దేవుడిని చూడవచ్చా?:- - యామిజాల జగదీశ్

 తమిళంలో ప్రసిద్ధి ప్రవచన కర్త కృపానంద వారియార్ చెప్పిన ఓ చిన్న కథ.
ఒకానొక రోజు ఒకడు కృపానంద వారియార్ వద్దకు వచ్చాడు. ఆయనకు నమస్కరించి "అయ్యా! నేనీ కళ్ళతో దేవుడిని చూడవచ్చా?'' అని అడిగాడు.
అయితే కృపానంద వారియార్  "నీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు, నేనొక ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం చెప్పు సోదరా! నీ ఈ శరీరాన్ని నువ్వు కళ్ళతో చూస్తున్నావా?" అని అడిగారు.
"ఏమిటి సార్! నేనేమన్నా మూర్ఖుడినా? ఏమిటీ ప్రశ్న? నాకు కళ్ళున్నాయిగా, నేనెందుకు చూడలేను? నేను చాలా కాలంగా ఈ శరీరాన్ని చూస్తూనే ఉన్నాను.'' అని అతనన్నాడు.
"సోదరా! నేను నిన్ను మూర్ఖుడవని అనేదే...నువ్వు పండితుడివే కావచ్చు.  కానీ నువ్వు చదువుకున్న జ్ఞానం స్పష్టంగా లేదు. కేవలం కళ్ళుంటే సరిపోదు. కళ్ళల్లో కాంతి ఉండాలి. చెవి ఉంటే సరిపోదు?
చెవి శబ్దాన్ని వినగలగాలి. కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు. దానిలో సూక్ష్మత, దృఢత్వం ఉండాలి. నీ విషయానికే వస్తాను. నువ్వు నీ శరీరాన్ని చూస్తున్నావు. బాగానే ఉంది. అయితే నువ్వు నీ మొత్తం శరీరాన్ని చూస్తున్నావా?'' అని అడిగారు వారియార్.
అప్పుడా వ్యక్తి "అవును. నా దేహం నాకు చాలా బాగా కనిపిస్తోంది. ఇందులో సందేహమేముంది'' అన్నాడు.
"సోదరా! తొందరపడకు. బాగా ఆలోచించి చెప్పు...నీ శరీరం మొత్తాన్ని చూస్తున్నావా?"' అని అడిగారు వారియార్.
"ఏమిటి సార్! నేను చూస్తున్నాను... నేను చూస్తున్నాను. మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్నా... ఎన్నిసార్లు చెప్పాలి... ప్రతిదీ కనిపిస్తోంది?'' అన్నాడు యువకుడు.
"సోదరా! అన్ని భాగాలూ చూడగలుగుతున్నావా?'' 
"అవును! అన్నీ కనిపిస్తున్నాయి.'' 
"మొత్తం భాగాలు కనిపిస్తున్నాయా?'' 
అతను గొంతు పెంచడమే కాకుండా కొంచెం చిరాకుగా, "అన్నీ పూర్తిగా కనిపిస్తున్నాయి" అని అన్నాడు.
"సోదరా! నీ శరీర వెనుక భాగం నీకు కనిపిస్తోందా?" అని వారియార్ అడిగినప్పుడు ఆ వ్యక్తి ఆలోచనలో పడ్డాడు. ఔను కదూ...శరీరం నాదే...కానీ వెనుక భాగాన్ని ప్రత్యక్షంగా చూడలేను గా అనుకుని "సార్! వెనుక భాగం కనిపించదు" అన్నాడు.
'అదేంటి సోదరా! మొదట అన్నీ చూస్తున్నాను అని చెప్పింది నువ్వేగా. ఇప్పుడు వెనుక భాగం కనిపించడం లేదు" అని అంటున్నావు. అంతెందుకు, కనీసం ముందు భాగం మొత్తం చూడగలుగుతున్నావా?'' అని అడిగారు వారియార్.
"ఔను...ఇందులో ఆలోచించడానికి ఏముంది? ముందు భాగం మొత్తం కనిపిస్తోంది.'' అన్నాడతను.
"అలాగా సోదరా! తొందరపడకు. ముందు భాగంలో ఉన్న అన్ని భాగాలను చూడగలుగుతున్నావా? నెమ్మదిగా ఆలోచించి చెప్పు....'' అన్నారు వారియార్. 
