సునంద భాషితం :- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు -834
కష్టే ఫలమ్/కష్టే ఫలి న్యాయము
****
కష్టపడితేనే ఫలం/ఫలితం కలుగుతుంది/లభిస్తుంది అని అర్థము. అంటే ఏదైనా సాధించాలంటే ఏమాత్రం శ్రమించకుండా, ఎలాంటి కష్టం పడకుండా ఎలాంటి ఫలితం రాదు.అదే ఈ న్యాయములోని అంతరార్థము.
దీనినే "ఆంగ్లంలో నో పెయిన్స్,నో గెయిన్స్" అని అంటారు. కష్టాలు లేకపోతే లాభాలు ఉండవని భావన.
 మరి ఈ కష్టే ఫలి లేదా కష్ట ఫలమ్ న్యాయము గురించి కొన్ని విషయాలు, విశేషాలు తెలుసుకుందాం.
మనం ఫలితం పొందాలి అంటే కష్టపడాల్సి ఉంటుంది. ప్రయత్నించాల్సి వుంటుంది.అది  పక్షయినా,పశువైనా ,మనిషైనా. అందుకే భర్తృహరి  సుభాషితాలలో ఇలా అంటాడు.
"ప్రయత్నేన హి సిధ్యంతి కార్యాణి,నా మనోరథైః!/నా హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః"
అనగా దేనికైనా మానవ ప్రయత్నం చేయవలసిందే.నిద్రబోయే సింహం నోట్లోకి నేరుగా జంతువులు వచ్చి దూరిపోవు గదా!( కాబట్టి సింహం లేచి పరుగులు తీస్తూ వేటాడితేనే, దాని నోటికి ఆహారం అందుతుంది)చీమైనా వెతుక్కోవలసిందే.సింహమైనా వేటాడ వలసిందే కదా!.
 కూలీ అయినా, విద్యార్థియైనా తాము సాధించాలనుకునే దాని కోసం తప్పకుండా కష్ట పడాలి. కొందరిది శారీరక కష్టం. మరికొందరిది మానసిక కష్టం. అంటే ఆలోచించి ఆలోచించి పని చేయడం. దీనికి ఉదాహరణగా థామస్ అల్వా ఎడిసన్ పేరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే 199సార్లు తాను చేస్తు పనిలో విఫలమైనా ప్రయత్నం చేసి చేసి విద్యుత్ బల్బు కనిపెట్టడం మామూలు విషయం కాదు.
దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన కథను కూడా చర్చించుకుందాం. ఒకానొక భక్తుడు ఎడ్లబండిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు.అలా వెళ్తూ ఉంటే బండి బురద గుంటలో పడిపోతుంది. ఎంత తీద్దామని ప్రయత్నించినా అది రాదు. అప్పుడు ఆ భక్తుడు దైవాన్ని ప్రార్ధిస్తాడు . అయినా రాదు. మెల్లగా కిందికి దిగి బురద గుంటలోంచి బండి చక్రాన్ని వెనుక నుంచి గట్టిగా నెట్టడంతో బండి గుంట నుండి చక్రం బయటకు వస్తుంది. అప్పుడు ఆ భక్తుడు భగవంతుని గురించి ఓ సందేహం వస్తుంది. అసలు దేవుడున్నాడా? నేను ఆయనను అంతగా నమ్మి పూజిస్తున్నాను కదా! నాకింత కష్టం వస్తే సహాయం చేయనే లేదు అనుకున్నాడట. అప్పుడు ఆ దేవుడు " ఓ పిచ్చివాడా! నా సహాయం లేకుండానే బండి చక్రం బయటకు వచ్చిందని అనుకుంటున్నావా? నువ్వు నీ శక్తిని నమ్ముకుని ఎప్పుడైతే ప్రయత్నం మొదలు పెట్టావో అప్పుడే నా సహాయం అందించాను. గాలిలో దీపం వెలిగించి ఆరిపోకుండా ఆపమని అనడం కాదు. దానికి మీ చేతులు అడ్డం పెడితే నా చేయి కూడా అడ్డుకుంటుంది అన్నాడట ఆ భగవంతుడు. అంటే మనం కష్టిస్తేనే దైవ సహాయం తోడవుతుందనేది అర్థము ౙసుకోవచ్చు.
