చమత్కార పద్యం:- సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 కం!!
అంచిత చతుర్థ జాతుడు 
పంచమ మార్గమున నేగి ప్రథమ తనూజన్ 
గాంచి, తృతీయం బక్కడ 
నుంచి, ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెన్!

భావం:-
గొప్పవాడైన నాల్గవ వాని కుమారుడు ఐదవమార్గంలో వెళ్ళి మొదటికుమార్తెను చూసి, మూడవదానిని అక్కడ ఉంచి, రెండవ దానిని దాటి వచ్చెను.
ఇలా చెబితే ఎవరికీ బోధపడదు.
ఈ పద్యం అర్థం కావాలంటే పంచ భూతాలతో అన్వయించి చెప్పుకోవాలి. 
పంచభూతాలు
1) భూమి 2) నీరు 3) అగ్ని 4) వాయువు
5) ఆకాశం 
ఇప్పుడు పద్యం చాలా సులభంగా అర్థం అవుతుంది.
చతుర్థ జాతుడు అంటే వాయు నందనుడు,
పంచమ మార్గము అంటే ఆకాశ మార్గము,
ప్రథమ తనూజ అంటే భూమిపుత్రి సీత,
తృతీయము అంటే అగ్ని ,
ద్వితీయము దాటి అంటే సముద్రం దాటి 
ఇప్పుడు భావం సులభంగా బోధపడుతుంది చూడండి.
హనుమంతుడు ఆకాశమార్గాన వెళ్ళి సీతను చూసి లంకకు నిప్పు పెట్టి సముద్రం దాటివచ్చాడని భావం. 

ఇటువంటి పద్యాలే తెలుగుభాష గొప్పతనాన్ని నిలబెట్టేవి. వ్రాసిన కవికి నమస్సుమాంజలి.🙏👏🙏

🙏 హనుమాన్ జయంతి శుభాకాంక్షలు🙏
—------------------------------------

కామెంట్‌లు