"ఔను, అన్ని భాగాలూ కనిపిస్తున్నాయి.....'' అన్నాడతను.
"సోదరా! మళ్ళీ చెప్పు. అన్నీ కనిపిస్తున్నాయా? జాగ్రత్తగా ఆలోచించి చెప్పు.'' అన్నారు వారి యార్.
"అవును! ఆలోచించే చెప్తున్నానండి.... ముందున్నవన్నీ కనిపిస్తున్నాయి." అన్నాడతను.
"సోదరా! ముందున్న ముఖ్యమైన భాగమైన ముఖాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? అద్దంలో చూసుకుంటే కనిపిస్తుందిగా అనకు...వొట్టి కళ్ళతో ముఖాన్ని చూడగలవా" అని వారియార్ అడగ్గా అతను తొందరపడ్డాను కదా అనుకున్నాడు. అద్దం లేకుండా ముఖాన్ని చూడలేనన్నాడు. తన తొందరపాటుని గ్రహించి క్షమించండి అని నమస్కరించాడు..
"సోదరా! ఈ శరీరంలో వెనుక భాగం అస్సలు కనిపించదు. ముందు ఉన్న ముఖమూ కనిపించదు. నీ శరీరంలో కొంత వరకే చూడగలవు. కానీ నువ్వేం చెప్పావు....నా శరీరాన్ని ఎప్పటి నుంచో చూస్తున్నానన్నావు. పైగా అసహనం కూడా.‌ నువ్వు నీ మొత్తం శరీరాన్ని చూడాలనుకుంటే, నువ్వు. నిలువుటద్దాల మధ్య నిల్చుంటే  శరీరం రెండు వైపులా చూడగలవు. మరి పరమాత్మను చూడాలంటే వొట్టి కళ్ళు సరిపోతాయా ఆలోచించు...భగవంతుడిని వీక్షించడానికి రెండు రకాల అద్దాలు అవసరం. అవి దుకాణంలో దొరకవు.‌ వాటిలో ఒకటి దేవునిక కృప. మరొకటి గురువు కృప. ఈ రెండు కృపలతోనే పరమాత్మను చూడవచ్చు.  దైవీక కృప ప్రతి చోటా ఉన్నప్పటికీ, దానిని గురువు కృప నుంచీ పొందాలి. కనుక ఈ రెండు కృపలూ తప్పనిసరి" అని అన్నారు కృపానంద వారియార్. 
అంతట అతను తన తప్పు గ్రహించి
క్షమించమని ఆయన పాదాలపై పడ్డాడు.

కామెంట్‌లు
Popular posts
మహాభారతంలో ధర్మరాజుకు వాడిన పేర్లు.: -డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
బంజారా బాహుబలి పోర్య తార.: - డా ప్రతాప్ కౌటిళ్యా.
చిత్రం
అలిశెట్టి ప్రభాకర్ తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకడికి పండై ఎప్పుడూ ఎడారై ఎందరికో ఒయాసిస్సై.... నేను మొట్టమొదటగా చదివిన అలిశెట్టి ప్రభాకర్ కవిత ఇదే. అదీనూ హైదరాబాద్ రాంనగర్లో పాత్రికేయులు జి. కృష్ణగారింటికి భుజాన ఓ కెమేరా తగిలించుకుని వస్తున్నప్పటి నుంచీ ఎరుగుదును. ప్రభాకర్ నివాసముండిన ఇల్లు కృష్ణగారింటికి వెనకాతలే ఉండేది. ఒకటి కాదు రెండు కాదు తరచూ కృష్ణగారింటికి వచ్చివెళ్తుండేవారు ప్రభాకర్. వాళ్ళావిడ భాగ్యలక్ష్మిగారూ పిలల్లలూకూడా వస్తుండేవారు. కృష్ణగారికి ఓమారు ప్రభాకర్ ఓ చిన్ని కవితల పుస్తకం ఇవ్వగా అందులో "వేశ్య" కవిత చూసి బలే రాశారనుకున్నాను. క్రమంగా అలిశెట్టి ప్రభాకర్ అభిమానినయ్యాను. కానీ నేను ఆయనతో మాట్లాడింది చాలా చాలా తక్కువ. కృష్ణగారింటే కాదు రాంనగర్ రోడ్లల్లో ఎక్కడైనా కనిపిస్తే ఒక్క నవ్వు నవ్వేవాడిని.ఏడేళ్ళ క్రితం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్బులో జనవరి 12వ తేదీన అలిశెట్టి ప్రభాకర్ కవితా సర్వస్వం ఆవిష్కృత సభ జరిగితే నేనూ రేణుకా వెళ్ళాం. ఆరోజు సభలో ఎవరెవరు ఏం మాట్లాడారో గుర్తుకు రావడం లేదు కానీ అలిశెట్టివారబ్బాయ్ సంగ్రామ్ తో మాట్లాడాను. పుస్తకం కొన్నాను. సంగ్రామ్ చాలా చిన్నవాడు నేను రాంనగర్లో చూసినప్పుడు. అలిశెట్టి కవితా సంపుటిలో మొత్తం ఏడు పుస్తకాల సమాహారం. మరో మాటలో చెప్పాలంటే మూడు వందల ముప్పై అయిదు పేజీలలోని ప్రతి మాటా ప్రభాకరంటే ఎవరో తెలియని వాళ్ళకీ తెలియచెప్తుంది. తన భార్య భాగ్యలక్ష్మి గారి గురించి ఓ కవిత రాశారు..... "నాకు బెర్నార్డ్ షాలు, షేక్ స్పియర్ లూ తెలియదు తనకు గుడిపాటి వెంకటాచలం, గురజాడా తెలియదుఇద్దరం ఉత్త పిచ్చివాళ్ళంకాని - అడుగంటిన కిరసనాయిలు స్టవ్ తో అన్నం ఎట్లా ఉడికించాలో తనకు తెలుసు దగ్గు తెరల నెత్తుటి రెపరెపల ఊపిరితిత్తుల్తోకవిత్వమెట్లా రాజేయాలో నాకు తెలుసు...."ఇలా తమకేం తెలీదు ఏం తెలుసువంటివి చెప్తూ ..."గాజుకుప్పెల్లాంటి నా కళ్ళల్లోనే ఆశల అగరొత్తులు వెలిగించుకుందే తప్పతులతూగే ఐశ్వర్యమో తులం బంగారమో కావాలని ఏనాడూ ప్రాధేయపడలేదు" అని రాసుకున్న మాటల్తో ప్రభాకర్ జీవనశైలీ, నిజాయితీ, పట్టుదల విదితమవుతాయి. మరణం నా చివరి చరణం కాదు అనే విభాగానికి రాసుకున్న ముందుమాటలో ప్రభాకర్ ... "వేదనాభరితమైన నా కవితాక్షరాన్ని వేశ్యా వాటికనే పలకమీద దిద్దుకున్నప్పుడూ అక్షరనేత్రం తెరిచి ఆనాటి దొరతనాన్ని ఆగ్రహించినప్పుడూ బహుశా నాకు పద్దెనిదేళ్ళు" అని చెప్తూ కుంచె నుంచి ప్రవహించే చైతన్యం ఘనీభవించి కెమేరా ముందు సృజనాత్మకత ఒక అపరిపక్వ స్వప్నంగానే చితికిపోయి నానాటికీ దారిద్ర్యమనే ఊబిలోకి దిగబడి బహుశా ఏ పౌరుడూ పాత్రికేయుడూ పడనన్ని కష్టాలతో చితికి చితికి చివరికి పత్రిక పారితోషికమే జీవనాధారంగా స్వీకరిస్తున్న నేపథ్యంలో హృదయం విప్పి నన్నీ నాలుగు మాటలు చెప్పుకోనివ్వండీ అన్నారు ప్రభాకర్! చిత్రలేఖనంలో చమత్కారంతో పాటు పదునైన కవిత్వం రాయడంలో అలిశెట్టి ప్రభాకర్ అందవేసిన చేయి. ఆయన సాహిత్యంలో కవి కాళోజీ భావాలు కనిపిస్తుంటాయి. తాను గీసిన చిత్రానికి తనే కవిత్వం కూడా రాసుకునే ప్రక్రియతో విశేష ఆదరణ పొందిన ప్రభాకర్ మాటలు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తాయి. ప్రభాకర్ శారీరకంగా మనతో లేకపోయినా ఆయన తన చిత్రకవితల ద్వారా ఎప్పటికీ సజీవంగానే ఉంటూ ఉంటారు. ప్రభాకర్‌లాంటి