అందుకే మహాభారతంలో శ్రీకృష్ణుడు దుర్యోధనుడి దగ్గరకు రాయబారిగా వెళ్తూ అర్జునుడితో ఓ మాట ఇలా అంటాడు.
 "వెరపున లావునం గృషికి వేయు విధంబుల మేలొనర్చినన్/దొరకొనునే ఫలంబు తరితో దగు వర్షము లేక యున్న?/నెప్పురుసున లెస్స సేసినను బౌరుషముల్ ఫలియించుటెల్ల నా!/దరణమునం బ్రసన్నమగు దైవము చేత న చూవె ఫల్గుణా!"
అనగా ఎంత కష్టపడి సేద్యం చేసినా, సకాలంలో వర్షాలు పడకపోతే అంతా వ్యర్థమే గదా!దైవానుకూల్యత లేకపోతే - మన శ్రమ ఫలింపుకు రాదు గదా! అన్న ఆ కృష్ణుడే " కావున సంధికిన్ పురుషాకార మొనర్చెద నోపినంతయున్/దైవము చేత యెట్లగునొ దాని నెరుంగను"అని కూడా అన్నాడాయన.
ఎప్పుడైనా సరే మనిషి తాను చేయవలసిన పనిని  కష్టమని భావించకుండా సమగ్రంగా , సఫలం అవుతుందనే నమ్మకంతో చేయాలి.అలా చేసినప్పటికీ దైవానుగ్రహం కూడా తోడవ్వాలి అంటారు ఆధ్యాత్మిక వేత్తలు.
ఇక మన చిన్నప్పుడు చదువుకున్న చీమ - గొల్లభామ/ మిడత కథ అందరికీ తెలిసిందే. చీమ ఎండాకాలం అంతా కష్టపడి ఆహారం సంపాదించుకుని దాచుకుంటుంది. మిడత/ గొల్లభామ మాత్రం  ఎండాకాలం అంతా హాయిగా,ఆనందంగా కాలం గడుపుతుంది. శీతాకాలం, వర్షాకాలం  వచ్చినప్పుడు చీమ ఆహార సమస్య లేకుండా ఆనందంగా ఉంటుంది. మిడత/గొల్లభామ కష్టపడాల్సిన సమయంలో కష్టపడక పోవడంతో ఆకలికి అల్లాడి పోతుంది. కష్టించడం వల్ల చీమకు ఫలితం లభించిందని ఈ కథ ద్వారా అర్థం చేసుకోవచ్చు.
 ఇలా కష్టపడితేనే, కష్టపడిన వ్యక్తికే ఫలితం లభిస్తుంది. దైవ సహాయం కూడా లభిస్తుంది.లభించాలి కూడా.ఎందుకంటే అది న్యాయము కూడా.లభించకపోతే అది చాలా బాధాకరం. కొన్ని  సందర్భాల్లో, కొందరి విషయంలో"కష్టమొకరిది ఫలితమొకరిది- నేటి సమాజంలో చూస్తున్నామిది."చీమలు పెట్టిన పుట్టలు/ పాముల కిరవైన యట్లు పామరుడు దగన్/హేమంబు గూడబెట్టిన/ భూమీశుల పాల జేరు భువిలో సుమతీ!"
అనగా చీమలు కష్టపడి పెట్టిన పుట్టలలో పాములు చేరినట్లు, పామరుడు కష్టపడి దాచుకున్న బంగారం రాజుల పాలై, అతడికి ఉపయోగపడకుండా పోతుంది.అలా జరుగకుండా చూడడం మన విధి. ఇదండీ "కష్టే ఫలి/ ఫలమ్" న్యాయము యొక్క విశేషాలు,  ఇందులో మనకు మూడు కోణాలు కనిపిస్తున్నాయి. కష్టించినచో ఫలితం దక్కుతుందని.ఎంత కష్టించినా సహాయం దైవ రూపంలో అందితేనే ఫలితం దక్కుతుందని.కష్టించేవారు కొందరు వారికి ఆ ఫలం అందకుండా దోచుకునే వారు మరికొందరు అని.అయితే  కష్టించిన వారు  ఫలితాలు పొందేలా చూడటం  మన వంతు కర్తవ్యం.ఏకీభవిస్తారు కదూ!.

కామెంట్‌లు
Popular posts
సింప్లిసిటీ!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం