యాయం యొక్క అర్థము .అయితే ఎలాంటి సేవకా వృత్తి నీచమైనది? సేవ అంటేనే ఇతరులకు హృదయ పూర్వకంగా చేసే సేవ ఎంతో గొప్పది.మహోన్నతమైనది.అందుకే పెద్దలు మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా! మరి ఈ న్యాయమును ఎందుకు  సృష్టించారో నిశితంగా అధ్యయనం చేద్దాము.
 ఆత్మాభిమానం,  పౌరుషం చంపుకుని ఇతరులకు దాసోహం అని చేసే వృత్తి నిజంగా మిక్కిలి తక్కువ గౌరవం కలదేనని, నీచమైనదేనని చెప్పవచ్చు.కొంతమంది తమ ఆధిపత్యంతో తమ క్రింది ఉద్యోగులను చాలా తక్కువ భావంతో చూస్తూ ఉంటారు. అలాంటి వారి దగ్గర చేసే ఉద్యోగం నిజంగా చాలా బాధాకరమైనది.సేవకుడికి కోపం వచ్చినా, చేయించుకునే వాడికి కోపం వచ్చినా నష్టం సేవకుడికే. అందుకే అలాంటి వారి వద్ద వృత్తి చేయడం కంటే విరమించుకోవడం మంచిది. ఆ ఉద్దేశంతోనే ఈ న్యాయమును మన పెద్దలు ఉదాహరణగా చెప్పి వుంటారని మనం గ్రహించవచ్చు.
ఇక ఈ సేవకా వృత్తి గురించి ఆంధ్ర మహా భారతంలోని విరాటపర్వం లోని విశేషాలు, విషయాలు తెలుసుకుందాం.
 కౌరవులతో జూదమాడి ఓడిన పాండవులు వనవాసం చేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు అజ్ఞాత వాసం చేయవలసి ఉంటుంది.అప్పుడు పాండవులు ద్రౌపదితో కలిసి వారి వారి పనులను నిర్ణయించుకునే  సందర్భంలో  ఈ సేవకా వృత్తి అనే పదం వారి మాటల్లో వస్తుంది.
అలా వారు విరాట్ రాజు కొలువులో అజ్ఞాతవాసం గడిపేందుకు నిర్ణయించుకుంటారు. ఆ  సందర్భంలో అర్జునుడు ధర్మరాజుతో నీవు మహనీయ మూర్తివి, ఎంతో సుకుమారుడవు.ఎంతో ప్రాభవము అనుభవించిన వాడివి. అటువంటి నీవు ఎలా ఇతరులను సేవించగలవు అంటాడు.అప్పుడు తాను విరాట్ రాజును జ్యూదంతో అలరిస్తాను అంటాడు. ధర్మరాజు భీముడితో "బకాసుర,కిమ్మీరాదులను చంపిన నీవు సేవకా వృత్తి ఎలా చేస్తావు? అని అడుగుతాడు. అప్పుడు "తనకు వంటలు చేయడం వచ్చు కాబట్టి వంటల వాడిగానూ,మల్ల యుద్ధంలో ప్రావీణ్యం ఉంది కాబట్టి మల్ల విద్యా ప్రదర్శనలతో అందరికీ వినోదం కలిగిస్తాను " అంటాడు.
అర్జునుడు తనకు ఊర్వశి పెట్టిన శాపాన్ని దేవేంద్రుడు ఈ అజ్ఞాత వాస సమయంలో అనుభవించమని చెప్పాడు.అందువల్ల నేను అంతఃపుర కాంతలకు నాట్యం నేర్పేందుకు బృహన్నలగా ప్రవేశిస్తాను" అంటాడు.మరి నకులుడు చాలా సుకుమారుడు,ఎంతో అందగాడు తన నిజరూపాన్ని ఎలా దాచగలడు ఇతరులను ఎలా సేవించగలడు  అని వెలిబుచ్చిన సందేహానికి అశ్వ శిక్షణలో ప్రవేశం ఉంది కాబట్టి అశ్వ శిక్షకుడిగా చేరుతానని, అలాగే సహదేవుడు తనకు పశు పోషణలో అనుభవం ఉంది కాబట్టి తాను గోరక్షుకుడిగా పని చేస్తానని చెబుతారు.ఇక పరమ సుకుమారి అయిన ద్రౌపది తాను సైరంధ్రి వేషంలో మాలిని అనే పేరుతో విరాట్ రాజు భార్య సుధేష్ణను పరిచారికగా  సేవిస్తాను అంటుంది.
 పరులను సేవించడం ఎంతో కష్టమే కానీ ప్రస్తుత పరిస్థితులు అనుకూలం కాదు, అజ్ఞాత వాసం కావున తప్పదు.రాజులను సేవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ రాజుల దగ్గర సేవకులు ఎలా ఉండాలో,ఎలా మసలుకోవాలో మొదలైన విషయాలు అన్నీ ధౌమ్యుడి ద్వారా వింటారు. ఆ విధంగా వారు ఆరుగురు విరాట్ రాజు కొలువులో వివిధ రకాల వృత్తులు చేస్తూ అజ్ఞాతవాస కాలాన్ని గడుపుతారు.
 ధౌమ్యుడి మాటల్లో సేవకా వృత్తి  ఎలా  కత్తిమీద సాము లాంటిదో అనేక ఉదాహరణలతో వివరించబడింది.ఆ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే "సేవకా వృత్తి అతి నీచమైనది"గా  చెప్పబడింది.
ఆ కాలంలో పరిస్థితులు అలా వుంటే మన తెలంగాణకు స్వాతంత్ర్యం రాక ముందు భూస్వాములు ,దేశ్ ముఖ్ ల వ్యవస్థలో కూలీలు,పాలేర్ల పరిస్థితి కూడా అంతకంటే దయనీయంగా "బాంచెన్ కాల్మొక్త" అని అనిపించుకునేలా ఉండేది. వారు చేసే  సేవలను పొందుతూనే వారిని చాలా హీనంగా చూసేవారు. అందువల్ల కూడా ఈ "అథమా సేవకా వృత్తిః న్యాయము" నకు పేరు వచ్చింది.
 దైవ సేవ,మానవ సేవ,సమాజ సేవ, ప్రకృతి సేవ, పర్యావరణ సేవ.. ఇందులో దేనినైనా  సరే దాని గొప్పతనం తెలుసుకోనంత కాలం సేవ ఎప్పుడూ ఇలా కొఃదరి నోళ్ళతో సేవకా వృత్తి అతి నీచమైనదనే చెప్పబడుతుంది. మరి మీరు కూడా నాతో ఏకీభవిస్తారు కదూ!

కామెంట్‌లు