సామాజిక స్పృహ కలిగిన కవులు భవిష్యత్ తరాలకు ఎంతో అవసరం. ఆయన మినీకవితలు తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాతి చెందినవే. జననం, మరణం ఒకే రోజున (జనవరి 12) కావడం యాధృచ్ఛికం. "అలిశెట్టి ప్రభాకర్ ఓ కవిత్వ మాంత్రికుడు. కుంచెని, కెమెరా లెన్సుని, కలాన్ని ఏకం చేసి తెలుగు కవితకు పుష్టి చేకూర్చిన వినూత్నకవి. ఆయన కవిత్వం గోడలపై నినాదాలై, వ్యాసాలకు మొదలు తుదలై, ప్రజల నోటి నుడికారమై మన మధ్యే ఉంటోంది" అన్న జయధీర్ తిరుమలరావు గారి మాట అక్షర సత్యం. శ్రీశ్రీ తరువాత అంత ఎక్కువగా ‘కోట్’ చేసే కవిత్వం ప్రభాకర్‌ గారిది.సమాజ మార్పును ఆకాంక్షిస్తూ 'మరణం నా చివరి చరణం’ కాదని, సమరమే తన అంతిమ చిరునామా అని ప్రకటించిన ప్రభాకర్ మాన్యుల కవి కాదు, సామాన్యుల కవిగా ముద్రపడిన కవి అని ఆయన సన్మిత్రులైన బి. నర్సన్ గారి అభిప్రాయం. ఆయన కవిత్వంలో సూటిదనం, సరళతలతో పాటు ఒకింత సాహసం కూడా ఉండడమే ప్రభాకర్‌ను భిన్న కవిగా, జనపక్షపాతిగా నిలబెట్టిందన్నారాయన. ప్రభాకర్‌ వ్యక్తిత్వమే ఆయన అక్షరాల్లో ప్రతిఫలించి ఆయన్ని ఉద్యమ కవిగా నిలబెట్టిందనికూడా చెప్పారు బి. నర్సన్.తను రాసి గీసిన కవితా చిత్రాల ఫ్రేమ్‌ల అమ్మకానికీ ముందుకు రాలేదు. ఓసారి ప్రభాకర్‌ తన కవితాచిత్రాలను చేతిలో పట్టుకొని స్కూటర్‌ వెనకాల కూర్చున్నారు. కోఠి చౌరస్తా వద్ద సిగ్నల్‌ పడింది. పక్కనే కారులో ఉన్నాయన ప్రభాకర్‌ చేతిలోని చిత్రాలను చూసి సిగ్నల్‌ దాటాక ఆగవలసిందిగా కోరారు.స్కూటర్‌ నడుపుతున్నాయన ముందుకెళ్లి ఆపారు.కారులోంచి దిగొచ్చిన మనిషి ఓ ఫ్రేమ్‌ చూపిస్తూ అది తనకు కావాలని, ఎంతకిస్తారని అడిగారు.కానీ ప్రభాకర్ "అది అమ్మడానికి కాదని జవాబిచ్చారు. కావాలని అడిగిన మనిషి ఎన్టీఆర్‌కు దగ్గరి బంధువు, ఆనాడు పార్లమెంట్‌ సభ్యుడు. స్కూటర్‌పై ప్రభాకర్‌ను తీసుకెళ్లిన ఓ మిత్రుడు నర్సన్ గారికి చెప్పడంతో ఈ విషయం తెలిసింది.స్వస్థలం నుంచిహైదరాబాద్‌ వచ్చాక ప్రభాకర్‌ గారికి ఫొటో స్టూడియో చిరునామాగా మిగిలింది గాని ఆదాయ వనరు కాలేదు. కిరాయి చెల్లించలేక విద్యానగర్‌ నుండి స్టూడియోను నారాయణగూడ నాలా పక్కన పాత దుకాణంలోకి మార్చారు. కవితలతో అందరి అభిమానాన్ని పొందిన ప్రభాకర్ తన 39వ ఏట 1993 జనవరి 12 వ తేదీ ఉదయం తుదిశ్వాస విడిచారు. నాకెంతో ఇష్టమైన కవి. చిత్రకవి. డబ్బుకోసం వెంపర్లాడని ప్రభాకర్ కలాన్ని మాత్రమే అందుకున్న కవి. అక్షరాన్ని నమ్ముకున్న కవి. అంతేతప్ప తనను అమ్ముకోని మహా కవి.- యామిజాల జగదీశ్
చిత్రం
సమయం !!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం