మారిన అమ్మాయి :- సరికొండ శ్రీనివాసరాజు
     శ్రీపురం ఉన్నత పాఠశాలలో శ్రుతి మరియు అఖిల ఒకే తరగతి చదువుతున్నారు. చదువులో ఇద్దరూ పోటా పోటీగా చదివేవారు. ఎవరు ఫస్ట్ వస్తారో చెప్పడం కష్టం. అయితే అఖిలకు శ్రుతి అంటే ఈర్ష్యా భావం ఉండేది. శ్రుతితో అస్సలు మాట్లాడదు. ఎందుకు అని ఎవరైనా అడిగితే శ్రుతి గురించి చెడుగా చెబుతుంది అఖిల. ఇది తెలిసి శ్రుతి బాధ పడుతుంది. కానీ అఖిల గురించి శ్రుతి ఇతరుల దగ్గర అసలే మాట్లాడదు. 
    ఈసారి పరీక్షలలో శ్రుతి ఫస్ట్ ర్యాంకు వచ్చింది. అఖిలకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి. టీచర్లు శ్రుతిని బాగా మెచ్చుకున్నారు. క్లాసులో అందరూ ఆటలకు వెళ్లిన సమయంలో శ్రుతికి ఒంట్లో బాగా లేక క్లాసులోనే ఉండి పోయింది. ఇదే అదునుగా అఖిల శ్రుతి వద్దకు చేరి, అకారణంగా గొడవ పెట్టుకుంది. 
    గీతాంజలి అనే అమ్మాయి అఖిల వద్దకు చేరింది. "నీకు మార్కులు తక్కువ వచ్చాయని బాధ పడుతున్నావా? నీకు అతి ముఖ్యమైన విషయం చెప్పాలి. మా ఇంటి పొరుగునే స్రవంతి అనే అమ్మాయి ఉంటుంది. తనకు అమ్మా నాన్నలు లేరు. నాయనమ్మ దగ్గరే పెరుగుతుంది. కానీ ఆ నాయనమ్మ స్రవంతిని రాచి రంపాన పెడుతుంది. పొద్దున్నే 4 గంటలకు లేవాలి. ఇల్లంతా ఊడ్చి, వాకిలి ఊడ్చి నీళ్ళు చల్లాలి. ఇంట్లో అంట్లన్నీ తానే తోమాలి. అందరి బట్టలు తానే ఉతకాలి. వంటపని తానే చేయాలి. తాను 9వ తరగతి చదువుతున్నది. ఇంట్లో ఏ పనిలో అయినా తేడా వచ్చినా, చిన్న పొరపాటు జరిగినా వాళ్ళ నాయనమ్మ చేతితో దారుణంగా దెబ్బలు తింటుంది. అన్ని కష్టాలు ఎదురైనా ఎదురీత ఎద్దుతూ మంచి మార్కులు తెచ్చుకుంటుంది. కానీ వాళ్ళ నాయనమ్మ స్రవంతిని 10వ తరగతి చదివాక చదువు మానిపించి పనిలో పెడుతుందట." అన్నది. "అయ్యో పాపం! ఆ అమ్మాయిని ఒకసారి చూడాలి. ఏదైనా సాయం చేయాలి." అన్నది అఖిల. 
      మరునాడు పొద్దున్నే అఖిలను ఆ అమ్మాయి ఇంటికి తీసుకెళ్ళింది. స్రవంతీ అని చెప్పబడ్డ ఆ అమ్మాయి ఎవరో కాదు. మన శ్రుతినే. శ్రుతి వాళ్ళ పూరి గుడిసె చూసి ఆశ్చర్యపోయింది అఖిల. శ్రుతి కష్టాలూ కళ్లారా చూసింది. పాఠశాలకు వచ్చాక శ్రుతిని చూసి దగ్గరకు తీసుకుని బోరున ఏడ్చింది అఖిల. తనను క్షమించమని వేడుకుంది. ఇప్పటి నుంచి మనం ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అన్నది. శ్రుతి గురించి, ఆమె భవిష్యత్ గురించి తన ఇంట్లో చెప్పింది అఖిల. "శ్రుతిని పెద్ద చదువులు చదివించే బాధ్యత మనం తీసుకుందాం. ఎవ్వరు అడ్డం వచ్చినా వారి భరతం పడదాం." అన్నారు అఖిల తల్లిదండ్రులు.

కామెంట్‌లు