శ్రీమద్భగవద్గీత వ్యాసములు, 24:- పి.విఎల్.సుబ్బారావు-విజయనగరం-9441058797

 అంశముసామాజిక వర్గీకరణ
భాగము1
(శ్లో).యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదంతతమ్!
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధింవిందతి మానవః!
(శ్లో) శ్రేయాన్ స్వధర్మో విగుణః పర ధర్మాత్ స్వనుష్టి తాత్!
స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్!
భగవద్గీతలో చతుర్వర్ణవ్వవస్థ  తెలియజేయబడినది. సమాజం నడవడానికి సమాజంలోని వ్యక్తుల వర్గీకరణ,, తద్వారా వారి పనుల నిర్వహణ ఎంతైనా అవసరం. 
నేడు సమాజాన్ని చూస్తే 
1. కంప్యూటర్ విజ్ఞానులు  2సమాజ రక్షకులు ( పోలీసులు, సైనికులు), 3.వ్యాపారులు(traders,. వర్తకులు).
4. పాలకులు. 5వైద్యులు.
6 ఉపాధ్యాయులు 
7., సేవకులు (public, private ,servants )
8. కళాకారులు(artists
9. క్రీడాకారులు (Players  )
10. శాస్త్రవేత్తలు. (Scientists).
కనిపిస్తూ ఉంటారు. వీళ్లంతా జన్మని బట్టి గాక ఆ వర్గీకరణలో ఉండాల్సిన గుణాన్ని బట్టి దానిలో ఉంటారు. 
ఉదాహరణ--:, పాలకులకు పుట్టినవాళ్లు పాలకులు అవ్వాల్సిన అవసరం లేదు. ఉపాధ్యాయుని కుమారుడు ఉపాధ్యాయుడు కాలేకపోవచ్చు. మనిషి ఏ వర్గంలో ఉండాలనుకుంటే దానికి సంబంధించిన యోగ్యత, నైపుణ్యం సంపాదించుకోవాలి. 
ఈ వర్గీకరణకు చెందిన వారెవరికైనా స్వాభావిక ధర్మాలు, కర్మలు ఉంటాయి. వానిని నిర్వహిస్తేనే వారికి శ్రేయస్సు. తద్వారా సామాజిక ప్రగతి సాధ్యం. 
1. జ్ఞానుల స్వాభావిక కర్మలు-:,1. అంతఃకరణ నిగ్రహం (శమము).
2. ఇంద్రియ ములను వశమునందుంచుకొనుట( దమము).
3. కర్మలను పాటించుటలో ఎదురయ్యే కష్టములను సహించుట 
4 బాహ్యాభ్యంతరముల శుచిత్వం.
,5. ఇతరుల అపరాధములు క్షమించుట. 
6. ఋజు మార్గ జీవనము. (మన శ్శరీరేంద్రియముల సరళత్వం)
7. వేద శాస్త్రముల యందు, ఈశ్వరుని యందు, పరలోకముల యందు విశ్వాసం కలిగి ఉండుట.
8. వేద శాస్త్రముల అధ్యయనం, (విద్య నేర్చుకోవడం) అధ్యాపనం అంటే విద్య నేర్పడం. (చదువుకోవడం, చదువు చెప్పడం) 
9. పరతత్త్వా నుభవం. 
2. రక్షకుల స్వాభావిక ధర్మాలు--; 1శౌర్యము, 2తేజస్సు, 3ధైర్యము ,4దక్షత 5యుద్ధమున వెన్నుచూపకుండుట 6.ప్రజలను ధర్మపరాయణులను చేయుచువిధి నిర్వహణ.
3 వ్యాపారముచేయు వారి స్వాభావిక ధర్మాలు--:, 1వ్యవసాయము 2గోపాలనము3, క్రయ విక్రయములయందు సత్య వ్యవహారం, 4.వస్తువులను కొనునప్పుడు, అమ్మునప్పుడు కొలతలలో గాని, గణించుటలో గాని, తక్కువ ఇచ్చుట, ఎక్కువ తీసుకొనుట, వస్తువులను మార్పిడి చేయుట, పదార్థముల యందు కల్తీ చేయుట, లాభం, రుసుము, దళారీల పేరుతో ఎక్కువ ధనం గుంజుట, అబద్ధము, కపటము, దొంగతనం, దౌర్జన్యం మరియు ఇతర అన్యాయరీతల ద్వారా పరుల సొత్తును కాజేయుట ,మొదలగునవి అన్నియును వాణిజ్యములోని దోషములు. ఈ దోషములు లేకుండా నీతి నిజాయితీలతో కొనుట అమ్ముట యే సత్య వ్యవహారం (సత్య వ్యాపారం)అనబడును.
4. సేవకుల స్వాభావిక కర్మ.--: ప్రభుత్వ రంగంలో ఉన్నా, ప్రైవేట్ రంగంలో ఉన్నా, సేవకుల స్వాభావిక కర్మ "సేవ"అందరిని 
 సేవించుట (love all, Serve all) అందర్ని ప్రేమించు, అందర్ని సేవించు, సమాజం నిలబడ్డానికి మూల స్తంభాలు ",సేవకులు"
పైన నాలుగు రంగాలు ముచ్చటించాం. ఇలా ఏ రంగానికి చెందిన వారైనా తమ తమ స్వాభావిక ధర్మాలయందు తత్పరులైనవారు 
భగవద్ ప్రాప్తి రూపసిద్ధిని నిస్సందేహంగా పొందెదరు.
కొన్ని ఉదాహరణలు చూద్దాం--::
1దేవాలయం--: దేవాలయంలో పూజారి, దేవాలయం శుభ్రం చేసే పని వారు, దేవాలయ నిర్వాహకులు,( trustee). ప్రసాదం పంచేవారు, దేవాలయానికి వచ్చి పోయే భక్తులు, ఎవరి పనులలో వారు తత్పరులై పని చేయాలి. దేవాలయం పని వారిలో ఎక్కువ వారు తక్కువ వారు అనే భేదం ఉండదు. వారు చేసే పని రీతిలో ఎక్కువ తక్కువలని భావించక సక్రమమైన పద్ధతిలో సేవలు చేసిన వారికి తగు భగవత్ ప్రాప్తి,, ఉంటుంది. కాబట్టి ఇది తెలుసుకుని విధి నిర్వహణ ఆచరించవలెను. 
2 పాఠశాల--: ఉపాధ్యాయులు, విద్యార్థులు, మేనేజ్మెంట్ సిబ్బంది, పర్యవేక్షకులు, పాఠశాల శుభ్రం చేసే వాళ్ళు, గంట కొట్టేవాడు, ఇలా పాఠశాలతో ముడిపడి ఉన్నవారు ఎవరి పని వారు ఉత్తమంగా పనిచేస్తే అది ఉత్తమ పాఠశాల అవుతుంది. 
3 మన శరీరం--: శిరస్సు, కాళ్లు ,చేతులు, మొండెము అను మూడు భాగములుగా ఉంటుంది. ఏభాగానికి ఆ భాగమే ముఖ్యము. అన్నింటి మధ్య సమన్వయం ఉంటే ఆ శరీరం ధర్మసాధనం అవుతుంది. 
"ముఖ్య విషయం"--: సమాజంలోని వ్యక్తులు తమ స్వభావిక ధర్మం, కర్మ ,చక్కగా ఆచరించడమే, వారు చేసే నిజమైన పూజ.  
శ్రీ రామకృష్ణ పరమహంస 
"Work is worship"
(నీ పనే నీ పూజ) అని నుడివినారు.
బాగుగ ఆచరింపబడిన పరమధర్మము కంటే, గుణ రహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టము.
ఉదాహరణ--: ఉపాధ్యాయుడు లాభం వచ్చునని వ్యాపారం చేయరాదు. బోధనయే లాభము రాకున్నను  అతనికి శ్రేష్టము, శ్రేయస్కరం. బోధనయే ఉపాధ్యాయుని విధి.
స్వధర్మమును ఆచరించుమనుష్యునకు పాపము ఏమాత్రము అంటదు. వీరుడు దేశ రక్షణకై శత్రు వీరుని చంపినప్పుడు, అతనికి హత్యాపాపము అంటేనే అంటదు.
కావున అర్జునా!
దోష యుక్త మైనను సహజకర్మత్యజింపరాదు. దీనికే స్వధర్మ ,నియత కర్మ, స్వభావజకర్మ, స్వభావనియతకర్మ, స్వభావకర్మ అని పేర్లు కూడా ఉన్నవి. అని శ్రీకృష్ణ పరమాత్మ సామాజిక వర్గీకరణ భావములను తెలియజేసెను.
క్షణభంగుర మూలమైన మోహాలలో చిక్కక పవిత్ర జీవనం గడిపేవారు పరమాత్మ దర్శనము, పొందగలరు. పరమాత్ముని సన్నిధికి  చేరగలరు.
---------------------------------
శ్రీమద్భగవద్గీత
అధ్యాయము 18
41నుండి44వ శ్లోకముల భావము వ్రాయబడినది.
------------------------------.

కామెంట్‌లు