అవ్వా  పొట్టేలు:- డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు

 ఒకూర్లో ఒక ముసల్ది వుండేది. ఆ ముసల్దానికి నా అనే వాళ్ళు ఎవరూ లేరు. ఒక్కతే వండుకుంటా తింటా తిరుగుతా వుండేది. వాళ్ళింటి పక్కనే ఒక చెరువుంది. ఒకరోజు పక్కింటోళ్ళు ఆ చెరువులో చేపలు పడతా వుంటే చూసి ఆ ముసల్ది కూడా చేపలు పట్టుకుందామని ఒక చిన్న వల తీసుకోని పోయింది. పొద్దున్నించీ సాయంత్రం వరకూ వల ఇసుర్తా వుందిగానీ ఒక్క చేప గూడా పల్లేదు.
"ఎప్పుడూ నాలుగో ఐదో పడతా వుండేవి. ఈ రోజేమి ఒక్కటి గూడా పల్లేదు" అనుకుంటా ఆఖరిసారి చూద్దామని వల విసిరింది. లింగులిటుకుమని సరిగ్గా మన చిటికెన వేలుంటాది గదా అంత చిన్న చిన్న చేప ఒకటి పడింది.
ఏదో ఒకటి దొరికింది చాలనుకోని ఆ ముసల్ది దాన్నే తీసుకోని ఇంటి కొచ్చింది. చూసి చూసి అంత చిన్నదానిని కూర చేసుకోని తినబుద్ది కాలేదు. దాంతో “ఎట్లాగూ నాకెవరూ లేరు. ఈ చేపపిల్లనన్నా పెంచుకుందాం" అనుకోని దాన్ని తీస్కోనిపోయి ఒక చెంబులో ఏసింది. రోజూ దానికి మూడుపూటలా బాగా అన్నం, కూరలు, పండ్లు ఎంత తింటే అంత ఏయడం మొదలు పెట్టింది.
అట్లా ఆ చేపపిల్ల రోజూ బాగా తినీతినీ వారం రోజులు తిరిగేసరికి చిటికెన వేలంత వుండేది కాస్తా చెంబంత లావయింది. దాంతో ఆ ముసల్ది దాన్ని తీస్కోనిపోయి ఒక పెద్ద బిందెలో ఏసింది. ముసల్ది మూడుపూటలా బాగా తిండి పెడతా వుంది గదా, దాంతో అది బాగా మెక్కిమెక్కీ మరోవారం తిరిగేసరికి చెంబంత వున్నది కాస్తా బిందెంతయింది. అప్పుడా ముసల్ది దాన్ని తీస్కోనిపోయి జాలాడిలోనున్న పెద్ద గచ్చులో ఏసింది. కానీ వారం తిరిగేసరికల్లా అది బాగా తినీతినీ బిందెంత వున్నది కాస్తా గచ్చంతయింది. దాంతో ఆ ముసల్ది ఇంగ లాభం లేదనుకోని దాన్ని తీస్కోనిపోయి ఇంటి పక్కనే వున్న చెరువులో వదిలింది.
ఆ ముసల్ది యాడ తిరుగుతా వున్నా అన్నం సమయానికి మాత్రం చెరువు కాడికొచ్చి “ష్..ష్..." అని పిల్చేది. అట్లా ఆ ముసల్ది “ష్.. ష్..." అనడం ఆలస్యం ఆ చేప యాడున్నా సరే రయ్యిమని ఈదుకుంటా ఆమె దగ్గరకొచ్చేది. ఆ ముసల్ది తాను తెచ్చినేటివన్నీ దానికి ప్రేమగా ఒకొక్కటే తినిపిస్తా కబుర్లాడేది.
ఒకరోజు ఆ ముసల్దానికి ఏదో పనిబడి పక్కూరికి పోయింది. సాయంకాలానికి గానీ రాలేకపోయింది. ఆరోజు మధ్యాన్నం ఏం జరిగిందంటే కొందరు గొర్రెలోల్లు గొర్రెల్ని తోలుకుంటా ఆ చెరువు కాడికి వచ్చినారు. గొర్రెలు నీళ్ళు తాగినాక వాటిని అదిలిస్తా “ష్...ష్..." అన్నారు. అవ్వే వచ్చిందనుకోని ఆ చేపపిల్ల సంబరంగా బైటికొచ్చింది. దాన్ని చూసి వాళ్ళు "అబ్బ! ఎంత లావుగుందీ చేప. దీన్నెట్లాగైనా పట్టుకుంటే బాగా కూరొండుకోని కడుపు నిండా తినొచ్చు" అనుకోని మట్టసంగా చుట్టూ చుట్టుకోని పట్టేసుకున్నారు. దాన్ని ఇంటికి తీస్కోనిపోయి చంపి పులుసు చేసుకున్నారు.
అవ్వ సాయంత్రం ఇంటికి రాగానే “పాపం! మధ్యాన్నం నించీ ఎంత ఆకలిగా ఉందో ఏమో” అనుకుంటా బెరబెరా ఒక పెద్ద గిన్నె నిండా అన్నం చేసుకోని చెరువు కాడికొచ్చి ఎప్పట్లాగే “ష్... ష్..." అని పిల్చింది. కానీ అది లోపలుంటే గదా వచ్చేది. ఎంత సేపు పిల్చినా రాలేదు.
"ఇదేందిరా బగమంతుడా! రోజూ పిలుస్తానే రయ్యిమని ఎగుర్లాడుకుంటా వచ్చేది. ఈరోజేమి ఎంత పిల్చినా రావడం లేదు. ఏం జరిగిందో ఏమో" అనుకుంటా చుట్టూ చూస్తా వుంటే చెరువు కాడ మేకల, గొర్రెల కాలిగిట్టల గుర్తులు కనబన్నాయి. "కొంపదీసి ఈ మేకలోల్లుగానీ దాన్ని పట్టుకోలేదు గదా" అనుకోని నెత్తిన గొంగళి కప్పుకోని, చేతిలో చిప్ప పట్టుకోని, అడుక్కునే దాని మాదిరి ఆ మేకలోల్ల ఇంటి కాడికి పోయి “అమ్మా! అన్నం తినక నాలుగు రోజులైంది తల్లీ! కొంచం ఏమన్నా వుంటే పెట్టండమ్మా" అంటూ అరిచింది. ఆ మేకలోల్లు ఎవరో అడుక్కుతినేది అనుకోని చేపల పులుసు తెచ్చి ఆమె తట్టలో పోసినారు. దాంతో వాళ్ళే చేప పట్టుకోని తిన్నారని ఆ ముసల్ది గుర్తుపట్టేసింది. వెంటనే వురుక్కుంటా పోయి వూరోల్లందరినీ పిల్చుకోనొచ్చి "నా చేప నాకియ్యండంటా" మేకలోల్లతో పెద్ద గొడవ పెట్టుకోనింది.
చచ్చిపోయినాక ఏదీ తిరిగిరాదు గదా. దాంతో పూరోల్లందరూ “అయిపోయిందేదో అయిపోయింది. అదిగాకుండా వేరేది నీకేది ఇష్టమైతే అది కోరుకో, మేమిప్పిస్తాం" అన్నారు. ఆ ముసల్ది ఏం కోరుకోవాలబ్బా అని ఆలోచిస్తా వుంటే వాళ్ళ దగ్గర ఒక మాంచి పొట్టేలుపిల్ల కనబడింది. దాంతో అది కావాలనింది. సరేనని వూరోళ్ళు ఆ పొట్టేలు పిల్లను ముసల్దానికి ఇప్పించినారు.
అవ్వ ఆ పొట్టేలు పిల్లని చానా ప్రేమగా చూసుకొనేది. మంచి మంచి పండ్లు, కూరగాయలూ తీసుకోనొచ్చి పెట్టేది. అట్లా కొంతకాలానికి అది పెరిగి పెద్దగయింది. అవ్వ రోజూ తన కోసం అడవికి పోయి కష్టపడి అన్నీ తీసుకొస్తా వుంటే చూసి, ఒకరోజు పొట్టేలు "అవ్వా... అవ్వా.... రోజూ నా మేత కోసం ఎందుకంత కష్టపడతావ్. నేనిప్పుడు పెద్దదాన్నయినాను గదా. నేనే పోయి తినొస్తాలే" అనింది. ఆ ముసల్ది 'సరే' అనింది.
ఒకరోజు ఆ పొట్టేలు అడవిలో పోతావుంటే దారిలో దానికి ఇద్దరు దొంగలు ఒక గుహలో నుంచి బైటికి వస్తా కనబన్నారు. వాళ్ళట్లా బైటికి పోవడం ఆలస్యం ఇది మట్టసంగా లోపలికి దూరింది. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఎత్తుకోనొచ్చిన వజ్రాలు, రత్నాలు, మణులూ, మాణిక్యాలు, బంగారం, హారాలు... ఒకటిగాదూ రెండూ గాదు... కుప్పలు కుప్పలు కనబన్నాయి. వెంటనే ఆ పొట్టేలు అట్లాఇట్లా ఒకసారి చూసి కనబన్నవి కనబన్నట్లు కుప్పలు కుప్పలు నున్నగా మింగేసి ఇంటికి చేరుకోనింది.
