ఆమె ప్రతిభ అపూర్వం:- - యామిజాల జగదీశ్
 ఆరేళ్ల వయసులోనే వెబ్‌సైట్ సృష్టించి డిజిటల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అమ్మాయి. పదకొండేళ్ల వయసులో సొంత కంపెనీకి సీఈఓ CEO అయిన అసాధారణ ప్రతిభ. ఇది కథ కాదు. కేరళ గర్వంగా చెప్పుకునే శ్రీలక్ష్మి సురేష్ నిజ జీవిత విజయగాథ.
1998లో కోజికోడ్‌లో జన్మించిన శ్రీలక్ష్మి, పిల్లలు చదవడం నేర్చుకునే వయసులోనే కంప్యూటరు, ఇంటర్నెట్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. ఆరేళ్ల వయసులోనే ఆమె తన మొదటి వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఎనిమిదేళ్ల వయసులో, ఆమె తన పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌ను రూపొందించడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించింది. అప్పుడే ఆమె ప్రతిభ ప్రజల దృష్టికి వచ్చింది.
పదకొండేళ్ల వయసులో, శ్రీలక్ష్మి తన సొంత ఐటీ కంపెనీ ఇడిజైన్ టెక్నాలజీస్‌ (eDesign Technologies) ను స్థాపించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోని అతి పిన్న వయస్కులైన CEOలలో ఒకరిగా మారింది. ఆమె కంపెనీ తరువాత మైక్రోసాఫ్ట్ సహా ప్రపంచ క్లయింట్‌లకు సేవలందించింది. భారతదేశ సాంకేతిక ప్రతిభను ప్రపంచ వేదికకు పరిచయం చేసింది.
ఆమె గోల్డెన్ వెబ్ అవార్డు, నేషనల్ చైల్డ్ అవార్డుతో సహా అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ఈనాడు దాదాపు 6 మిలియన్ డాలర్ల నికర విలువతో, శ్రీలక్ష్మి భారతదేశంలోని యువతులు, పిల్లలకు శక్తిమంతమైన ప్రేరణగా నిలుస్తూ, కలలకు హద్దులు లేవని నిరూపించింది.
కన్న కలలను కలలుగా విడిచిపెట్టక వాటిని ఆచరణలో పెట్టి అనుకున్నది సాధించడంలోనే అసలైన విజయం ఉంటుంది. అప్పుడు వయస్సనేది ఓ అడ్డంకే కాదు. దీనికి శ్రీలక్ష్మి సురేష్  ప్రత్యక్ష రుజువు.


కామెంట్‌లు