కొత్తకవి- కొంగొత్తప్రకంపనలు:--- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కొత్తగావచ్చావా
సాహిత్యలోకం,
వెంటతెచ్చుకున్నావా
కమ్మనికవిత్వం.

కళ్ళారాకాంచావా
ఊహలజగం,
తెలుసుకున్నావా
ఆశలప్రపంచం.

వెలిగిస్తున్నావా
అక్షరజ్యోతులు,
పారిస్తున్నావా
పదాలప్రవాహాలు.

పూయిస్తున్నావా
పలుపుష్పాలు,
చల్లుతున్నావా
సుమసౌరభాలు.

వడ్డిస్తున్నావా
విందుభోజనం,
అందిస్తున్నావా
అధరామృతం.

చూపుతున్నావా
చిత్రశిల్పాలు,
చేరుస్తున్నావా
శాంతిసుఖాలు.

చిందిస్తున్నావా
చిరునవ్వులు,
ప్రసరిస్తున్నావా
ప్రత్యూషప్రభలు.

మురిపిస్తున్నావా
మట్టిమదులు,
కరిగిస్తున్నావా
కఠినహృదులు.

ఆడిస్తున్నావా
కవనక్రీడలు,
పాడిస్తున్నావా
గాంధర్వగానాలు.

తెలుపుతున్నావా
దానధర్మాలు,
చూపుతున్నావా
మనోమర్మాలు.

కురిపిస్తున్నావా
కంజపుధారలు,
క్రోలిస్తున్నావా
కావ్యరసాలు.

సృష్టిస్తున్నావా
సాహితీప్రకంపనలు,
క్రమ్మిస్తున్నావా
కబ్బపురాణితరంగాలు.


కామెంట్‌లు