అవన్నీ కడుపులోనికి పోయినాయిగానీ అరగవు గదా. దాంతో ఇంటికి చేరగానే “అవ్వా అవ్వా! కడుపు ఒకటే నొస్తావుంది. కాస్త రోకలిబండ తీసుకోనొచ్చి ఒకొక్క పక్క ఒకొక్క పోటు పొడుచే" అనింది. దాంతో అవ్వ “దారిలో అడ్డమైనవన్నీ తింటే కడుపు నొయ్యక ఏం నొస్తాది" అంటూ కోపంగా రోకలిబండతో ఎడమపక్క ఒక్క పోటు పొడిచింది. అంతే... ఆ పొట్టేలు నోట్లోంచి మణులూ, మాణిక్యాలూ దభీమని కిందపడినాయి. ఆ ముసల్ది ఆచ్చర్యపోతా ఈసారి కుడిపక్కన ఒక పోటు పొడిచింది. ఈసారి వజ్రాలూ, వైఢూర్యాలూ పడినాయి. అట్లా ఒకొక్క పోటుకు ఒకొక్కటి చొప్పున కడుపులో వున్నవన్నీ ఒక్కటి గూడా మిగలకుండా అన్నీ బైటికొచ్చేసినాయి.
ఆ ముసల్ది అవన్నీ చూసి చానా సంబరపడింది. వాటిని అమ్మి పెద్ద మేడ కట్టుకోనింది. అది చూసిన పక్కింటామె "నిన్న మొన్నటి వరకూ మామూలుగానే వుండెనే. ఒక్కసారిగా యాన్నించి వచ్చిందబ్బా ఇంత డబ్బు" అని ఆచ్చర్యపోయి ముసల్దాని దగ్గరికి పోయి “ఏంది కత" అనడిగింది. ఆ ముసల్ది జరిగినదంతా చెప్పింది.
ఆ పక్కింటామె దగ్గర ఒక కుక్కుంది. ఆమె ఇంటికి పోగానే “నువ్వూ వున్నావు ఎందుకు? మూడుపూటలా తిని కూచోడానికి తప్ప ఎందుకూ పనికిరావు. పో... పోయి ఆ పొట్టేలు మాదిరి యాడన్నా ఏమన్నా దొరికితే తిని రాపో" అంటూ దాన్ని తన్ని తరిమేసింది. పాపమా కుక్క అడవిలో ఎంత దూరం పోయినా దానికి ఏమీ కనబల్లేదు. దాంతో ఎముకలూ, చెత్తా, చెదారమూ తిని మట్టసంగా ఇంటికొచ్చింది.
కుక్క ఇంటికి రాగానే ఆమె సంబరంగా చాప పరచి కుక్కను దాని మీద పన్నబెట్టి రోకలిబండతో ఎడమ పక్కన ఒక పోటు పొడిచింది. అది ఎముకలు కక్కింది. “ఇదేందిరా నాయనా" అని కుడిపక్క పొడిస్తే నానా గబ్బూ కక్కింది. దాన్తో ఆమె “ఛీ! దరిద్రం దానా! ఇండ్లంతా కంపు కంపు లేపినావు గదే" అంటూ దాన్ని తన్ని తరిమేసింది.
***********
కామెంట్‌లు
Popular posts
మహాభారతంలో ధర్మరాజుకు వాడిన పేర్లు.: -డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
బంజారా బాహుబలి పోర్య తార.: - డా ప్రతాప్ కౌటిళ్యా.
చిత్రం
అలిశెట్టి ప్రభాకర్ తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకడికి పండై ఎప్పుడూ ఎడారై ఎందరికో ఒయాసిస్సై.... నేను మొట్టమొదటగా చదివిన అలిశెట్టి ప్రభాకర్ కవిత ఇదే. అదీనూ హైదరాబాద్ రాంనగర్లో పాత్రికేయులు జి. కృష్ణగారింటికి భుజాన ఓ కెమేరా తగిలించుకుని వస్తున్నప్పటి నుంచీ ఎరుగుదును. ప్రభాకర్ నివాసముండిన ఇల్లు కృష్ణగారింటికి వెనకాతలే ఉండేది. ఒకటి కాదు రెండు కాదు తరచూ కృష్ణగారింటికి వచ్చివెళ్తుండేవారు ప్రభాకర్. వాళ్ళావిడ భాగ్యలక్ష్మిగారూ పిలల్లలూకూడా వస్తుండేవారు. కృష్ణగారికి ఓమారు ప్రభాకర్ ఓ చిన్ని కవితల పుస్తకం ఇవ్వగా అందులో "వేశ్య" కవిత చూసి బలే రాశారనుకున్నాను. క్రమంగా అలిశెట్టి ప్రభాకర్ అభిమానినయ్యాను. కానీ నేను ఆయనతో మాట్లాడింది చాలా చాలా తక్కువ. కృష్ణగారింటే కాదు రాంనగర్ రోడ్లల్లో ఎక్కడైనా కనిపిస్తే ఒక్క నవ్వు నవ్వేవాడిని.ఏడేళ్ళ క్రితం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్బులో జనవరి 12వ తేదీన అలిశెట్టి ప్రభాకర్ కవితా సర్వస్వం ఆవిష్కృత సభ జరిగితే నేనూ రేణుకా వెళ్ళాం. ఆరోజు సభలో ఎవరెవరు ఏం మాట్లాడారో గుర్తుకు రావడం లేదు కానీ అలిశెట్టివారబ్బాయ్ సంగ్రామ్ తో మాట్లాడాను. పుస్తకం కొన్నాను. సంగ్రామ్ చాలా చిన్నవాడు నేను రాంనగర్లో చూసినప్పుడు. అలిశెట్టి కవితా సంపుటిలో మొత్తం ఏడు పుస్తకాల సమాహారం. మరో మాటలో చెప్పాలంటే మూడు వందల ముప్పై అయిదు పేజీలలోని ప్రతి మాటా ప్రభాకరంటే ఎవరో తెలియని వాళ్ళకీ తెలియచెప్తుంది. తన భార్య భాగ్యలక్ష్మి గారి గురించి ఓ కవిత రాశారు..... "నాకు బెర్నార్డ్ షాలు, షేక్ స్పియర్ లూ తెలియదు తనకు గుడిపాటి వెంకటాచలం, గురజాడా తెలియదుఇద్దరం ఉత్త పిచ్చివాళ్ళంకాని - అడుగంటిన కిరసనాయిలు స్టవ్ తో అన్నం ఎట్లా ఉడికించాలో తనకు తెలుసు దగ్గు తెరల నెత్తుటి రెపరెపల ఊపిరితిత్తుల్తోకవిత్వమెట్లా రాజేయాలో నాకు తెలుసు...."ఇలా తమకేం తెలీదు ఏం తెలుసువంటివి చెప్తూ ..."గాజుకుప్పెల్లాంటి నా కళ్ళల్లోనే ఆశల అగరొత్తులు వెలిగించుకుందే తప్పతులతూగే ఐశ్వర్యమో తులం బంగారమో కావాలని ఏనాడూ ప్రాధేయపడలేదు" అని రాసుకున్న మాటల్తో ప్రభాకర్ జీవనశైలీ, నిజాయితీ, పట్టుదల విదితమవుతాయి. మరణం నా చివరి చరణం కాదు అనే విభాగానికి రాసుకున్న ముందుమాటలో ప్రభాకర్ ... "వేదనాభరితమైన నా కవితాక్షరాన్ని వేశ్యా వాటికనే పలకమీద దిద్దుకున్నప్పుడూ అక్షరనేత్రం తెరిచి ఆనాటి దొరతనాన్ని ఆగ్రహించినప్పుడూ బహుశా నాకు పద్దెనిదేళ్ళు" అని చెప్తూ కుంచె నుంచి ప్రవహించే చైతన్యం ఘనీభవించి కెమేరా ముందు సృజనాత్మకత ఒక అపరిపక్వ స్వప్నంగానే చితికిపోయి నానాటికీ దారిద్ర్యమనే ఊబిలోకి దిగబడి బహుశా ఏ పౌరుడూ పాత్రికేయుడూ పడనన్ని కష్టాలతో చితికి చితికి చివరికి పత్రిక పారితోషికమే జీవనాధారంగా స్వీకరిస్తున్న నేపథ్యంలో హృదయం విప్పి నన్నీ నాలుగు మాటలు చెప్పుకోనివ్వండీ అన్నారు ప్రభాకర్! చిత్రలేఖనంలో చమత్కారంతో పాటు పదునైన కవిత్వం రాయడంలో అలిశెట్టి ప్రభాకర్ అందవేసిన చేయి. ఆయన సాహిత్యంలో కవి కాళోజీ భావాలు కనిపిస్తుంటాయి. తాను గీసిన చిత్రానికి తనే కవిత్వం కూడా రాసుకునే ప్రక్రియతో విశేష ఆదరణ పొందిన ప్రభాకర్ మాటలు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తాయి. ప్రభాకర్ శారీరకంగా మనతో లేకపోయినా ఆయన తన చిత్రకవితల ద్వారా ఎప్పటికీ సజీవంగానే ఉంటూ ఉంటారు. ప్రభాకర్‌లాంటి సామాజిక స్పృహ కలిగిన కవులు భవిష్యత్ తరాలకు ఎంతో అవసరం. ఆయన మినీకవితలు తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాతి చెందినవే. జననం, మరణం ఒకే రోజున (జనవరి 12) కావడం యాధృచ్ఛికం. "అలిశెట్టి ప్రభాకర్ ఓ కవిత్వ మాంత్రికుడు. కుంచెని, కెమెరా లెన్సుని, కలాన్ని ఏకం చేసి తెలుగు కవితకు పుష్టి చేకూర్చిన వినూత్నకవి. ఆయన కవిత్వం గోడలపై నినాదాలై, వ్యాసాలకు మొదలు తుదలై, ప్రజల నోటి నుడికారమై మన మధ్యే ఉంటోంది" అన్న జయధీర్ తిరుమలరావు గారి మాట అక్షర సత్యం. శ్రీశ్రీ తరువాత అంత ఎక్కువగా ‘కోట్’ చేసే కవిత్వం ప్రభాకర్‌ గారిది.సమాజ మార్పును ఆకాంక్షిస్తూ 'మరణం నా చివరి చరణం’ కాదని, సమరమే తన అంతిమ చిరునామా అని ప్రకటించిన ప్రభాకర్ మాన్యుల కవి కాదు, సామాన్యుల కవిగా ముద్రపడిన కవి అని ఆయన సన్మిత్రులైన బి. నర్సన్ గారి అభిప్రాయం. ఆయన కవిత్వంలో సూటిదనం, సరళతలతో పాటు ఒకింత సాహసం కూడా ఉండడమే ప్రభాకర్‌ను భిన్న కవిగా, జనపక్షపాతిగా నిలబెట్టిందన్నారాయన. ప్రభాకర్‌ వ్యక్తిత్వమే ఆయన అక్షరాల్లో ప్రతిఫలించి ఆయన్ని ఉద్యమ కవిగా నిలబెట్టిందనికూడా చెప్పారు బి. నర్సన్.తను రాసి గీసిన కవితా చిత్రాల ఫ్రేమ్‌ల అమ్మకానికీ ముందుకు రాలేదు. ఓసారి ప్రభాకర్‌ తన కవితాచిత్రాలను చేతిలో పట్టుకొని స్కూటర్‌ వెనకాల కూర్చున్నారు. కోఠి చౌరస్తా వద్ద సిగ్నల్‌ పడింది. పక్కనే కారులో ఉన్నాయన ప్రభాకర్‌ చేతిలోని చిత్రాలను చూసి సిగ్నల్‌ దాటాక ఆగవలసిందిగా కోరారు.స్కూటర్‌ నడుపుతున్నాయన ముందుకెళ్లి ఆపారు.కారులోంచి దిగొచ్చిన మనిషి ఓ ఫ్రేమ్‌ చూపిస్తూ అది తనకు కావాలని, ఎంతకిస్తారని అడిగారు.కానీ ప్రభాకర్ "అది అమ్మడానికి కాదని జవాబిచ్చారు. కావాలని అడిగిన మనిషి ఎన్టీఆర్‌కు దగ్గరి బంధువు, ఆనాడు పార్లమెంట్‌ సభ్యుడు. స్కూటర్‌పై ప్రభాకర్‌ను తీసుకెళ్లిన ఓ మిత్రుడు నర్సన్ గారికి చెప్పడంతో ఈ విషయం తెలిసింది.స్వస్థలం నుంచిహైదరాబాద్‌ వచ్చాక ప్రభాకర్‌ గారికి ఫొటో స్టూడియో చిరునామాగా మిగిలింది గాని ఆదాయ వనరు కాలేదు. కిరాయి చెల్లించలేక విద్యానగర్‌ నుండి స్టూడియోను నారాయణగూడ నాలా పక్కన పాత దుకాణంలోకి మార్చారు. కవితలతో అందరి అభిమానాన్ని పొందిన ప్రభాకర్ తన 39వ ఏట 1993 జనవరి 12 వ తేదీ ఉదయం తుదిశ్వాస విడిచారు. నాకెంతో ఇష్టమైన కవి. చిత్రకవి. డబ్బుకోసం వెంపర్లాడని ప్రభాకర్ కలాన్ని మాత్రమే అందుకున్న కవి. అక్షరాన్ని నమ్ముకున్న కవి. అంతేతప్ప తనను అమ్ముకోని మహా కవి.- యామిజాల జగదీశ్
చిత్రం
సమయం !!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం